9, సెప్టెంబర్ 2013, సోమవారం

మహా గణపతిం భజే!


ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా శుక్లాం బరధరం చదవాల్సిందేకదా!
వినాయకుని కెంతో ఇష్టమైనది భాద్రపద  శుద్ధ చవితి. సకల గణాధిపతి. ఈ వినాయకుని శ్రద్ధతో ఈ రోజు ఆరాధిస్తే సకల ఇష్టసిధ్ధి కలుగుతుంది. నైవేద్య ప్రియుడు ఈ దేవుడు. ఉండ్రాళ్ళతో పాటు రకరకాల పిండివంటలు సమర్పిస్తాము. గుంజీళ్ళు తీసినా, రెండుచేతులు ముడిచి తలపై కొట్టుకున్నా మన తప్పులన్నీ క్షమించేస్తాడట. సంకష్ట హరుడు. స్వయంభువు. ఇట్టి వినాయకుని మనసార పూజించితే సంభవించే కష్టాలను హరించగలడు.

ఎర్రరంగు వినాయకుని మన ఇంటి గుమ్మం ఎదురుగ్గా పెట్టుకున్నట్లైతే ఎటువంటి ఆరోగ్య సమష్యలు తలెత్తవట. తెల్లటి వినాయకుని ఇంటిలో ఉంచుకున్నట్లైతే ఎంతో స్వచ్చమైన మనసుతో సంతోషంగా ఉంటారట. ఆకుపచ్చ, పసుపుపచ్చ కలిపి వినాయకుని తయారు చేసుకున్నట్లైతే సకల సంపదలతో, సౌభాగ్యంతో విలసిల్లుతారట. బంగారు వన్నెలో మెరిసిపోయె వినాయకున్ని తయారుచేసుకున్నట్లైతే సకల గుణాభిరాములవ్వటమే కాక, దయార్ద్ర హృదయంతో సంఘసేవా తత్పరులౌతారట.

ఓంకారం అంటే గణపతి స్వరూపమే! ముక్కోటి దేవుళ్ళలో గణపతికే పెద్ద పీట వేసాం. మొదట స్మరించేది కూడా ఆయన్నే! చిన్నపిల్లలు విద్యాప్రాప్తి కోసం పూజించే దేవుడు.ప్రతి ఒక్కరు అంతుపట్టని ఆ వింత దేవుణ్ణి మనసుల్లో కలకాలం నిలుపుకున్నట్లైతేసకల సుఖాలను కలిగించే దేవుడు ఈ గణపతి....

మరి నేను తయారు చేసుకున్న ఈ గణపతులు ఎలా ఉన్నారు?

స్నేహితులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.













*************************************************************************************************************************************************** 


17, ఆగస్టు 2013, శనివారం

చక్కని తల్లి కి ఛాంగు భళా!



శ్రావణమాసం వస్తోందంటే నాకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ నెలంతా పండగ శోభే కదా!
వరలక్శ్మి పూజ కూడా నాకు చాలా ఇష్టం. చక్కగా అమ్మవారిని (మనల్ని కూడా:) అలంకరించి పేరంటాళ్ళను పిలిచి తాంబూలాలిచ్చుకోవాలంటే మరీ ఇష్టం. మరి మా అమ్మవారిని చూస్తారా...ఎలా ఉన్నారు....నాకైతే నిండుగా దీవెనలిచ్చేట్లుగా కనిపిస్తున్నారు.




లక్ష్మీనారాయణులకు, పార్వతీపరమేశ్వరులకూ ఎంతో ఇష్టమైన శ్రావణం లో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు.




నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మి నమోనమ:




పదియారు వన్నెలతో బంగారు ప్రతిమా
చెదరని వెదముల చిగురు భోడి
ఎదుట శ్రీ వెంకటేసునిల్లాలవై నీవు
నిధువ నిలిచె తల్లి నీ వారమమ్మా
జయలక్ష్మి వరలక్ష్మి......





ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా! వరలక్ష్మి తల్లి!
ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ
వరలక్ష్మి తల్లి
ఆట్లాడె బాలవు నీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి
కోట్లా ధనమిచ్చే తల్లి
వేయి నామాల కల్పవల్లి , మాపై కరుణించి సాయము ఉండు తల్లి!


క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయకు ఇదె నా నీరాజనం....




*************************************************************************************************************************************************** 

27, జులై 2013, శనివారం

నూటపదహారేళ్ళ నండూరి వారి కి ఈ యెంకి....

'ఎంకెవ్వరని లోకమెపుడైన కదిపితే వెలుగు నీడల వైపు వేలు చూపింతు'.... 

నాయుడు బావ దే యెంకి .... యెంకి వంటి పిల్ల లేదోయి బావా! 

  నూటపదహారేళ్ళ నండూరి వారి కి ఈ యెంకి....




గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ
      కూకుండనీదురా కూసింతసేపు !




ఆ చిత్రముకు మెరుగు నీ చక్కదనమే !
       యీ చిత్తమునకు వెలుగు నీ యెంకితనమే !



ఎకసకె మెవరికి తెలుసు ?
 ఎంకిచిలుక మనుసు గడుసు !




అద్దమేలంటాది అందాలు తెలప
ముద్దుమాటలకెంకిదె ముందునడక




జాము రేతిరి యేళ జడుపు గిడుపూ మాని
 సెట్టు పుట్టా దాటి సేనులో నేనుంటె
  మెల్లంగ వస్తాది నా యెంకీ !
   సల్లంగ వస్తాది నా యెంకీ !



సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ
బారెడైనా కొండ పైకి సాగిందేమొ
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ

తాను నిలిపిన గడువు దాటిపోనేలేదు
కాలుసేతులు పక్కకంటుకొని పోనాయి 



  ఎంకి వన్నెల చీర నెగిరె వెన్నెల పూలు
      ఎండుటాకుల గొలుసు వెండి తీగెలుచేరె!

***************************************************************************************************************************************************************************************************


30, జూన్ 2013, ఆదివారం

పాకుడురాళ్ళు



 జ్ఞానపీఠ పురష్కారం పొందిన రావూరి భరద్వాజ గారి పుస్తకం పాకుడురాళ్ళు. చలన చిత్ర రంగంలో వెలుగు నీడలు, కష్టసుఖాలు, వడిదుడుకులూ...సినిమా వెనుక గల సినిమా చరిత్రని వివరించిన పుస్తకం ఇది. ఈ పుస్తకం చదవాలన్న ఏనాటి నా కోరికో, జ్ఞానపీఠ్ అవార్డ్ వచ్చి కొత్త ప్రింట్ విడుదలయినాక గాని తీరలేదు.

అట్టడుగు నుంచి సినిమా రంగం లో పైకి రావాలనుకునే మంగమ్మ లాంటి వాళ్ళ కథ సర్వ సాధారణం. పసితనం లోనే నాగమణి తో చేదు అనుభవం ఏర్పడింది. ఆ తరువాత చిన్నతనంలోనే నాటకరంగానికి వచ్చి అక్కడ తన ప్రతిభతో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మంగమ్మ. రామచంద్రారావు, మాధవరావుల స్నేహంతో ఒక భద్రత ఏర్పరుచుకోటానికి ప్రయత్నిచటమే కాక నాగమణి నుంచి కూడా బయట పడగలిగింది. ఆ నాటక సమాజం మూతపడడంతో ఏమీ తోచని మంగమ్మ చలపతి పరిచయం తో సినిమా రంగం మీద ఆశ పెంచుకొంది. నాగమణి ని చూడాలన్న కోరికతో బయలుదేరిన మంగమ్మ తన నేస్తం రాజమణి ని కలుసుకొని వారి హీనబ్రతుక్కి చలించిపోయింది. వసంత ను ఇష్టపడి ఆమె చాలా బాగా పాడుతుందని తెలుసుకొని తనకి భవిష్యత్తులో సహాయం చేయటానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చింది. నాగమణి ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉందో తెలుసుకుంటుంది. నాగమణి ని కలవలేక పోతుంది.

చివరికి చలపతితొ మద్రాస్ నగరానికి వచ్చి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. మంగమ్మ మంజరిగా మారింది.మంగమ్మ ప్రతిపాదించిన మంజరి పేరును పరబ్రహ్మ శాస్త్రి సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్యానం  సరదాగా అనిపిస్తుంది. చలపతి తెలివి తేటలతో తాను కూడా ఒక సమిధగా మారి పోతుంది. క్రమంగా అన్ని పరిస్థితులు తెలుసుకొని స్వయంగా అభివృద్ధి చెందే పథకాలను తానే సిద్ధం చేసుకోగలుగుతుంది. అందుకు హీరోయిన్ కళ్యాణి స్నేహం ఎంతో తోడ్పడింది. చివరికి సినీవినీలాకాశం లో ఓ మూల నుండి జారి పడిపోయింది ఈ మిణుకు తార కళ్యాణి. వెంకటేశ్వర్లు, మెహెతా, మొదిలియార్, రాజన్ వంటి వారి సహాయాన్ని అంచెలంచలుగా వాడుకుంది మంజరి. రాజమణి, వసంతలను తన దగ్గరికి రప్పించుకొంది. మంజరి క్రమంగా చలపతిని దూరం చేసినా, తన కు ఏర్పడిన అనేక సమస్యల్లో చలపతి మీదనే ఆధారపడక తప్పలేదు.తనకు నచ్చని శర్మని కూడా చాతుర్యం తో తన భవిష్యత్తు ప్రణాళికల్లో ఉపయోగించుకో గలిగింది. తన విదేశీ యాన కోరికను గౌరవప్రదంగా తీర్చుకో గలిగింది. మర్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ వంటి నటీమణులను కలుసుకొని, వారి అనుభవాలను తెలుసుకొని ప్రపంచమంతా'నటీమణి' పరిస్థితి ఒకటే, ఎంతటి విషాదం పేరుకొని పోయి ఉంటుందో  అని తీవ్రమైన వ్యధకు లోనౌతుంది .   బొంబాయ్ లో సక్సేనా పరిచయం మంజరి కలలను పండించి హిందీ సినీ పరిశ్రమలోకం లో యధేచ్చగా వీరవిహారం చేయించింది.  మంజరి పతనానికే దారి తీసింది. చివరికి మిగిలింది....పగిలిన అద్దం లో ముక్కలైన మంజరి జీవితం....

ఈ నవలలో ఏ ప్రాంతం మాటలో కాని చాలా పదాలు నాకు కొత్తగా అనిపించాయి.
దత్తి, పిక్కట బిర్రుగా వచ్చారు, రెక్కొట్టింది, అపనయించుకుంటూ, ఆకాయ పోకాయ వెధవలు, తెక్కట్లాడుతూ, అలవసులవలకు, గనుపు, ఠాలా ఠోలీ రకం, లాయలాస, నిప్పచ్చరం, రొళ్ళగొట్టడం, మైదు .... ఇలాంటివి. ఇంకా చాలానే ఉన్నాయి,

ఈ పుస్తకం  రచించిన విధానం, శైలి, పరిశీలనా శక్తి  చాలా బాగుంది.  ఇటువంటి కథ సినిమా చరిత్ర లో మామూలే అనిపిస్తుంది. కాలువేస్తే జారిపోయే పాకుడురాళ్ళు,జీవనపోరాట గమనాన్ని, తన భావజాలం తో రచయిత బాగా వ్యక్తీకరించారు. ఆయా ఘట్టాలను చిత్రించిన విధానం బాగుంది. అట్టడుగు నుంచి జీవితం ప్రారంభించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రతిభాశాలి మంజరి గురించి, తన ధ్యేయాన్ని సాధించుకోటానికి చేసిన కృషిని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నది చక్కటి మామూలు తెలుగు భాషలో రాసారు.
ఒక మహానటి జీవితంలో కొన్ని అనుభవాలను ఆధారంగా తీసుకున్నట్లు రచయిత వివరించారు. కథాక్రమంలో హీరోలతో వచ్చే బేధాభిప్రాయాలలో వేరే నటి కూడా మదిలో తళుక్కుమంటుంది. సినీ పరిశ్రమలో నటిగా కాలుపెట్టి, పునాదులేర్పరుచుకొని, జీవిత నిర్మాణాన్ని పూర్తిచేసుకోవటానికి ఆ నటి పడే మానసిక వ్యధ మాత్రమే కాకుండా ఎంతటి దుర్భర జీవితాన్ని ఎదుర్కోవాలో, ఎన్ని వ్యసనాలకు లోబడుతుందో తన స్వయం పరిశీలనతొ రచయిత వివరించారు. సస్పెన్స్ అని కాదు గాని ఎంతో ఉత్సుకతతో చదువుతాం. మనం ఇష్టపడే నటీమణుల జీవితం లో రహస్యాలు మన కళ్ళముందు అలా అలా పరుచుకొని పోతూనే ఉంటాయి.

ఎలాగైనా పైకి రావటమే ముఖ్యం. కన్నీరుకు విలువలేదు.మన హోదా కీర్తి ప్రతిష్టలు మాత్రమే జనం చూస్తారు. నిజాయితి తో దరిద్రమే తప్ప ఏమీ లేదు.ఏదో విధంగా డబ్బు సంపాదించాలి.  .....ఇదీ చివరికి మంజరిలో వచ్చిన మార్పు.

  తనను తరిమి కొట్టిన వారి మీద, అపవాదులు వేసిన వారి మీద విపరీతమైన ధ్వేషం పెంచుకుంటుంది.  ఇది మంజరికి సినీపరిశ్రమ మీద ఏర్పడిన కసి. చివరికి అటువంటి వారిని తన దయాదాక్షిణ్యాల కోసం వెంపర్లాడే పరిస్థితి ఏర్పరుస్తుంది. విపరీతం గా నిర్లక్ష్యం చేస్తుంది. తనకు తగిలిన దెబ్బలు, అనుభవించిన నరకయాతన ఆమె బతుకును తీర్చిదిద్దాయి. అనుభవాలనుండి వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకుంది. మానవతా హృదయంతో అంతులేని సంఘసేవ చేసింది.

 సినీ జగత్తునే తన పాదాక్రాంతం చేసుకున్న మంజరి జీవితపు  అమానుషమైన  ముగింపును తట్టుకోటం మాత్రం మానవమాత్రుడి తరం కాదు!!!!

 ఇది ఒక  'Dance of Death ' .



*************************************************************************************************************************************************** 

29, మే 2013, బుధవారం

రవీంద్రుని చిత్రాలు






రవీంద్రనాథ్ ఠాగోర్ 150 వ జయంత్యుత్సవాల సందర్భంగా సాలార్జంగ్ మ్యూజియం లో ఏర్పాటు చేసిన ఆయన వేసిన చిత్రాల ప్రదర్శన మే 11 న ప్రారంభించారు. అది ప్రదర్శకులను అద్భుతంగా ఆకర్శిస్తోంది. ఠాగోర్ వివిధ సందర్భాలలోగీసిన చిత్రాలతో, మ్యూజియం వెస్టర్న్ బ్లాక్ లో రెండో అంతస్థులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసారు. జూన్ 10 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

ఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, సాలార్జంగ్ మ్యూజియంలు కలసి ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ 'ద లాస్ట్ హార్వెస్ట్ ' పేరుతో ప్రముఖ చిత్రకారుడు పద్మశ్రీ జగదీశ్ మిట్టల్ ప్రారంభించారు. ఠాగోర్ ప్రకృతి అందాలను అద్భుతంగా చిత్రించి సహజ చిత్రకారునిగా, విశ్వగురువుగా గుర్తింపు పొందారని  అన్నారు. రవీంద్రుడు హైద్రాబాద్ లోనే (1934-1945) ఎక్కువ చిత్రాలను గీసారట. ఠాగూర్ తన 60 వ ఏట చిత్రాలు వేయటం ప్రారంభించారట.

శాంతినికేతన్ ఫైన్ ఆర్ట్స్ విభాగాధిపతి శ్రీ శివకుమార్ కూడా ఠాగోర్ చిత్రకళను వివరించారు. ఠాగోర్ గొప్ప రచయిత అయినప్పటికి ఆ ప్రభావం అతని చిత్రాల మీద పడలేదు. సాధారణ జన జీవితాలకు అద్దం పట్టే చిత్రాలు గీసారు. ప్రకృతి రమణీయత, బెంగాల్ రాష్ట్ర గ్రామీణ జీవితాన్ని ఈ చిత్రాలలో ఎక్కువగా చూడొచ్చు.

ఎన్.జి.ఎం.ఎ. శాంతినికేతన్ నుంచి 150 చిత్రాలను తెప్పించి ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసారు. మ్యూజియం డైరెక్టర్ శ్రీ నాగేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి శ్రద్దగా ఎన్నో విషయాలను వివరిస్తున్నారు.

చిత్రకళ మీద అభిరుచి ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిన ప్రత్యేక ప్రదర్శన ఇది. ఈ చిత్రాలు మనకు ఠాగొర్ మనోభావాలు, సునిశిత పరిశీలన, సమాజం పట్ల అవగాహన, సృజనాత్మకత తెలియజేస్తుంది. ఠాగోర్ పూర్తి వ్యక్తిత్వాన్ని మనతో చదివిస్తుంది. ఒక విభిన్న వ్యక్తిని చూపిస్తుంది. ఊహాలోకాల్లో ఊపేస్తుంది.







***************************************************************************************************************************************************

17, ఏప్రిల్ 2013, బుధవారం

మా హ్యాపీకొండల విహారం





ఎలాగైన ఈ శెలవుల్లో తప్పకుండ ఎక్కడికన్నా వెళ్ళాలి సంధ్యా! ప్లాన్ చేయి కనీసం రెండు, మూడు రోజులన్నా వెల్దాం అన్నాను మా ఫ్రెండ్ తో. అవును ఎప్పుడు ఇదే ఊళ్ళో, ఈ రొటీన్ తో విసుగ్గా ఉంది. నువ్వే చెప్పు ఎక్కడికైనా తప్పకుండా వెల్దాం అంది. ఏదైనా ఊటీ లాంటి చోట్లకు వెల్దామా, మనిషన్నాక కొంతన్నా 'కళా పోషణ ' ఉండాలి కదా అన్నాను. బాగానే ఉంటుంది కాని ఎప్పుడంటే అప్పుడు ఎకామొడేషన్ దొరకదు, నీకు ఎప్పుడూ కొండలు, గుట్టలు పట్టుకుని తిరుగుదామనే, కాస్తన్న తీర్ధయాత్రలు చేద్దమని లేదు. పెద్దవాళ్ళమైతే తిరిగే ఓపిక ఉండదు. కేదారినాధ్ కో బదరీనాధ్ కో పొదాం పద అంది. సర్లే హిమాలయాల్లో తిరగొచ్చు అనుకున్నాను. వెంటనే ఒప్పేసుకున్నాను కూడ. కాని మనతో పాటు వేరే ఫ్రెండ్స్ నెవరినైనా తీసుకొని పోదాం, చాలాదూరం కదా అన్నాను.

ప్రియంవద, గాయత్రిలను తీసుకు పోదాం అని సలహా కూడ ఇచ్చాను. సర్లే నేను టీచర్, నువ్వు లెక్చరెర్ కాబట్టి మనకు శెలవులు, వాళ్ళకి అన్ని రోజులు రావలంటే ఎలావీలవుతుంది, ఒకరు జర్నలిస్ట్, ఇంకోరు జోనల్ ఆఫీసర్ అంది. అదిసరే ఎలావెళ్ళాలో ప్లాన్ చేసి తర్వాత వాళ్ళకు చెప్దాం, సదరన్ ట్రావెల్స్ కనుక్కుందాం, వాళ్ళు అరేంజ్మెంట్స్ బాగా చేస్తారట అన్నాను. వెంటనే ఫోన్ చేసి ట్రిప్ ఎప్పుడు ఉంది మాకు నాలుగు టికెట్స్ కావాలి అని అడిగాను. వాళ్ళు చాలా కూల్ గ నెక్ష్ట్ ఇయర్ కైతే దొరుకుతాయి మేడం, ఇప్పుడు అన్నీ బుక్ అయిపోయాయి అన్నారు. మాకు బిక్కమొహాలు పడ్డాయి. ఆలోచనల్లో పడ్డాం.

ఆ టైం కి నా చేతిలో ఈనాడు సండే మాగజైన్ ఉంది. అందులో పాపికొండల విహారం గురించి ఎవరో రాసిన ఒక ఆర్టికల్ ఉంది. నాకు వెంటనే అనిపించింది. మనం కూడా పాపికొండలకి వెళ్ళొచ్చుకదా, భద్రాచలం మనకంత దూరమేమి కాదు. గాయత్రి, మొన్నెప్పుడో అందికదా భద్రాచలం చెకింగ్ కి వెళ్ళాలి అని , తనతో వెళ్ళిపోదాం, ప్రియ కి అక్కడ ఏదో ఒక పని చేతికి తగుల్తుందిలే అన్నాను. ఔను, ఇంకాలస్యం ఎందుకు గాయత్రికి ఫోన్ కొట్టేస్తాను ఉండు, అని ఫోన్ చేసింది. ఏంటే, ఇప్పుడు ఫోన్ చేసావ్, నేను చాలా పన్లో ఉన్నాను, రేపసలే భద్రాచలం పోవాలి అంటూ లైన్లోకి వచ్చింది గాయత్రి. 'అయ్యాబాబొయ్,ఉండుండు, మాకు చెప్పకుండా వెళ్ళిపోదామనే, మమ్మల్ని కూడా నీతో తీసుకెళ్ళు, అక్కడ పాపికొండలు పోదాం, తలుచుకుందే తాత పెళ్ళిలాగ భలే దొరికావ్, అన్నాను. 'అబ్బ ఇప్పుడు మీతో నాకెక్కడ వీలైతుంది, అదేదో పిల్లిని చంకలో పెట్టుకొని పోయినట్లైతుంది నా పని ' అంది. మమ్మల్ని పిల్లులతో పోలుస్తావా, డామేజ్, నీతో మాట్లాడం పో అన్నాను. ఏడిశావ్లే, డ్రైవర్ వచ్చాక చెప్తాను. పొద్దున్నే నాలుగింటికల్ల రేడీ గ ఉండండి,మిమ్మల్ని పికప్ చేస్తాడు వెళ్ళిపోదాం అంది. ప్రియంవదకి చెప్తే నేను మా బాస్ పర్మిషన్ తీసుకోని వస్తాన్లే, అంది. ఇంక అప్పటినుంచి మేము నేలమీద నిలబడితే ఒట్టు.

మనది రెండు రోజుల ప్రయాణమే కాబట్టి ఎక్కువ సద్దుడు-గిద్దుడు పెట్టకు అన్నాను సంధ్యతో. నువ్వు చీరలు-గీరలు పెట్టకు ఒక్క పట్టు చీర పెట్టుకొ చాలు భద్రాచలం లో గుడికి కట్టుకోవచ్చు. ఒక్క నైటీ, నాలుగు షల్వార్,కుర్తాలు పెట్టుకో, బొట్ట్లు-గిట్లు అన్ని హండ్బాగ్ లో పెట్టేసుకుందాం అంది. తనకన్నీ జంట పదాలు మాట్లాడటం అలవాటు. సర్లే 'లెస్ లగ్గేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ' అలాగే చేద్దాం అని ఇంటికి వెళ్ళిపోయాను.

ఇంక మొదలయింది అప్పటినుంచి నా హడావుడి. ఇంట్లో మా అత్తగారికి, మామగారికి, మా వారికి డిక్లేర్ చేసేసాను, నేను ఇంట్లోంచి మూడు రోజులు మాయమైపోతున్నాను, ఎవరిపన్లు వాళ్ళు చేసుకొండి అని. మా వాడు ఎలాగు ఇక్కడ లేడు. వాడికీ ఫోన్ చేసి నేను మాఫ్రెండ్స్ తో పాపికొండలు పోతున్నాననీ చెప్పేశాను. అమ్మా! నీకసలే తొందరెక్కువ జాగ్రత్త అన్నాడు వాడు. నాకు తెల్సులేర పిల్ల కాకివి నువ్వేంటి నాకు చెప్పేది అన్నాను. ఇంక మా అత్తగారు, మామాగారి జాగ్రత్తల లిస్ట్ చాలా పెద్దది. ఇంకపోతే మా Mr. శ్రీ రాజా రఘువీరేంద్ర ప్రతాప్ రాఠోర్ సాబ్   ఏవిటో పెద్దగా పట్టించుకోలేదు. శూన్యం లోకి ఒక చూపు చూసి, ఎవరితో వెల్తున్నానో మాత్రం కనుక్కొని ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని ఫోన్లు చేస్తుండు అని మాత్రం చెప్పి ఊరుకున్నారు.

     
                                           
ఇంక తెల్లారిందండి. కార్ వచ్చింది. అందరం కార్లో చేరి్పోయాం. ఆ తెల్లవారుఝామున, చీకట్లు తొలిగిపోతు, ఊరుదాటుకుంటు విశాలమైన ఆ నిశ్శబ్ధ ప్రపంచంలొ అందమైన సూర్యోదయం, ఆకాశంలో మారుతున్న అనేక రంగులు చూస్తూ నన్ను నేనే మర్చిపోయాను. ఆహా! ఎన్నాళ్ళ తర్వాతో కదా ఇంత అందమైన దృశ్యాన్ని చూస్తున్నాను అని పరవశించి పోయాను. చిన్నప్పుడు నాగార్జున సాగర్ లో ఉండే వాళ్ళం. అప్పటి ప్రకృతి కాంత అందాలన్నీ తిరిగి నా మనసులోకి రావటం మొదలైంది. ఆ రోజులన్నీ 'గుర్తుకొస్తున్నాయి 'అని పాడుకోవాలనిపించేట్లు ఉంది. తెచ్చుకున్న రకరకాల తినుబండారాలు దారిపొడుగునా తింటూనే పోయాం. ప్రయాణం లో ఏ సమస్యలు రాకుండానే సాయంత్రానికల్లా భద్రాచలం చేరుకున్నాం.

బూర్గుంపహాడ్ అనే చిన్న గ్రామానికి భద్రాచలానికి మధ్య నిర్మించిన వంతెన దాటుతుంటే ఆ చల్లని గాలికి కింద గోదావరి నదీమతల్లి అందానికి పరవశించిపోయాను. ఎప్పుడు ఏ నది దాటుతున్నా అందులో ఒక రూపాయి నాణెం వేయటం నాకలవాటు. అలాగే చేసి దండం పెట్టుకున్నాను. ఆ వంతెన మీద కాసేపు ఆగాము. అక్కడినుంచి నదికి, గుడికి దగ్గరలోనే ఉన్న ఒక గెస్ట్ హౌస్ కి చేరుకున్నాం. మా నలుగురికి కలిపి రెండు ఏ.సి. రూంలిచ్చారు. అక్కడ ఫ్రెషప్ అయ్యాం. అక్కడి నుంచి రాముల వారి గుడికి నడుచుకుంటు బయలు దేరాం. రాత్రి ఏడు గంటల సమయంలో గుట్టమీద, ఆ గుడి మీద అందమైన దీపాలు ఆకాశంలో చుక్కల్లాగా మెరిసిపొతూ మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లనిపించింది. గుళ్ళో నిశ్శబ్దం చాలా ప్రశాంతంగ అనిపించింది. సులభంగానే దర్శనం అయింది.అక్కడి మ్యూజియం లో అమ్మవారి వివిధ నగలు చూసాం. చూస్తున్నంతసేపు నాకు రామదాసు పడ్డకష్టాలు, అతను పాడుకున్న 'ఎవడబ్బ సొమ్మని ' పాటే గుర్తుకొచ్చింది ఎందుకో. చుట్టుపక్కల పరిసరాలు చూస్తు అక్కడే చాలాసేపు గడిపాం. తీరిగ్గ హోటల్ లో తోచింది తిని మా గెస్ట్ హౌస్ చేరుకున్నాం. తీరా చూస్తే నేను, సంధ్య ఉన్న రూం లో ఏ.సి. పని చేయటం లేదు. మమ్మల్ని కూడ వాళ్ళ రూం లోకి వచ్చేయమన్నారు. సరే, ఈ నలుగురం ఒక రూం లోనే చేరి చెప్పుకున్న ఆ కబుర్లని రాత్రి ఎక్కువసేపు భరించలేక వెళ్ళిపోయింది. 

                                                

మనం పొద్దున్నే బయలుదేరి కూనవరం చేరుకోవాలి. అక్కడినుంచి బోట్లల్లో వెళ్ళాలి, వెళ్ళిపోదాం, బోట్లల్లో వాళ్ళు వేడి వేడి ఉప్మా పెడుతారు, చాలా బాగుంటుంది, అక్కడే మన బ్రేక్ ఫాస్ట్ పదండీ అని గాయత్రి మమ్మల్ని కదిలించింది. కార్లోనే కూనవరం వరకు వెళ్ళాం. గాయత్రి 24 ఘంటలు ఫోన్లో ఏదో మాట్లాడుకుంటు బిజీ గా ఉంది. మేము మాత్రం అక్కడి ప్రకృతి అందాలకి పరవశించి పోయాం. దారి పొడుగూతున చిన్న చిన్న నీటి మడుగులు, అందులో తెల్లని, ఎర్రని కలవపూలు, అన్ని పూలు, ఆచెట్లు ,కోయిలల కుహు కుహూ రాగాలు, ఆ సన్నటి పిల్లగాలి- ఓహ్- పరవశించకుండా ఎలా ఉండగలం. దారిలో చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద కలువపూల గుత్తులు చేతిలో పెట్టుకొని అమ్ముతున్నారు. చాలా పూలే కొనుక్కున్నాం. మా కార్ అంతా చక్కటి సువాసనలతో నిండిపోయి
 ఒకలాంటి మత్తులో పడిపోయాం. 


ఇవన్నీ చూసుకుంటు కూనవరం చేరేసరికి 9 అయిపోయింది. 10 గంటల తరువాత అక్కడినుంచి బోట్లు బయలు దేరవు. ఎందుకంటే నదిమీద వెళ్ళిన బోట్లు సాయంత్రం 6 గంటల కల్లా తిరిగి వచ్చేయాలి. నదిమీద అయిదుగంటల ప్రయణం చేస్తాం.కాని అక్కడ చాల రష్ గా ఉంది. మాకు అసలు ఏ బోట్ అయినా దొరుకుతుందా అనిపించింది. అయినా పర్వాలేదు, గాయత్రి ఉందిగా. మాతోపాటు భద్రాచలం నుంచి వాళ్ళ అసిస్టెంట్ ఒకరు మాతోనే వచ్చారు. ఎందుకు గాయత్రి మనతోటి ఆయన, అసలే సిలిండర్ లాగా, ముందు సీట్ మొత్తం అయనకే ఇచ్చి మనం నలుగురం వెనక ఇరుక్కోవాలి, వొద్దులే అన్నాను. నీకు తెలీదులే రానీ అంది. ఇప్పుడర్ధమైంది ఎందుకు రమ్మందో. ఆయన చాలా అందమైన 'గోదావరి ' అనే ఒక బోట్ లో మాకు టికెట్స్ సంపాదించి మమ్మల్ని బోట్ ఎక్కించారు. చూసావా, ఆయన్ని సిలిండర్ అన్నావు. ఆయనే లేకపోతే నువ్వు అక్కడే గోళ్ళు గిల్లుకుంటూనో, దిక్కులుచూసుకుంటూనో ఉండాల్సి వచ్చేది అంది. నిజమేనే బాబూ! ఏదో అనుకోకుండ అనేసాను అని ఫీల్ అయిపోయాను. ఇంకానయం ఆయన విన్లేదు అనుకున్నాను.

ఇసుక తిన్నెలో చిన్న చెక్క నిచ్చెన మీదనుంచి మేము బోట్లోకి ప్రవేశించాము. ఆ సన్నటి వంతెన మీద నడుస్తుంటే ఏదో బ్యూటీ కాంటెస్ట్ లో రాంప్ మీద ప్రాక్టీస్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. మేము లాంచ్ లోపల కూర్చోకుండా పైకి వెళ్ళాము. అక్కడ కింద అంతా కార్పెట్ పరిచిఉంది. హాయిగా కాళ్ళుచాపుకొని అక్కడ కూర్చున్నాము. మాలాగే ఇంకా కొంతమంది అక్కడ చేరారు. పెద్ద సైరన్ తోటి లాంచ్ బయలు దేరింది. నాకైతే 'శంకరాభరణం ' టైటిల్స్లో సైరన్ గుర్తుకొచ్చింది. ఇంకా ఎప్పుడు ఉప్మా ఇస్తారు నాకు చాలా అకలిగా ఉంది అంది సంధ్య. తను పైకి అన్నా అందరి ఫీలింగ్ అదే. నూరేళ్ళ అయుశ్శు పోసుకోని తలచుకున్నదే తడవుగా అప్పుడే పెద్ద ట్రే లో ఉప్మా ప్లేట్స్ పెట్టుకొని చిన్న నిక్కర్ వేసుకొని బుడుగు లాంటి ఒక అబ్బాయి వచ్చి మా చేతుల్లో ఆ వేడి వేడి ఉప్మా ప్లేట్స్, వాటర్ బాటిల్స్ పెట్టి పోయాడు. అయ్యో! పసివాడే అని బాధనిపించింది. నేను ఇంట్లో చేసుకున్న ఉప్మాలొ ఎప్పుడు ఇంతరుచి అనుభవించి ఎరుగను. వేడి వేడి కాఫీ లు కూడా ఇచ్చారు. 


ఆ పాల కొండలలొ అనేక మలుపులు తిరుగుతూ పోతున్న ఆ గొదావరి సోయగాలు చూస్తు మైమరచి పోయాను. దారి పొడుగునా ఆ కొండలు, మీద చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, రకరకాల పూల వాసనలు, ఆకాశం లో తేలియాడే పిల్ల మబ్బుతెరలు, ఎండ అన్నదే లేకుండ, మధ్య మధ్యలో సన్నటి వాన జల్లులు- ఆహా- ఎంతటి కవికూడ వర్ణించలేని ఆ అనందం, ఆ అనుభవం -- కిన్నెరసాని, నండూరి ఎంకి మాతోటే ఉన్నారనిపించింది. 

లంచ్ కోసం మధ్యలో ఒక ఇసుకతిన్నెల మీద దిగాము. చక్కటి భోజనం తర్వాత ఆ చుట్టూ తిరిగాము. అంతటి ప్రశాంత వాతావరణం వదిలి మళ్ళీ రణగొణధ్వనుల హైద్రాబాద్ కి వెళ్ళాలి అని తలచుకోగానే ఎంతో దిగులేసింది. తిరుగుప్రయాణం మొదలైంది. దారిలో ఒక చిన్న ఐలండ్ లో అపారు. అక్కడ సీతమ్మ వారు గోరింటాకు పెట్టుకున్నారట. అక్కడి వెదురు చెట్లనుంచి రకరకాల బొమ్మలు చేసి అమ్ముతున్నారు. చాల అందంగా ఉన్నాయి. ఒక పర్ణశాల బొమ్మ కొనుక్కున్నాను.మొగలి పూలు కూడ అమ్ముతున్నారు. అక్కడినుంచి మళ్ళీ బయలు దేరాము. ఈసారి వేరే విశాలమైన ఇసుక తిన్నెల దగ్గిర అపారు. ఎవరైన స్నానాలు చేసేవాళ్ళు చేయండి అన్నారు. ఆహా, మళ్ళీ అవకాశం దొరికింది. ఇంకాసేపు ఇక్కడ గడపొచ్చు అని ఆనందంగా దిగాం. స్వచ్చమైన ఆ నీళ్ళల్లో నడుచుకుంటు కాస్తదూరం వెళ్ళాం. దూరంగా నల్లటి కారు మబ్బులు మావైపే వస్తున్నాయి. ఎక్కడో దూరంగా వాన మొదలైంది. పడుతున్న వానకూడా ఆకాశమనే విశాల వేదిక మీద అందాల వనకన్య నృత్యం లాగా కనిపిస్తోంది నాకు.

                                              

మామీద పడని దూరంగా కనిపిస్తున్న ఆ వానని చూస్తుంటే చిన్నప్పుడు నేర్చుకున్న, నాకు నచ్చిన పాట గుర్తొచ్చి పరవశంతో అంతా మరచిపోయి ఆ పాట పాడుకోవటం మొదలు పెట్టాను. 

' మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై, తబ్బిబ్బయింది నా మనసు, తళుక్కుమన్నది నీ సొగసు '

వర్షం వచ్చేస్తోంది, అందరు తొందరగా వచ్చేయండి, వెనక్కి వెళ్ళి పోవాలి, అయిదయితోంది, అని లాంచ్ డ్రైవర్ అరచిన అరుపులతో ఈ లోకంలోకి వచ్చాను. ఇంక తప్పదంటు అందరూ లాంచ్ లోకి చేరుకున్నారు. దూరంగా చూసిన ఆ వాన మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడ పలకరించటం మొదలు పెట్టింది. నేను నిజంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటాన ' అన్న ఆ అనుభవాన్ని వదులుకో దలచుకోలేదు. అందుకే ఎందరు రమ్మన్నా కిందకి పోలేదు. మంచు ముత్యాల లాంటి ఆ వాన చినుకులు నా చేతులలో పట్టుకుంటుంటే నేనే ముత్యపుచిప్పనేమో అనిపించింది. ఈ సంతోషం ఎంతసేపులే, ఇంక మురిసిపోయింది చాలు అని అక్కడి కొండలన్నీ నన్నుచూసి నవ్వినట్లుగా నదీతీరం వచ్చేసింది. కిందకి దిగక తప్పలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటూనే, ఆ అందమైన లోకాన్ని ఒదిలి చివరికి కార్ లో కాలు పెట్టాను. తిరుగు ప్రయాణం మొదలైనా , చాలా సేపు మాట్లాడ కుండానే ఉండిపోయాను. ఎవరి మాటలు నా చెవుల దాక రావటం లేదు. 

ఏముంది! కూనవరం నుంచి భద్రాచలం అక్కడి నుంచి హైద్రాబాద్ వచ్చేసాము. మరచిపోలేని ఆ అనుభవం మాత్రం నాకు ఎప్పుడు తోడుగానే ఉంటోంది.

నాతోపాటు ఈ అనుభవం మీరుకూడా పంచుకోవాలన్న నా తపన మీరు అర్ధం చేసుకుంటారు కదూ!

మీకోసం ఈ ఉప్పొంగిన గోదావరి- పాపి కొండలు-అందాలు....


***************************************************************************************************************************************************






27, మార్చి 2013, బుధవారం

పాత బట్టల పండుగ





పాతబట్టలతో ఎప్పుడూ ఎంతో కొత్త కొత్తగా ఉండే ఈ పండుగ నాకు పుట్టినప్పటి నుంచి ఇష్టం. ఎంతో ప్రాణం....

అవును మరి, నేను పుట్టిన సంవత్సరం లో హోళీ  రోజు అక్కడే ఉన్న ఓ కలర్ బకెట్లో పడిపోయానట. పసుపు రంగులో పడ్డనేను, అందుకేనేమో! అప్పటినుంచి ఆ రంగంటే చాలా ఇష్టం. పసుపులో అన్ని షేడ్స్ ఇష్టమే. పసుపు రంగు స్నేహానికి కూడా ఒక మంచి గుర్తు. కదూ!

అప్పటినుంచి ప్రతి సంవత్సరం ఏదో విధంగా హోళీలో మునిగి తేలుతూనే ఉన్నాను.హోళీ కోసం ఎక్కడెక్కడి రంగులో కొనుక్కొస్తున్నానని మా అమ్మ నాకు డబ్బులిచ్చేది కాదు. ఓ సారైతే బజార్లో సామాన్లు కొనే వాడొస్తే, మా ఇంట్లోంచి రెండు మూడు గిన్నెలు తీసుకెళ్ళి వాడికి అమ్మేసాను. తోచిన కలర్స్ అన్నీ కొనుక్కొచ్చేసాను. ఆ తరువాత జరగాల్సిందేదో జరిగిపోయిందనుకోండి. అది వేరే విషయం....

హోళీ కి కొత్త బట్టలు కావాలని ఒకటే గొడవ చేసేదాన్ని. పసుపు పచ్చటి పట్టు పరికిణీ, బ్లౌజు కుట్టించమనిఎంత గోల చేసేదాన్నో. ఇప్పుడైతే ఆ బట్టలు పాడైపోతాయి, శివరాత్రికి కుట్టిస్తాలే....అప్పుడు ఇంచక్కా నువ్వొక్కదానివే కొత్త బట్టలేసుకోవచ్చు అనే వాళ్ళు మా నాన్నగారు....:)

కుక్కపిల్ల లంటే భలే ఇష్టం ఉండేది. మేము నాగార్జున సాగర్ లొ ఉన్నప్పుడైతే, దారిలో కనిపించిన ప్రతి కుక్క పిల్ల ని ఇంటికి తీసుకొచ్చి పాలు పోసే దాన్ని. వాటిని మంచాల కింద దాచిపెట్టేదాన్ని.రకరకాల కుక్కపిల్లలు ఇంటినిండా గునగునా తిరుగుతూ ఉండేవి.హోళీ అప్పుడైతే ఒక్కో కుక్కపిల్లని ఒక్కో రంగులో ముంచేసేదాన్ని. అప్పుడైతే మా ఇంట్లోనే సప్తవర్ణాల ఇంద్రధనుస్సు గిరగిరా తిరుగుతున్నట్లుండేది. హోళీ కి పిల్లలందరం కలిసి డబ్బులేసుకుని రంగులు కొనుక్కుని అక్కడే ఉన్న పార్క్ లో ఆడుకునే వాళ్ళం.  ఎవరు ఎవరో కూడా గుర్తుపట్టలేనంతగా రంగులు పూసేసుకునేవాళ్ళం. నా కుక్కపిల్లలన్నీ నాతో పాటు వచ్చేస్తాయి కాబట్టి నా దగ్గిర ఎక్కువ డబ్బులు తీసుకునే వాళ్ళు.  హోళీ అప్పుడు నా కుక్కపిల్లల్ని చూట్టానికి, తెలియని వాళ్ళు కూడా ఎంత మందో వచ్చే వాళ్ళు. నా గొడవ పడలేక నేను స్కూల్ కెళ్ళిన టైం లో వాటన్నింటిని సాగర్ లో తిరిగే ట్రక్కుల్లో ఇంకెక్కడికో పంపించేసేది మా అమ్మ.చాలా గొడవ పెట్టేసేదాన్ని. కాని, మళ్ళీ మామూలే....ఎక్కడెక్కడినుంచో కుక్కపిల్లల్ని తీసుకొచ్చేస్తూ ఉండేదాన్ని. ఇప్పటికీ రంగులు పూసిన బుజ్జి బుజ్జి కోడిపిల్లల్ని దారిలో అమ్ముతున్న వాళ్ళను చూసినప్పుడు నా కుక్కపిల్లలే గుర్తొస్తాయి.

సాగర్ లో పెద్ద పెద్ద క్వాటర్స్, ఇంటిముందు రకరకాల చెట్లతో కాంపౌండ్ వాల్ తో అందంగా ఉండేవి. ప్రతిఒక్కరి ఇళ్ళల్లో మందార, బంతి, చేమంతి, రంగురంగుల జినియాలు,  పచ్చటి తంగేడు పూలు ఇంకా ఎన్నో చెట్లు ఉండేవి. ఇంక చెప్పేదేముంది...అన్ని పూలు తెంపేసి...నలిపేసి ఒంటినిండా పూసేసుకునేవాళ్ళం. సహజ రంగులన్నమాట. మందార ఎరుపు, చేమంతి పసుపు, అనేకరంగుల్లోని జినియాల, బంతుల రంగులు బట్టలకు అసలు వదిలేవేకావు. ఒంటికంటుకున్న ఆ రంగులు ఎన్నో రోజులకు కాని పోయేవి కావు. ఆ రంగులెక్కడ మాయమైపోతాయో అని సరిగ్గా స్నానం కూడా చేయకుండా కాపాడుకునేవాళ్ళం. ఎవరి వంటి మీద ఎక్కువ రోజులు ఆ రంగులుంటాయో వాళ్ళు గ్రేట్ అన్నమాట. మా అమ్మ కోపం చేసి ఆ రంగులు వదిలించేది. రహస్యంగా మళ్ళీ ఏవో రంగులు పూసేసుకోని కాంపిటీషన్ లో కొనసాగేదాన్ని:) అందమైన లోకమనీ....రంగు రంగులుంటాయనీ....మురిసిపోయే .... అమాయకమైన రోజులవి....

  పోన్లే ఇదేదో చిన్నప్పటి సరదాలే అనుకుంటే పెద్దయ్యాక కూడా అంతే...కాలేజీ చదువుల్లోను, హాస్టల్ రోజుల్లోనూ అంతే...ఇంకా పెరిగిందేగాని తగ్గలేదు. పెద్ద పెద్ద హోళీ గన్ లు, పిచ్ కారీలు కొనుక్కొని ఎన్నెన్నో రంగులు నింపుకొని చిన్న పిల్లల కంటే కూడా ఇంకా చిన్నపిల్లల్లాగా ఆడుకునే వాళ్ళం. 'అదిగో దెయ్యం' అనేంత భయంకరంగా తయరయ్యే వాళ్ళం. ఒకే ఒక్క డైలాగ్ తో సీరియల్ ఎపిసోడ్ మొత్తం లాగించేసినట్లే ఈ హోళీ తోనే జీవితమంతా లాగించేయాలనిపించేది.  నాకైతే మేమంతా సీతాకోక చిలుకల్లాగా, స్వర్గలోకపు నాట్యకత్తెల్లాగా అనిపించేది. ఎందుకో గాని ఎంతో గర్వంగా ఉండేది.  ఎందుకో అంత ఆనందం!!!

ఇప్పుడైనా అంతేకదా!!! ముందు రోజో వెనక రోజో పిల్లలందరూ వస్తే ఏదో, అయిష్టంగానే...కొంచెంగా కోపగించుకొని...వాళ్ళకీ నాకు కూడా తెలియకుండానే రంగుల వర్షం లో తడిసిపోతూనే ఉంటాను:)  చిన్నతనంలో ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దైపోతామా అని ఒకటే ఆరాటం....పెరిగి పెద్దైపోయాకేమో మళ్ళీ పిల్లలమైపోతే బాగుండు అని ఎంత అల్లాడిపోతామో:) ఇదిగో, ఈ హోళీ మన కోరిక  మనసారా తీరుస్తుంది...

అదన్న మాట. నా హోళీ కథ. కాబట్టి రేప్పొద్దున్న ముసలి దాన్నయినా...ఎల్లుండెప్పుడో చనిపోయినా ....ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ హోళీనే:)

త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురినీ దంపత సహితంగా పూజించే రోజు ఈ ఒక్కటే. అదే ఫాల్గుణ పూర్ణమి. ఈనాటి పూజలు కూడా భిన్నంగానే ఉంటాయి. వసంత పూర్ణిమ కి సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఒకరిపై ఒకరు రంగు పొడులు, రంగు కలిపిన నీళ్ళు చల్లుకుంటారు. ' హోళి హోళీర రంగ హోళీ చమకేళిర హోళీ' అని పాడుకుంటూ ఆడుకునే ఈ ఆటలో ఎన్నో అర్ధాలు ఉన్నాయి. మోదుగపూలు తెచ్చి రోట్లో దంచి, కుండలో వేసి, రసంతీసి, వెదురు గొట్టాల్లో నింపాలి. ఆ రసం ఎర్రగా ఉంటుంది. దీనికే వసంతం అని పేరు. ఈ కషాయం ఒంటిమీద పడటం వల్ల శరీర కాంతి, వర్చస్సు ఎక్కువై ఆరోగ్యం ఇనుమడిస్తుంది. మానసిక వికారాలు, ఉద్రేకాలు కూడా తగ్గుతాయిట. ఎప్పుడో చదివిన విషయం ఇది. మన ఆయుర్వేదంలో ఉన్న గొప్పతనం ఇదే మరి....

 అటువంటి  ఈ వసంతోత్సవ కేళి ప్రతిఒక్కరి జీవితం లోనూ అన్ని రంగులూ కలకాలం చిలకరిస్తూనే ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ నా హృదయ పూర్వక హోళీ శుభాకాంక్షలు.

  'అజ్ఞానమనేది దట్టమైన చీకటిలాంటిది ' అన్నాడు షేక్ష్పియర్. ఎన్నో పరమార్ధాలు తెలిపే ఈ రంగులే మన అజ్ఞానాన్ని తొలగిస్తాయి. జగమంతా రంగులమయం.ఆ నీలి ఆకాశం, శత వర్ణాల పూలు,తెలియని రంగులను చూపించే సముద్రం, రంగులమయమైన ఈ ప్రకృతి....ఓహ్...మనజీవితమే రంగు రంగుల పూలసజ్జ....ఇందులోని ప్రతి రంగునీ మనం సద్వినియోగం చేయాలి.... అస్వాదించాలి ...అనుభవించాలి...ఈ పూల సుకుమారాన్ని సడలనీకుండా కాపాడుకోవాలి.....

హోళీ ఆయారే...దేఖో హోళీ ఆయారే....మస్తీ కరో....:)


   రంగ్ బరిసే హోళీ.....





  హోళీ కె దిన్ దిల్ ఖిల్ జాతే హై....





***************************************************************************************************************************************************

10, మార్చి 2013, ఆదివారం

కళా హృదయ సమ్మేళనం....



చల్లని పిల్ల గాలి తెమ్మరలు ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది!
మినుకు మినుకు నక్షత్రాలు, ఇదిగో...నిన్నే... చందమామ నిన్నుకూడా రమ్మంటున్నాడు...రా... అంటే!!....
సుకుమార పారిజాత పుష్పాలు మాలాగే మొత్తం...అంతా...పరుచుకుందువుగాని....వచ్చేయ్...అని తొందర చేస్తూ ఉంటే.....ఎలా ఉంటుంది!!!
ఇదిగో అదే జరిగింది.....ఏ నాటి స్వప్నమో ఈనాడు నిజమయింది...జన్మ జన్మల సంబరం నా సొంత మయింది....ఆ ఆనందాన్ని మీతో కూడా పంచుకోనివ్వండి మరి...

ఫ్రెంచ్ సంగీత కారుడు పియర్ తిల్వా. ఆఫ్రికా, మధ్య ఆసియా తూర్పు దేశాలు పర్యటించి వివిధ రకాల సంగీతాన్ని అధ్యయనం, పరిశీలనా చేశాడు.   ’ప్రపంచ సంగీత పరిమళానికి నేను వివశుడనై తిరిగాను’ అని చెప్పుకున్నాడు. సంగీతం ఒక్కటే, వేరు వేరు పేర్లతో ఉంది, సంగీత జ్ఞానాన్ని సమన్వయం చేయాలి అని భావించాడు. అనేక సంగీత కార్యక్రమాలకు స్వర రచన చేసాడు.  ఇతను స్వర పరచిన సంగీత విభావరి పేరు 'అనంత ఓపస్ 195'. సంస్కృత పదం 'అనంతం' తీసుకొని తన స్వరరచనకు ’అనంతమైన సృజన” అనే పేరు పెట్టుకున్నారు. అనేక దేశాల్లో పర్యటించి ఈ అనంతమైన విశ్వ సంగీతాన్ని వ్యాపింప చేసారు. ఎందరో కళాకారులు ఇతని సంగీత విభావరిలో పాల్గొన్నారు. అనంతమైన ఆనందాన్ని అనుభవించారు. సంగీతం ఒక మహా సాగరం, పాశ్చాత్యమైనా...భారతీయమైనా అని నిరూపించారు.  ప్రెంచ్, భారత సంగీత సమ్మేళనంతో భారత దేశంలో కూడా అనేక ఆధునిక,  శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను నిర్వహించారు.  ప్రపంచ పర్యటనలో భాగంగా భారత శాస్త్రీయ సంగీత వేత్తల తో కూడా చర్చించారు. వారి   అభిప్రాయాలతో, సలహాలతో భారతీయ విజ్ఞాన సంపదతో  ఏర్పడినదే ఈ సంగమ ఫలితమం.  ఇదే ’ఇండో-ఫ్రాన్స్' స్నేహపూర్వక ఉత్సవాలకు వన్నె తెచ్చింది.

 ఇంతటి మహోన్నతమైన సంగీత కార్యక్రమాన్ని మనసారా ఆస్వాదించే అదృష్టం హైద్రాబాదీయులను వరించింది. అది మామూలు అదృష్టం కాదు. యాభై మంది ఫ్రెంచ్ కళాకారులతో శిల్ప కళా వేదిక పై పియర్ తిల్వా స్వరపరిచిన వాద్య సంగీత సమ్మేళనం. వయొలిన్, సెలో, గిటార్ తదితర పరికరాల స్వరాలు సంగీత ప్రియుల వీనుల విందు చేసాయి. చల్లని మలయ మారుతం లా, వెన్నెల జల్లుల్లా హృదయాలకు 'అనంత మైన సృజన ' ఇచ్చింది.   ఈ విభావరిని శామ్యూల్ జాన్ నిర్వహించారు.

  అక్కడే, ఈ సంగీత అనంత వాహిని లో ఒక అద్భుతమైన మలుపు హృదయాలను పూర్తిగా మైమరపింపచేసింది. ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్,  తన ఇద్దరు సంగీత వారసులైన కుమారులు అమానలీ ఖాన్, అయాన్ అలీ ఖాన్ లతో వేదిక మీదకి విచ్చేసారు. ముగ్గురూ తమ సరోద్ లను సవరించుకొని కూర్చున్నారు. అప్పటి వరకూ విన్న ఫ్రెంచ్ క్లాసికల్ సంగీతాన్ని సరోద్ ల పై సవ్వడిస్తూ, ఓ ప్రభంజనంలా, ఓ జలపాతంలా మధురమైన సంగీత పరిమళాన్ని అందరి మనసుల్లో ప్రవహింపచేసారు. కొమ్మ కొమ్మ కూ కోయిలలు పరిగెత్తుకొచ్చాయి....కొత్త కొత్త రాగాలు తీయతీయగా ఉన్నాయని... గ్వాలియర్  సంస్థానంలో  హిందూస్థానీ సంగీత కళాకరుల కుటుంబానికి చెందిన అంజద్ అలీఖాన్ ఈ సంగీత కార్యక్రమం కోసం యువకుడైన తిల్వా తో రెండు మూడు నెలలు రిహార్సల్స్ చేసారు.

 ఇంతటి అద్భుత రసాస్వాదనను, ఇటీవలే దివంగతులైన పండిట్ రవిశంకర్ కు అంకిత మిచ్చారు.  ఇరు సంస్కృతుల సమ్మేళనమిది. ఎంతో ముచ్చటైన సన్నివేశం. అంతేలేని ఓ అద్భుతం. సంగీత ప్రియులకు ఇచ్చిన మహారాజ విందు ఇది. ఇండియా లో జరిగిన ఫ్రెంచ్ పండుగ. ఎంతో మంది దేశ విదేశీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.    నేను మొదటిసారి, నా అభిమాన దర్శకుడు 'కళా తపస్వి' కె. విశ్వనాధ్ గారిని ఇక్కడ చూసే అదృష్టం కూడా కలిగింది. ఆ కళాకారుల దగ్గరికి ఎన్నో కళా హృదయాలు ఆటోగ్రాఫుల కోసం, ఫొటోగ్రాఫుల కోసం పరుగులెత్తాయి.....ఈ బుల్లెట్లను మాత్రం ఎవ్వరూ ఆపలేక పోయారు. ఇది ఒక  Fusion అంతే.

“It is a harmonious blend of Hindustani Classical Music and Divine French Compositions”…..





Bonjour India 2013 festival - Ananta Opus 195







***************************************************************************************************************************************************










3, మార్చి 2013, ఆదివారం

'పూజ్యుల సేవ '








మా కాలేజ్ కి  యు.జి.సి. ఎక్ష్పర్ట్ కమిటీ  విజిట్ డేట్ డిసైడ్ అయ్యింది.  ఈ టైం లో మా కాలేజ్ లో ఎంత హడావుడో చెప్పలేము. ఈ నెల యు.జి.సి. ఎక్ష్పర్ట్ కమిటీ విజిట్ ఉందని, స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరికి ఏమేమి తయారీలు చేసుకోవాలో చెప్పారు. మర్నాడు సెకండ్ సాటర్ డే. అయినా కాలేజ్ ఉంటుందని అందరు తప్పకుండా రావల్సిందే నని ఎవరు లీవ్ పెట్టటానికి వీలు లేదని, ఆ రోజు బదులు దసరా మర్నాడు హాలిడే ఇస్తామని,మా ప్రిన్సిపాల్ ఘాఠి వార్నింగ్ ఇచ్చేసారు. ఆ రోజు అందరికి కమిటీలు వేసి డ్యూటీ లు వేస్తామని చెప్పారు. మాకిది మామూలే. ఇంక నాకేమి డ్యూటీ ఇస్తారో అని నా ఆలోచన మొదలైంది. నాకెప్పుడు కూడా చాలా గొట్టు గొట్టు డ్యూటీ లే వేస్తారు. అనుకున్నట్లుగా మర్నాడు మీటింగ్ మొదలైంది. ఎన్నో రకాల కమిటీలు వేసారు. మొట్టమొదట ప్రిన్సిపాల్ నా పేరుతోనే మొదలుపెట్టారు. జయా! అయాం టేకింగ్ యు ఇన్ రిఫ్రెషర్ కమిటీ, యు కన్ టేక్ గ్రేస్ అండ్  నైనా అగర్వాల్ ఇన్ యువర్ టీం. యు ఆర్ ద కన్వీనర్ అన్నారు. ఇంకేముంది, అనుకున్నంతా అయ్యింది. ఇంక నేను పొద్దుటినుంచి సాయంత్రం వరకు చాయ్..చాయ్...చై చై చాయ్.. చెయ్య్య్.. చాయ్.. అనుకుంటు, టిఫినీలు తిన్నారా, కాఫీలు తాగారా! అంటూ తిరగాలి కాబోలు.

వాళ్ళిద్దరు నాకన్న సీనియర్స్, అటువంటప్పుడు వాళ్ళను మెంబర్స్ గా నాకు నచ్చలేదు. ఆమాటే ప్రిన్సిపాల్ తో చెప్పి గ్రేస్ కన్వీనర్ గా ఉంటుంది అన్నాను. అట్లా కాదు, ఇది యు.జి.సి. విజిట్, నువ్వు 'రీడర్ ', హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ 'కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి అన్నారు. ఇంక తప్పదు, ముగ్గురం కలసి అన్నీ చూసుకుందామని డిసైడ్ అయిపోయాం. మీకు పని చాలా ఉంటుంది కాబట్టి రేపు సెక్రటరీ సార్ తోటి మీట్ అయి మొత్తం ప్రోగ్రాం చాకౌట్ చేద్దాం అన్నారు మా ప్రిన్సిపాల్.

మర్నాడు సర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, మేము ముగ్గురం సర్ రూం లో మీటింగ్ పెట్టుకున్నాం. సర్ ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయాయి. మొత్తం వచ్చే మెంబర్స్ అయిదుగురు. అందులో ఇద్దరు ఇక్కడినుంచే. ఆ ఇద్దరు నాకు తెలిసినవాళ్ళే. అందులో ఒకాయన మా డిపార్ట్మెంటే. యు.జి.సి. డీన్ గా ఉన్నాడు. ఇక పోతే అందులో ఒకరు కోల్కత్త, ఒకరు చెన్నై, ఇంకొకరు కేరళ నుంచి. వీళ్ళు రిటైర్డ్ వి.సి. లు. అందరు డెబ్బై ఏళ్ళ పైవాళ్ళే. మరి వాళ్ళకోసం ఇచ్చిన ప్రోగ్రాం చూస్తే కళ్ళు తిరగక ఏమైతుంది.

పన్లో పనిగా ఆరోజు మేం ఏం చీరలు కట్టుకోవాలో కూడా నిర్ణయించేసుకున్నాం. నేను, మన ముగ్గురం ఆ రోజు 'వెంకటమ్మ' లైపోదం అన్నాను. మేము వెంకటగిరి చీర కట్టుకుంటే వెంకటమ్మలని, పోచంపల్లి చీరలు కట్టుకుంటే 'పోచమ్మ' లని, ఇలా చాల పేర్లు మా వాడుకలో ఉన్నై లెండి. నేను ఆ మధ్యనే మంచి పెద్ద జరీ బోర్డర్ తోటి గోల్డ్, సిమెంట్ కలర్ కలనేతలో వెంకటగిరి చీర కొనుక్కున్నాను. రోజూ సింపిల్ గా వెల్తాం కాబట్టి ఆరోజు కొంచెం గ్రాండ్ గా వద్దాం అన్నాను. మా వాళ్ళు వెంటనే ఒప్పేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రాండ్ గా తయారయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు మరి.(నగలూ నాణ్యాలూ ఉండవులెండి...ఓన్లీ చీర:)

సరే, ఈ ఎక్ష్పర్ట్ కమిటీ ఆ రోజు పొద్దున్న మా కాలేజ్ కి పది గంటలకు వచ్చారు. ఎన్.సి.సి. స్టూడెంట్స్ తోటి 'గార్డ్ ఆఫ్ ఆనర్ ' ఉంది. తరువాత ప్రిన్సిపాల్ రూం లో ఇంటరాక్షన్. కాలేజ్ రిపోర్ట్ అంతా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది. ఆ టైం లో మేము వాళ్ళకి స్నాక్స్, టీలు ఇవ్వాలి (రెండు రకాల కాజూలు, కాజు బర్ఫీ, బిస్కెట్స్, నంకిన్ etc.) . ఆ తరువాత 11 టు 12 డిపార్ట్మెంట్స్ విజిట్ ఉంది. పదకొండు గంటల తరువాత వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే అక్కడికి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూష్ పంపించాలి. మాది మూడంతస్తుల కాలేజ్. మైన్ గేట్ నుంచి ఎంట్రన్స్ కు మధ్యలో మంచి దారి, రెండువైపులా అందమైన బొటానికల్ గార్డెన్స్, ఎడమ వైపు కాంటీన్, కుడివైపు పెద్ద పార్కింగ్ ప్లేస్, వెనకాల పెద్ద ఆడిటోరియం ఉన్నాయి. దానికి వెనకాల పెద్ద పి.జి. బ్లోక్ ఉంది. మధ్యలో పెద్ద స్పోర్ట్స్ గ్రౌండ్, జిమ్, ఇంకోవైపు మూడంతస్తుల హాస్టల్ ఉంది. ఇవి గాక  అన్ని డిపార్ట్మెంట్స్. ఈ మొత్తం లో వాళ్ళెక్కడ ఉన్నారో కనుక్కోని మేము సర్వ్ చేయాలి. 12 నుంచి ఒంటిగంటవరకు ఆఫీస్, సైన్స్ లాబ్స్ విజిట్ ఉంది. అప్పుడు వాళ్ళకి మళ్ళీ కాఫీలు, టీలు పంపాలి. అంటే ఒక్క అరగంట తేడాలో వాళ్ళు కాఫీలు, టిఫినీలు,  ఇంకా కూల్ డ్రింక్స్ తాగుతారన్న మాట.

వన్ టు వన్ థర్టీ పేరెంట్స్, అల్లుమిని, స్టూడెంట్స్ తోటి ఆడియొ విజుయల్ రూం లో ఇంటరాక్షన్ ఉంది. ఆ టైం లో మేము వీళ్ళందరికి స్నాక్స్, కాఫీలు పంపాలి.వీళ్ళతో పాటు మళ్ళీ యు.జి.సి. ఎక్స్పర్ట్ కమిటీ కి కూడా పంపాలి. ఏ.వి. రూం లో పేరెంట్స్, ఆ పక్కన రూం  లో అల్లుమిని స్టూడెంట్స్, ఆ పక్కనే ఉన్న  లాబ్ లో మా స్టూడెంట్స్ (మేము సెలెక్ట్ చేసిన పిల్లలు, అంటే మాకు పాజిటివ్ గా మాట్లాడే పిల్లలు మాత్రమే) ఉంటారు. మాకు తోడుగా మొత్తం కాలేజ్ అటెండర్స్, ఆయాలు ఉన్నారు. అంతే కాదు కొంత మంది జూనియర్ లెక్చరర్స్ ని కూడా తీసుకోమన్నారు. ఒ.కే. అన్నీ దిగ్విజయం గానే పూర్తి చేసాం. ఎక్కడా కూడా వాళ్ళు ఏది తిరస్కరించకుండా ఎంతో పెద్ద హృదయంతో   మేము ఇచ్చిన వన్నీ ఆరగించి, సహకరిస్తూనే ఉన్నారు పాపం. వీళ్ళ వెనకాలే వాళ్ళ కో ఆర్డినేటర్ అట, మొదటినుంచి మా వెనకాల కూడా తిరుగుతూ వాళ్ళకు ఏమేమి ఇవ్వాలో మాకు ఉచిత సలహాలు ఇస్తూనే ఉన్నాడు.

ఇంక అప్పటికి వాళ్ళు బాగా అలసిపోతారు కాబట్టి ఒన్ థర్టీ టు టు థర్టీ లంచ్ బ్రేక్ అండ్ డిస్కషన్స్ విత్ మానేజ్మెంట్. వాళ్ళ కో ఆర్డినటర్ నా దగ్గరికి ఒచ్చి  లంచ్ మెనూ ఏవిటో ఆరా తీసాడు. మా సర్ ఎప్పటిలాగే మా హాస్టల్ లో వాళ్ళ కొసం చాలా స్పెషల్సే ప్రత్యేకంగా చేయించారు. ఎన్నో స్పెషల్ స్వీట్స్ కూడా చెప్పారు. ఇవన్నీ విని ఆయన అదోలా తల ఊపేసి, నాన్ వెజ్ ఏమీ లేదా అన్నాడు. నేను వెంటనే మా సార్ దగ్గరికి వెళ్ళిపోయి, ఈ వార్త చేరేసాను. ఆయన ఖంగారు పడిపోతు మా అటెండర్ ని పిలిచి హైద్రాబాద్ బిర్యాని, రెండు స్పెషల్ నాన్ వెజ్ కర్రీస్ వెంటనే తెమ్మని తరిమేశారు. మా సర్ రూం చాలా బాగుంటుంది కాబట్టి అక్కడే లంచ్ ఏర్పాటు చేసాం. మా ముగ్గురిని సర్ అక్కడే ఉండమన్నారు. మాకు రెండు, మూడు రకాల చాలా కాస్ట్లీ, ఇంపోర్టెడ్ క్రోకరీ సెట్స్ ఉన్నాయి. అవన్నీ తెచ్చి  టేబల్ మీద పెట్టాం. అన్ని డిషెస్ కూడా టేబల్ మీద ఎంతో అందంగా ఏర్పాటు చేసాం.నేను అందంగా టేబల్ స్పూన్స్ సద్ది సలాడ్ రెండు వైపులా కారెట్స్, బీట్రూట్స్, కాబేజ్, మిర్చీ, ఆనియన్ తోటి రక రకాల పూలు, డిజైన్స్ చేసి అలంకరించి పెట్టాను. (నేను సలాడ్ డెకరేషన్ లో చాలా ఎక్స్పర్ట్ లెండి). అది చూసి సార్ నన్ను చాలా మెచ్చుకున్నారు. కాని వెంటనే భయమేసింది, ఎప్పుడూ ఇవే డ్యూటీలు నాకిస్తారేమో అని. మా సార్ ఇంట్లోనుంచి స్పెషల్ గా తయారు చేయించి తెప్పించిన 'ఖుర్బాని ' స్వీట్ కప్స్ లో వేసి, పైన కస్టర్డ్ వేసి ఆ పైన వెనిలా అయిస్ క్రీం వేసి(ఇది మా సార్ ఇన్స్ట్రక్షన్) వేరే టేబుల్ మీద పెట్టాము. ఈ లోపల నాన్ వెజ్ డిషెస్ వచ్చాయి. నేను పక్కా బ్రాహ్మిణ్ కాబట్టి ఆ వాసనలేమి నేను తట్టుకోలేక పోయాను. ఆ పని కాస్తా మా గ్రేస్ కి అప్ప చెప్పాను. పాపం తను అవి అన్నీ సద్దేసింది. అందరు లంచ్ కి  వచ్చేసారు. ఇంక మా కష్టాలు మొదలైనాయి. ఒకాయన వార్మ్ వాటర్ కావాలన్నాడు. ఆ పక్కనే   ఫిజిక్స్ లాబ్ ఉంది. ఒక ఆయాను ఉరికించాను, అక్కడ బర్నర్ మీద వేడినీళ్ళు పెట్టుకోని ఫ్లాస్క్ లో పోసుకోని రమ్మన్నాను. ఒకాయన సాల్ట్ లేని కూరలు కావాలన్నాడు. నాకు దిక్కు తోచలేదు. ఇంకో ఆయన కూరలో షుగర్ వేసి ఇమ్మని అడిగాడు. ఇంకేం చెప్తాను లెండి, ఇటువంటి కష్టాలు చాలానే పడ్డాను ఆ లంచ్ కార్యక్రమం పూర్తయ్యే సరికి. మా సర్ అయిదు నిముషాలకొక సారి జయా, జయా, అని పిలుస్తూనే ఉన్నారు, అదేదో తారక మంత్రం లాగా.

అప్పుడే మా కష్టాలు తీర లేదు. టు థర్టీ నుంచి థ్రీ వరకు అన్ని లైబ్రరీల విజిట్, త్రీ టు త్రీ థర్టీ ఫాకల్టీ తో ఇంటారాక్షన్ ఉంది. ఈ లోపల మంచి ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్ అందరికీ పంపించాలి. పాపం పొద్దుటినుంచి మా ఆయాలు రకరకాల ఫ్రూట్స్ అందంగ ముక్కలు కోసిపెట్టారు. అవి అన్నీ చక్కటి కప్స్ లో, బుజ్జి బుజ్జి ఫోర్క్స్ పెట్టి పంపించాము. నాకు మనసులో చాలా అనుమనంగానే ఉంది వాళ్ళు వెంటనే అవి తినగలరా అని. నో డౌట్, చక్కగా ఆరగించేసారు.

థ్రీ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఇంక వాళ్ళు మా కాలేజ్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ తరువాత ఫోర్ థర్టీ నుంచి ఎక్షిట్ మీటింగ్ ఉంటుంది. అంటే అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా నేను కూడా మీటింగ్ లో పార్టిస్పేట్ చేయాల్సి ఉంటుంది. కాని అప్పుడే నా పని పూర్తి అయేలా లేదు. ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ కాఫీలు, టీ లు అందించాలి. మళ్ళీ ఉరుకులు పరుగులు మొదలైనాయి. పాపం ఈసారి మా జూనియర్స్ ఎంతో శ్రద్దతో వాళ్ళని ఆర్చుకున్నారు.

ఇంక ఎక్షిట్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ సారి మళ్ళీ స్నాక్స్ అండ్ డ్రింక్స్ సర్వ్ చేయబడ్డాయి. ఇంక వాళ్ళు ప్రెజంట్ చేసిన రిపోర్ట్ ఎలా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదుకదా! మా కాలేజ్ అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చెందిందని, 'నాక్ ' నుంచి 'ఏ ' గ్రేడ్ పొందిన గొప్ప కాలేజ్ అని, మా అటానమీ ఇంకో అయిదేళ్ళు పొడిగిస్తున్నామని ఎంతో ఆనందంగా ప్రకటించారు. వాళ్ళకి శాలువాలు కప్పి, మెమొంటోలు ఇచ్చి, కావలసినన్ని ఫొటోలు తీసుకొని,  ఆనందంగా మేము కూడా వాళ్ళని వాళ్ళ కార్ల దాకా తీసుకెళ్ళి, అప్పటిదాకా ఎన్నోసందర్భాలలో  ఇస్తూ వచ్చిన పూలబొకే లను కూడ వాళ్ళ కార్లల్లో పెట్టించి, ఎంతో సంతోషంతో టా టా చెప్పాం.

కాని నాకు మాత్రం ఎంతో అనుమానం, ఇన్ని తిన్న ఆ ముసలి వాళ్ళ అరోగ్యాలు మర్నాడు ఎలా ఉన్నాయో అని:)))
ఇదండి, మేము చేసిన పూజ్యుల సేవ:)


  (నా 'మయూఖ' ని ఖాళీ చేద్దామనుకుంటున్నాను:)   అందుకే నాకు నచ్చని కొన్ని టపాలను తీసేసాను.   నాకు నచ్చిన రెండో మూడో 'మనస్విలో' దాచిపెడ్దామనుకుంటున్నాను.   ఒకటో రెండో ’మయూఖ” లోనే ఉండిపోతాయి. అవి అక్కడే ఉండాలి.  అందుకే, ఈ ప్రయత్నం.)




*********************************************************************************************************************************************************

14, ఫిబ్రవరి 2013, గురువారం

విహంగ ప్రేమ




 ప్రేమ పేజీ లో విహంగం....  విహంగ ప్రేమ... అమృత ధార.  


 ప్రేమించాలి...ఆ ప్రేమను పంచటం లో మించాలి....
ప్రేమ దీపం ఆరకుండా కాపాడాలి....
గుండెల్లో హాయి ప్రేమ..... 


 చెలియా,  feel my love... ప్రేమ కోరి నే వేచి ఉంటానులే....
 ప్రేమ దివ్య భావము...ప్రేమ దైవ రూపము....


 లేత వాలు చూపులో మౌన గీతాలు....నీ తోడు! నను నేనే మరిచాను...
 పో పో అని నువ్వంటే....పోనే పోనమ్మా!!! నిజంగా నిను చూడందే ఉండలేనమ్మా...



ఓ ప్రేమా! నా గుండె నీకే ఇచ్చాను....నీ చిరునామా ఎపుడు చెపుతావు
ప్రియతమా....నా హృదయమా... పల్ పల్ దిల్ కే పాస్ రహెనేదో....




 మాటలే రాని వేళ పాట ఎలా పాడను...
కళ్ళలోన కడలి సాకి ఎంతసేపు ఆపను...

   


నచ్చావులే...మనిద్దరమూ గెలిచే ఒకే ఒక ఆట ప్రేమ....
నీతో నేనున్న క్షణాలు మధురం....
నీకై వేచిన క్షణాలు మధురం...
నిన్నే తలచిన క్షణాలు మధురం...




నింగిలోన తారనైపోనా నిను చూడటానికి...
నిండు చందమామనైపోనా నీ మనసు దోచుకోటానికి...
చల్లని గాలినై రానా నిను చేరటానికి....



                                                        


చిరునవ్వుల వరమిస్తావా....చితినుండి బ్రతికొస్తాను ...
మరుజన్మకు కరుణిస్తావా....ఈ క్షణమే మరణిస్తాను... ఆత్రేయ

పక్షులు ఎంతో ప్రేమిస్తాయిట....ఒకరికొకరు అంకిత భావంతో జీవిస్తాయిట....అందుకే నా ఈ పక్షి ప్రేమ...... జంటగానే ఉంటాయి. అస్సలు విడిపోవు. ప్రతి పని సమానంగా పంచుకొని పని చేస్తాయిట. ఆడ పక్షుల్ని అపురూపంగా చూసుకుంటాయిట. ఆడ పక్షి గుడ్డు పెట్టి పొదిగే సమయంలో కంటికి రెప్పలా కాపాడుతాయి. జాగ్రత్తగా ఆహారం అందిస్తూ ఉంటాయి. ఒక పక్షి చనిపోతే జీవితాంతం ఒంటరిగానే జీవిస్తాయిట. పావురాలు ప్రేమ సందేశాలు తీసుకు పోవటం లోనే కాదు, కలిసి బతకటంలో కూడా దేనికీ తీసిపోవు.


అందుకే, నేనేసుకున్న ప్రేమ పక్షుల బొమ్మలతో మీ అందరికీ 'ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు'.....


***************************************************************************

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఆనందమె జీవిత మకరందం!




ఆనందం డెఫినిషన్ చెప్పటం అంత సులభమా!!!జీవితం లో ముగింపు లేనిది , చెప్పలేనిది అదొక్కటే అనుకుంటా!!!!

ఏ మహాత్ములు ఎన్ని చెప్పినా తమకు మంచి అనిపించిందే చెప్తారుకదా! లేకపోతే ఇతరులెందుకు వాళ్ళని విమర్శిస్తారు? లోకమంతా పనికొచ్చే ఒకే ఒక్క ఆనందం గురించి చెప్తే మహాత్ములు ఒక్కళ్ళే ఉండే వాళ్ళేమో:) 

ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఆ ఆనందం తనివి తీరదే!!!!

హత్యలు చేసేవాళ్ళు అందులో ఆనందం కోసమేనా?

ఇతరులను మోసపుచ్చే వాళ్ళకు అందులో ఆనందం ఉన్నట్లేనా!! 

ఇటువంటి వాళ్ళు ఏవిధంగా అయినా శిక్ష అనుభవించే వారే అది శాశ్వత ఆనందం కాదు అందామా!!! 

మరి ఆనందం ఎప్పటికీ ఉంటుందా, లేక కొంతకాలమేనా?  అందుకేనా తపస్సు చేసుకుంటామని వెళ్ళిపోయేది?

ఎటువంటి బంధాలు లేక పోతే, ఏనాటికైనా ఆనందమంటే ఏవిటి అని వెతుక్కుంటూనే పోతారేమో!!! 

పోనీ విరక్తి లో అన్నీ వదిలేస్తే ఆనందమా? 

అతి మంచివాళ్ళూ ఆనందంగా ఉన్నామనరు...అతి చెడ్డవాళ్ళూ ఆనందంగా ఉన్నామనరు!!!! పోనీ అతి మామూలు వాళ్ళు ఆనందంగా ఉన్నారా!

మనకున్న జీవితంలో మనకు మనమే మనకు మాత్రమే పనికొచ్చే ఆనందాన్ని ఎంచుకుంటే సరిపోతుందేమో....
అందరూ అదే పద్ధతి అనుసరిస్తే అప్పుడు ప్రపంచమంతా ఎలాఉంటుందో, ఊహించుకోవాలని ఉంది నాకు:) 

ఎపుడో అపుడు ఎవరో ఒకరు ఆనందం అంటే ఏవిటి? అని ఓ సినిమా తీస్తారేమో...అప్పుడు ఆ సినిమా ఎలా ఉంటుందో.... 


                                           

 ఈ ఆనందం మధురానుభూతి. ఆనందం మన చేతిలోనే ఉంది. మనమీదనే ఆధారపడి ఉంది. నా సంతోషానికి నేనే బాధ్యురాలిని.... ఆనందాన్ని నింపుకొనే శక్తి మనలోనే ఉంది... మనం చంద్రుని కోసం ప్రయత్నిస్తే కనీసం అందాలొలికే నక్షత్రాల మధ్యనైనా ఉంటామేమో....సంతోషమే కావాలి.....బాధ వద్దు. కాని అందాల హరివిల్లు వర్షం తరువాతే కదా చూడగలుగుతాము.మన పరమార్ధమే జీవితం లో ఆనందం...చివరిదాకా ఈ ఆనందంలోనే నడచిపోతూ బ్రతికితే బాగుండు...మనకున్న వాటితో సంతృప్తి పడితే ఆనందం అదే వస్తుందనుకుంటా.....

మన ఆనందంతో ఇతరులను కూడా సంతోషంగా ఉంచగలుగుతాము. అప్పుడు అందరూ ఆనందంలో ఓలలాడొచ్చు....ఎంత ఆశో...అవునా! దురాశ మాత్రం కాదు కదూ....  జీవితం లో ప్రతి అనుభూతి ఆనందమే....

సంతోషాన్ని కొనుక్కోలేము కదూ...ఒకవేళ మనకు నచ్చినదేదైనా కొనుక్కున్నామనుకోండి....అది ఆనందమేగా:)


                                         
ఎంతంత దూరం నన్ను పోపో అన్నా అంతంత చేరువై నీతో ఉన్నా.....There is always somebody that loves you.... Its me.....

జీవితం విలువైనది...చేజారితే దొరకనిది...ఆ విలువ కాపాడుకోటమేగా...ఆనందం.


ఏమో నా లాంటి వాళ్ళైతే...అనందమనగానేమి..అని ఒక హెడ్డింగ్ పెట్టి, ఇంట్రడక్షన్, ఓ డెఫినిషన్, కొన్ని సైడ్ హెడ్డింగ్స్, ఓ కంక్లూజన్ తో ఓ ఎస్సే రాసేసుకుంటారు. అంతే:) 


                                  

 Happiness is a journey, not a destination.....

 ‘Happiness is like a Butterfly;
 The more you chase it,
 The more it will elude you.
 But, if you turn your attention to other things,
 It will come and sit softly on your shoulder’.....  
........ Exactly correct.


ఆనందమంటే ఇదేకదా!!! ఆనందమే జీవిత మకరందం.......





***************************************************************************














 

మనస్వి © 2008. Template Design By: SkinCorner