పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జూన్ 2013, ఆదివారం

పాకుడురాళ్ళు



 జ్ఞానపీఠ పురష్కారం పొందిన రావూరి భరద్వాజ గారి పుస్తకం పాకుడురాళ్ళు. చలన చిత్ర రంగంలో వెలుగు నీడలు, కష్టసుఖాలు, వడిదుడుకులూ...సినిమా వెనుక గల సినిమా చరిత్రని వివరించిన పుస్తకం ఇది. ఈ పుస్తకం చదవాలన్న ఏనాటి నా కోరికో, జ్ఞానపీఠ్ అవార్డ్ వచ్చి కొత్త ప్రింట్ విడుదలయినాక గాని తీరలేదు.

అట్టడుగు నుంచి సినిమా రంగం లో పైకి రావాలనుకునే మంగమ్మ లాంటి వాళ్ళ కథ సర్వ సాధారణం. పసితనం లోనే నాగమణి తో చేదు అనుభవం ఏర్పడింది. ఆ తరువాత చిన్నతనంలోనే నాటకరంగానికి వచ్చి అక్కడ తన ప్రతిభతో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మంగమ్మ. రామచంద్రారావు, మాధవరావుల స్నేహంతో ఒక భద్రత ఏర్పరుచుకోటానికి ప్రయత్నిచటమే కాక నాగమణి నుంచి కూడా బయట పడగలిగింది. ఆ నాటక సమాజం మూతపడడంతో ఏమీ తోచని మంగమ్మ చలపతి పరిచయం తో సినిమా రంగం మీద ఆశ పెంచుకొంది. నాగమణి ని చూడాలన్న కోరికతో బయలుదేరిన మంగమ్మ తన నేస్తం రాజమణి ని కలుసుకొని వారి హీనబ్రతుక్కి చలించిపోయింది. వసంత ను ఇష్టపడి ఆమె చాలా బాగా పాడుతుందని తెలుసుకొని తనకి భవిష్యత్తులో సహాయం చేయటానికి ప్రయత్నిస్తానని మాట ఇచ్చింది. నాగమణి ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉందో తెలుసుకుంటుంది. నాగమణి ని కలవలేక పోతుంది.

చివరికి చలపతితొ మద్రాస్ నగరానికి వచ్చి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. మంగమ్మ మంజరిగా మారింది.మంగమ్మ ప్రతిపాదించిన మంజరి పేరును పరబ్రహ్మ శాస్త్రి సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్యానం  సరదాగా అనిపిస్తుంది. చలపతి తెలివి తేటలతో తాను కూడా ఒక సమిధగా మారి పోతుంది. క్రమంగా అన్ని పరిస్థితులు తెలుసుకొని స్వయంగా అభివృద్ధి చెందే పథకాలను తానే సిద్ధం చేసుకోగలుగుతుంది. అందుకు హీరోయిన్ కళ్యాణి స్నేహం ఎంతో తోడ్పడింది. చివరికి సినీవినీలాకాశం లో ఓ మూల నుండి జారి పడిపోయింది ఈ మిణుకు తార కళ్యాణి. వెంకటేశ్వర్లు, మెహెతా, మొదిలియార్, రాజన్ వంటి వారి సహాయాన్ని అంచెలంచలుగా వాడుకుంది మంజరి. రాజమణి, వసంతలను తన దగ్గరికి రప్పించుకొంది. మంజరి క్రమంగా చలపతిని దూరం చేసినా, తన కు ఏర్పడిన అనేక సమస్యల్లో చలపతి మీదనే ఆధారపడక తప్పలేదు.తనకు నచ్చని శర్మని కూడా చాతుర్యం తో తన భవిష్యత్తు ప్రణాళికల్లో ఉపయోగించుకో గలిగింది. తన విదేశీ యాన కోరికను గౌరవప్రదంగా తీర్చుకో గలిగింది. మర్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ వంటి నటీమణులను కలుసుకొని, వారి అనుభవాలను తెలుసుకొని ప్రపంచమంతా'నటీమణి' పరిస్థితి ఒకటే, ఎంతటి విషాదం పేరుకొని పోయి ఉంటుందో  అని తీవ్రమైన వ్యధకు లోనౌతుంది .   బొంబాయ్ లో సక్సేనా పరిచయం మంజరి కలలను పండించి హిందీ సినీ పరిశ్రమలోకం లో యధేచ్చగా వీరవిహారం చేయించింది.  మంజరి పతనానికే దారి తీసింది. చివరికి మిగిలింది....పగిలిన అద్దం లో ముక్కలైన మంజరి జీవితం....

ఈ నవలలో ఏ ప్రాంతం మాటలో కాని చాలా పదాలు నాకు కొత్తగా అనిపించాయి.
దత్తి, పిక్కట బిర్రుగా వచ్చారు, రెక్కొట్టింది, అపనయించుకుంటూ, ఆకాయ పోకాయ వెధవలు, తెక్కట్లాడుతూ, అలవసులవలకు, గనుపు, ఠాలా ఠోలీ రకం, లాయలాస, నిప్పచ్చరం, రొళ్ళగొట్టడం, మైదు .... ఇలాంటివి. ఇంకా చాలానే ఉన్నాయి,

ఈ పుస్తకం  రచించిన విధానం, శైలి, పరిశీలనా శక్తి  చాలా బాగుంది.  ఇటువంటి కథ సినిమా చరిత్ర లో మామూలే అనిపిస్తుంది. కాలువేస్తే జారిపోయే పాకుడురాళ్ళు,జీవనపోరాట గమనాన్ని, తన భావజాలం తో రచయిత బాగా వ్యక్తీకరించారు. ఆయా ఘట్టాలను చిత్రించిన విధానం బాగుంది. అట్టడుగు నుంచి జీవితం ప్రారంభించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రతిభాశాలి మంజరి గురించి, తన ధ్యేయాన్ని సాధించుకోటానికి చేసిన కృషిని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నది చక్కటి మామూలు తెలుగు భాషలో రాసారు.
ఒక మహానటి జీవితంలో కొన్ని అనుభవాలను ఆధారంగా తీసుకున్నట్లు రచయిత వివరించారు. కథాక్రమంలో హీరోలతో వచ్చే బేధాభిప్రాయాలలో వేరే నటి కూడా మదిలో తళుక్కుమంటుంది. సినీ పరిశ్రమలో నటిగా కాలుపెట్టి, పునాదులేర్పరుచుకొని, జీవిత నిర్మాణాన్ని పూర్తిచేసుకోవటానికి ఆ నటి పడే మానసిక వ్యధ మాత్రమే కాకుండా ఎంతటి దుర్భర జీవితాన్ని ఎదుర్కోవాలో, ఎన్ని వ్యసనాలకు లోబడుతుందో తన స్వయం పరిశీలనతొ రచయిత వివరించారు. సస్పెన్స్ అని కాదు గాని ఎంతో ఉత్సుకతతో చదువుతాం. మనం ఇష్టపడే నటీమణుల జీవితం లో రహస్యాలు మన కళ్ళముందు అలా అలా పరుచుకొని పోతూనే ఉంటాయి.

ఎలాగైనా పైకి రావటమే ముఖ్యం. కన్నీరుకు విలువలేదు.మన హోదా కీర్తి ప్రతిష్టలు మాత్రమే జనం చూస్తారు. నిజాయితి తో దరిద్రమే తప్ప ఏమీ లేదు.ఏదో విధంగా డబ్బు సంపాదించాలి.  .....ఇదీ చివరికి మంజరిలో వచ్చిన మార్పు.

  తనను తరిమి కొట్టిన వారి మీద, అపవాదులు వేసిన వారి మీద విపరీతమైన ధ్వేషం పెంచుకుంటుంది.  ఇది మంజరికి సినీపరిశ్రమ మీద ఏర్పడిన కసి. చివరికి అటువంటి వారిని తన దయాదాక్షిణ్యాల కోసం వెంపర్లాడే పరిస్థితి ఏర్పరుస్తుంది. విపరీతం గా నిర్లక్ష్యం చేస్తుంది. తనకు తగిలిన దెబ్బలు, అనుభవించిన నరకయాతన ఆమె బతుకును తీర్చిదిద్దాయి. అనుభవాలనుండి వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకుంది. మానవతా హృదయంతో అంతులేని సంఘసేవ చేసింది.

 సినీ జగత్తునే తన పాదాక్రాంతం చేసుకున్న మంజరి జీవితపు  అమానుషమైన  ముగింపును తట్టుకోటం మాత్రం మానవమాత్రుడి తరం కాదు!!!!

 ఇది ఒక  'Dance of Death ' .



*************************************************************************************************************************************************** 

9, ఏప్రిల్ 2012, సోమవారం

కృష్ణవేణి




















కృష్ణవేణి - రంగనాయకమ్మ గారు



నేను ఈ మధ్య అనుకోకుండ చదివిన రంగనాయకమ్మ గారి నవల కృష్ణవేణి గురించి రాయాలనిపించింది. ఆవిడ చాలా చిన్నప్పుడు అంటె దాదాపు 17, 18 సంవత్సరాల వయసులో రాసిన నవలట ఇది. అరవైఒకటి లో ఆంధ్రప్రభ లో సీరియల్ గా వచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా చదివేవారట. ఈ సీరియల్ కటింగ్స్ తీసి బైండింగ్ చేసి దాచిపెట్టుకున్నారట. అనేక ముద్రణలు కూడా వచ్చాయి. కాని కొంతకాలానికి ఈ నవలలో అక్కడక్కడా తాను రాసిన విధానం నచ్చలేదని, అపరిపక్వతతో రాసిందని అసంతృప్తితో మళ్ళీ ముద్రణలు ఆపివేసారు. కాని ఆ నవల చదవాలి అని ఇప్పటికీ చాలామంది పాఠకులు దీని పునర్ముద్రణ కోసం కోరుకోగా, చివరికి తన కొత్త ముందు మాటతో, దీనిని ముద్రించారు. తనకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల మీద ఈ నవల రాసానని తెలిపారు. అందుకే ఈ కథ అంటే మొదటి నుంచి ఇష్టమూ, భయమూ ఉందని తెలిపారు. అందుకే ఇప్పటి కొత్త ముద్రణలో అక్కడక్కడా సర్దుళ్ళూ దిద్దుళ్ళూ ఉన్నాయన్నారు. తన అసంతృప్తికి కారణమైన భాగాల్లో కింద ఫుట్ నోట్స్ కూడా ఇచ్చారు. అప్పుడు ఆంధ్రప్రభ సీరియల్ లో ఒకటే బొమ్మ వచ్చేదట. ఆ బొమ్మనే ఇప్పటి ఈ పుస్తకానికి ముఖచిత్రంగా ఉంచారు. ఈ కొత్త ముద్రణలో అనేక విషయాలలో తన మారిన అభిప్రాయాలను ఎంతో వివరంగా రాసారు. ఈ నవల లో ఒక ప్రత్యేకత ఉంది. కథ అంతా ఉత్తరాల రూపంలోనే కొనసాగుతుంది.

కృష్ణవేణి కి వచ్చిన ఉత్తరం కాయితాలు నేల మీద ఎగరూతూ ఉంటాయి. అప్పుడే పెళ్ళైన కృష్ణవేణి, భర్త శ్యాంసుందర్ ఆ ఉత్తరం చూడడంతో కథ ప్రారంభమవుతుంది. నూతన దంపతుల మధ్య ఈ ఉత్తరం చిచ్చురేపుతుంది. అది తన భార్య ప్రేమలేఖ అని తెలిసిన కృష్ణవేణి భర్త కోపంతో వెళ్ళిపోయి విడాకులు కోరుకుంటాడు. దానితో మొదటినుంచి మాధవరావు తో తన పరిచయాన్ని, ఆ పరిచయంలోని అనేక మలుపులను తన భర్తకు వివరంగా ఉత్తరం రాస్తుంది కృష్ణవేణి. కథంతా ఈ ఉత్తరమే మనకు చెప్తుంది.

కృష్ణవేణి పాత్ర అనేక వైరుధ్యాలతో ఉంది. యువతీ యువకుల మధ్య ప్రేమా, దానిలో తలెత్తే సమస్యలూ...అదే ఇందులో కథావస్తువు. అతి సామాన్యంగా, సాంప్రదాయబధ్ధంగా సాగే కృష్ణవేణీ, మాధవ్ ల ప్రేమ కథ ఇది. భార్యాభర్తలు సామరస్యంగా ఉండాలని, ప్రేమ సంబంధాలు సాహసవంతంగా ఉండాలనీ చెప్పే కథ.

మాధవ్ సమస్య తెలుసుకున్న కృష్ణవేణి, చివరికి తన స్నేహితుల సలహాని కూడా సరిగ్గా అర్ధంచేసుకో లేక వేరే వివాహానికి సిద్ధం అవుతుంది. కృష్ణవేణి స్నేహితురాలు రేణూ పాత్ర చిత్రణ బాగుంది. కృష్ణవేణి నిష్కారణంగా మాట తప్పింది. వేరే పెళ్ళి చేసుకుంది. ఈ పాత్ర నిజాయితీ కోల్పోయింది. ఆ యువతీ యువకుల ప్రేమ సంబంధం తెగిపోయినా, అది చివరికి వారి సంతోషం తోటే కథ ముగుస్తుంది. ఇలాంటి ముగింపు చాలా తప్పు అని రచయిత్రి భావించారు. వాళ్ళు విడిపోవడమూ, వేరే వ్యక్తులతో జీవితాలు గడపడమూ జరిగితే జరగవచ్చు. కానీ అది, వారికి విషాదమే...అనే అర్ధం ముగింపులో కనపడాలి. కాని ఆ విషయం మీద తాను శ్రధ్ధ చూపలేదని తన రచన మీద తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. రచయితలు తమ రచనలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలని రచయిత్రి అభిప్రాయం.

ప్రేమంటే సరి అయిన అవగాహన లేకుండా తానీ నవల రాసానని బాధపడ్తారు రంగనాయకమ్మగారు. ఎందుకంటే, నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తులు ఆ సంబంధం తెగిపోయినా, వాళ్ళిద్దరు వేరే వ్యక్తులతో సంతోషం గా ఉన్నారని చెప్పటం తప్పు. ఇది ప్రేమకే అవమానం. దేవదాసు దు:ఖాంతం. కాని ప్రేమ కోసం కట్టుబడిన కారణం గానే దు:ఖాంతం అయింది. దేవదాసు మనసులో ప్రేమ పోతే అది అతనికి సుఖాంతం అయ్యేది. కానీ, అది ప్రేమకి అవమానం. మల్లీశ్వరి కథ చూస్తే అది, ప్రేమ కోసం సాహసాల్లోంచి, దు:ఖాంతం నుంచి నడచిన సుఖాంతం. ప్రేమ విలువని ఎగరగొట్టి, ప్రేమికులు కూడా సాంప్రదాయమైన పెళ్ళిళ్ళ లోనే చాలా సంతోషంగా ఉన్నారని చెప్తే, అది చాలా అవాస్తవం. ప్రేమ కథ, ప్రేమ విలువలతో ముగియాలి. అది సుఖాంతమైన, దు:ఖాంతమైనా అది ప్రేమ కోసమే జరగాలి. ముగింపు ప్రేమకు అవమానం జరగకుండా ఉండాలి.

కృష్ణవేణీ, మాధవ్ కి పరిచయం కావడం, అది ప్రేమగా మారడం, ఇద్దరూ ఒక సమస్యలో చిక్కుకోవడం, దాని వల్ల ఆందోళన పడుతూ కాలం గడపడం, చివరికి సామాజిక కట్టుబాట్లకే తలలు వొంచడం జరుగుతుంది. ఇదీ కథ క్లుప్తంగా. ఇందులో అసహజమేమీ లేదు. అపరాధమూ లేదు. కథ చివరికి మాధవ్ కృష్ణవేణికి అన్న అయిపోతాడు. ఎప్పటి లాగే అతన్ని ఒక స్నేహితుడిగా ఎంచుకునే స్వతంత్రమైన వ్యక్తిత్వం లేదు కృష్ణవేణికి. అతని సంబంధాన్ని సంఘ ధర్మాలకు అనుకూలంగా, తప్పు కానిదిగా చేసుకుంటుంది. ఈ విషయంలో కూడా రచయిత్రి తీవ్ర అసంతృప్తిని తెలియచేసారు.

మొత్తంగా చూసినప్పుడు ఈ రచన, సామాన్యమైన యువతీ యువకుల మధ్య పరిచయాలూ, ప్రేమలూ, ఏ రకం స్థాయిలో ఉంటాయో, అందులోనే వారు ఎన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుని వ్యాకుల పడతారో, వారి ప్రేమ ఎంత సామాన్యమైన పునాది మీద ఆధారపడి సాగుతుందో...మొదలైన విషయాలను ప్రతిబింబిస్తుంది.

యువతీ యువకుల మధ్య ప్రేమ అనే దాని పునాది ఉన్నతమైన స్థాయి పై ప్రారంభం కావాలి. కేవలం శారీరక అందచందాల మీదా, అలంకారాల మీదా కాదు. వారి అభిప్రాయాలు అభ్యుదయకరంగా ఉండాలి. స్త్రీ, పురుషులు సమానమైన వ్యక్తిత్వాలు కలిగి ఉండాలి. అటువంటి అభిప్రాయాలు గల వ్యక్తుల్నే ఎంచుకోవాలి---అనే హెచ్చరిక చేసారు ఈ రచయిత్రి.

ఈ పుస్తకం ఇప్పటికే చాలా మంది చదివే ఉంటారు. కాని, నేను ఇప్పుడే కదా చదివింది!



స్వీట్ హోం పుబ్లికేషన్స్: 8 వ ముద్రణ, 2010 ఆగష్ట్, ధర: 80/-


***************************************************************************************************************************






9, జూన్ 2011, గురువారం

నింగికెగిసిన నవీనాంధ్ర

"దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ముత్యాల సరాలల్లె ముచ్చటైన కవితలల్లిన
నవయుగ వైతాళీకుడు "గురజాడ".

"ఏదేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని"
అంటూ రమ్యలోకాన అమరప్రేమను చాటిన
మన యుగకర్త "రాయప్రోలు"

ఆంధ్ర కవితల అలరించి
గోదారి అలలపై నిదురపుచ్చి
అందమైన సొగసు తొడిగిన
ఎంకి పాటల "నండూరి".

ఆధునిక సమాజపు అలజడులపై
వేయిపడగలెత్తి బుసకొట్టి
రామాయణ కల్పవృక్ష శాఖల
జ్ఞానపీఠమెక్కాడు మన "కవిసామ్రాట్"

ఏదేశ చరిత చూసినా ఏమున్నది గర్వకారణం
అంటూ చరిత్రకు నూతన అర్ధాన్ని ఇచ్చి
"నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చా"
అంటూ జగన్నాధ రధమధిరోహించి
మరో ప్రపంచ ’మహాప్రస్థానం’ చేసిన
విప్లవకవి శ్రీ శ్రీ.

"నా తెలంగాణ కోటి రతనాల వీణ"
అని "రుద్రవీణ"ను
అగ్ని ధారలు కురిపించిన
మహారధి "దాశరధి".

పుష్పవిలాపాన పూలబాధలు తెలిపి
అహింసా తత్వ భాష్యాన్ని ప్రవచించి
జగతిన సుస్థిరమై నిలిచాడు
కరుణారస కవి "కరుణశ్రీ".

ఆకులో ఆకై పూవులో పూవై
ఊర్వశి హృదయ తరంగాలను తాకి
కవితా సుందరిలో వలపు రగిలించిన
భావుకుడు "కృష్ణశాస్త్రి"

కర్పూరవసంతాలతో
కమ్మని కవిత్వ మందించి
విశ్వంభరలో విశ్వమానవ పరిణామం
విపులంగా చూపించి
కవితా నర్తనమాడిన
నవ కవన చక్రవర్తి "సి.నా.రె".

తెలుగు భాషకు సాహిత్యానికి ఔన్నత్యాన్ని పెంపొందించి... గౌరవస్థానం కల్పించి, ఆంధ్రదేశం పట్ల మమకారాన్ని పెంచి, చక్కటి గుర్తింపు నిచ్చిన ఈ మహానుభావులు...ఎందరో,ఎందరో, ఇంకెందరో మహాను భావులు...అందరికీ వందనాలు......ఈ వైభవం కలకాలం నిలవాలి. ఎన్నో తరాలు తరించాలి. (ఈమధ్యే ఇవన్నీ చదువు.....తూ....ఉన్నాను)

*********************************************************************************

27, జులై 2010, మంగళవారం

పరంజ్యోతి






మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి కలం నుంచి వెలువడ్డ ఆధ్యాత్మిక నవల ఈ పరంజ్యోతి.

అనేక ఆధ్యాత్మిక అంశాలతో, కమర్షియల్ నవల లోని ముఖ్యమైన ఎలిమెంట్ అయిన ఉత్కంఠని జత చేసి రాసిన ఈ ఆధ్యత్మిక నవల పరంజ్యోతి లోని చిత్రమైన కథ అన్ని తరహా పాఠకులని సమానంగా అలరిస్తుంది.

మరణించిన మనిషి తిరిగి బ్రతుకుతాడా? అన్నది ఇందులోని ముఖ్యమైన అంశం.

చితిదాకా చేరిన మనిషి మళ్ళీ లేచికూచుంటాడా? అలాంటి మనిషికి సంబంధించిందే ఈ కథ.

ఇది ఓ సంస్థానం రాజకుమారుడు విజయ రామరాజు అనే చిన్న రాజావారి కథ. ఇదే ఒక సన్యాసి పరంజ్యోతి కథ కూడా. ఇది ఒక ఆధ్యాత్మిక జీవనానికి చెందిన కథ.

నెమలికొండ సంస్థానపు అధిపతి భూపతిరాజు నలుగురి సంతానంలో చివరి వాడుగా అతి గారాబంగా పెరిగి అన్నదమ్ములలో వైషమ్యాలకి కారకుడవుతాడు విజయ రామరాజు. అన్ని దురలవాట్లకు లోనవుతాడు. అతని భార్య అహల్య కూడా అతన్ని భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. తన సోదరుడు ప్రతాపవర్మ కి తన గోడు వెళ్ళబోసుకుంటుంది. అనేక జబ్బులతో ముదిరిపోయిన రామరాజుని ఇతడు కూడా ద్వేషిస్తూనే ఉంటాడు.
రామరాజు సోదరులు, ఇతర ఉద్యోగులు కూడా అతన్ని తట్టుకోలేకపోతారు.
తీవ్రమైన జబ్బులతో మంచానపడ్డ అతన్ని ఇంగ్లీష్ వైద్యం కూడా ఏమీ చేయలేదని తేల్చేస్తారు వైద్యులు. అటువంటి సమయంలో అతని మీద విషప్రయోగం జరిగి రామరాజు మరణిస్తాడు. అది విషప్రయోగమనీ తెలియదు, ఎవరు చేసారోకూడా తెలియదు. రామరాజు దహన సంస్కారాలు కూడా జరిగిపోతాయి.

ఇది తనకి విషం ఇచ్చి చంపాలని ప్రయత్నించిన వారి మీద ధ్వేషం పెంచుకున్న ఓ వ్యక్తి కథ.

"మరణం అంటే నాకు భయంలేదు. ఎందుకంటే నేను జీవించి ఉన్నంతకాలం మరణం నా సమీపంలోకి రాలేదు. అది వచ్చినప్పుడు నేనుండను. ఇంక చావంటే నాకు భయం దేనికి?" ఓ సందర్భంలో రామరాజు తనతండ్రితో అన్న మాటలివి. కాని మరణం తరువాత కూడా తాను ఉంటాడని, ఆ మాటలు అన్నప్పుడు రామరాజుకి తెలియదు. ఇది సాధ్యమా?

ఆ తరువాత ఎన్నో సంవత్సరాలకి ఓ వ్యక్తి నర్మదా పరిక్రమ లో సన్యాసి పరంజ్యోతి ని చూసి అతను పూర్తిగా రామరాజు పోలికలతో ఉండటంతో ఆశ్చర్యపడి, రామరాజు సోదరి కుముదినీదేవికి తెలియజేస్తాడు. ఆమె ఈ విషయాన్ని తన ఇతర సోదరులకు తెలియజేస్తుంది. వారు ఇతర అధికారులతో చర్చలు జరిపి, చనిపోయి దహనంచేసిన వ్యక్తి తిరిగిరావడం ఎలా జరుగుతుంది, ఇదేదో పొరపాటు అని భావిస్తారు. కాని క్రమంగా అదే సమాచారం చాలామందే పంపటంతో అతనిని వెతికి, వివరాలు తెలుసుకోటానికి ప్రయత్నిస్తారు.

ఇక్కడినుంచి, జరిగిన రకరకాల ప్రయత్నాలే కథని అనేక మలుపులు తిప్పి మనల్ని ఏకబిగిన చదివిస్తుంది.

ఎన్నోఆధ్యాత్మిక చర్చలు ఈ నవల నిండా ఉన్నాయి. అయినప్పటికీ అది ఇంకా చదవాలి అన్న కోరికని పెంచుతుందే కాని ఎటువంటి నిరాసక్తతను కలిగించదు. కొన్ని చక్కటి ఆధ్యాత్మిక గీతాలు కూడా మనకి ఈ గ్రంధంలో కనిపిస్తాయి. తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటలు పాడుకోవాలనిపిస్తుంది. ఈ పాటలొచ్చినప్పుడు మనకే తెలియకుండా మనసులో పాడుకుంటాంకూడా.

తమ అనుమానాలు తీర్చుకోటానికి న్యాయస్థానం లో జరిగే అనేక వాదోపవాదాలు కూడా మనకి ఎన్నో కొత్త విషయాలను ఎంతో విపులంగా తెలియ జేస్తాయి. అనేక ఉదాహరణలు కూడా రచయిత మనకి చూపిస్తారు.

నర్మద, గోదావరి నదీ తీరాల్లో జరిగే ఈ కథ ఆధ్యాత్మిక పాఠకులని, సాధారణ పాఠకులని సమానంగా ఆకర్షిస్తుంది.

ఈ నవలకి ప్రేరణ చాలా సంవత్సరాల క్రితం బెంగాల్ లో జరిగిన ఒక నిజ సంఘటనే. ఇది భారతదేశంలో దీర్ఘకాలం కొనసాగి సంచలనాత్మక తీర్పు నిచ్చిన కేసుగా చాలా ప్రసిద్ధి చెందింది. దీని మీద ఆధారపడి ఎన్నో భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి.


మే 2010 లో ముద్రించిన ఈ గ్రంధం వెల రూ 100/-. నవోదయా బుక్ హౌజ్, సుల్తాన్ బజార్, హైద్రాబాద్ లో లభిస్తాయి.


*****************************************************************************

15, డిసెంబర్ 2009, మంగళవారం

'లజ్జ ' ...

'లజ్జ ' - తస్లీమా నస్రిన్

బాంగ్లాదేశ్ లో ఎన్నో పురష్కారలు అందుకున్న తస్లీమా నస్రిన్ , బాంగ్లాదేశ్ లోని మెమైన్ సింగ్ నగరంలో జన్మించి, అక్కడే వైద్యవిద్యనభ్యసించి, డాక్టర్ గా పనిచేశారు.
బాంగ్లాదేశ్ లో జరిగిన మత చాందసత్వం యొక్క వికృతరూపం, మానవత్వాన్ని ఎలా మంట కలుపుతుందో ఈ నవలలో రచయిత్రి వివరించారు. పదమూడు రోజుల్లో జరిగిన అనేక సంఘటనల సమాహార రూపమే ఈ నవల 'లజ్జ '. కేవలం ఏడు రోజులల్లో ఈ నవల పూర్తి చేశారు. అయోధ్యలో 1992, డిసెంబర్ 6 న బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన వెంటనే ఈ గ్రంధం రాశారు. బాంగ్లాదేశ్ లో అధిక సంఖ్యాకులైన ముస్లిం లు హిందువులని హింసించటం ఇందులోని కాథా వస్తువు. ఇది రాసినందుకే ముస్లిం మత ఛా౦దసవాదులు తస్లీమా నస్రీన్ కు మరణదండన విధిస్తూ 'ఫట్వా ' జారీ చేశారు. 1993 సెప్టెంబర్ లో బాంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. నస్రీన్ కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈమెను చంపిన వారికి బహుమతిని కూడా ప్రకటించింది. ఢాకా నగర వీధుల్లో ఈమెకు వ్యతిరేక౦గా ప్రదర్శనలు కూడా జరిగాయి. దీన్ని నిషేధించటానికి ప్రభుత్వం ఇది మత సామరస్యాన్ని చెడగొడుతూ ఉందన్న కుంటిసాకును చూపించింది. "మన లక్షల ప్రాణాలను బలిచేసి పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. మత అతివాదానికి మనం దాసోహమంటే ఆ త్యాగాలకు అర్ధమే లేకుండా పోతుంది. నా అందమైన దేశాన్ని కాపాడుకోవటం నా బాధ్యత, నా హక్కుల్ని రక్షించుకోటానికి నాతో సహకరించమని" దేశ ప్రజల్ని కోరుకున్నారు ఈ రచయిత్రి.లౌకిక వాదులు ఒకరి కొకరు చేతులు కలిపి నప్పుడు మాత్రమే మత దురహంకార శక్తుల్ని ఆపటానికి వీలౌతుందని, మత దురహంకార జాడ్యం ప్రపంచమంతా ఉందని, దానికివ్యతిరేకంగా పోరాడాలని వివరించారు.

ఈ నవలలొ కాలక్రమం లోని ఎన్నో సంఘటనలను తీసుకున్నారు. 1947 తరువాత తూర్పు బెంగాల్, పాకిస్తాన్లో భాగమయ్యింది. తూర్పు బెంగాల్ లో బెంగాల్ ను జాతీయ భాషగా మార్చమని ఉద్యమం ప్రారంభమయ్యింది. పాకిస్తాన్ నియంత్రుత్వ పాలనకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ లో ప్రజల తిరుగుబాటు మొదలయ్యింది. 1971 లో బాంగ్లాదేశ్ స్వతంత్ర దేశం గా అవతరించింది. 1978 లో లౌకిక తత్వాన్ని ప్రధాన సూత్రంగా స్వీకరించిన బాంగ్లాదేశ్ రాజ్యాంగ చట్టంలో మార్పు చేసి, ఇస్లాం ను జాతీయ మతం గా ప్రకటించింది. బాబ్రీ మసీద్ విధ్వంసం కారణం గా బ్లాంగ్లాదేశ్ లో మత కల్లోలాలు చెలరేగి, అల్ప సంఖ్యాక మతస్తుల మీద విపరీతమైన దౌర్జన్య కాండ మొదలైంది. ఆ దౌర్జన్య కాండే, ఈ నవల లోని ప్రధాన కథ.

ఇది నవల కాబట్టి ఇందులోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు అని రచయిత్రి చెప్పినప్పటికీ, అక్కడ జరిగిన ప్రత్యక్ష దౌర్జన్య మారణ హోమానికి ఇందులోని పాత్రలు ఉదాహరణలే. ఈ కథ ప్రధానంగా, బాంగ్లా దేశ్ లో పుట్టి పెరిగిన ఒక హిందూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. డా. సుధామయ్ దత్, అతని భార్య కిరణ్మయి, వారి పిల్లలు సురంజన్, మాయా, మొమైన్ సింగ్ నగరం నుంచి బాంగ్లాదేశ్, పాకిస్తాన్ పోరాట సమయంలో, ఎందరో హిందువులు భారత దేశం వలస పోయినప్పటికి జన్మ భూమి మీది ప్రేమతో దేశ రాజధాని ఢాకాకి తన ఆస్తులను తెగనమ్ముకొని వొచ్చి ఇక్కడే స్తిరపడుతాడు. చుట్టూ ఉన్న అనేక పేద ముస్లిం సోదరులకు ఉచిత వైద్యం కూడా చేస్తూ ఉంటాడు.వీరికి ఎందరో ముస్లిం స్నేహితులు కూడా ఉన్నారు. కిరణ్మయి కి సంగీతమంటే చాలా ప్రేమ. భర్త ప్రోత్సాహం తో నేర్చుకొని ప్రోగ్రాములు కూడా ఇచ్చేది. కాని ముస్లిం లు ఈమె వేదికల మీద పాడటం నిరసిస్తూ, ముస్లిం స్త్రీలను కూడా మార్చేస్తుందని తీవ్రంగా విమర్శిస్తారు. దానితో కిరణ్మయి తనకి ఎంతో ఇష్టమైన సంగీతాన్ని ఒదిలేసి ఇంట్లోనే ఉండిపోతుంది. కొడుకు సురంజన్ కి ఏ మతం మీదా నమ్మకం లేదు. పూర్తి అభ్యుదయవాదాలు కలవాడు. ఎం.ఎస్.సి. చదివినప్పటికీ కేవలం హిందువు అనే కారణం తో ఇతని కన్న తక్కువ చదివిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి కాని ఇతనికి చిన్న ఉద్యోగం కూడా లభించదు. ముస్లిం యువతి పర్వీన్ ను ప్రేమిస్తాడు. కాని మతం మార్చుకుంటేనే ఆమె పెద్దలు వివాహానికి అంగీకరిస్తారు. మతం మీద ఆధార పడిన వివాహం తనకి వొద్దని అంగీకరించడు. ఇతని చెల్లెలు ట్యూషన్ ల ద్వారాకొంత డబ్బుని సంపాదించుకుంటూ ఉంటుంది. అవసరమైనప్పుడు అన్నకు సహాయం చేస్తూ ఉంటుంది.

మాయకి, భారత దేశ విభజన, 1971 బంగ్లాదేశ విభజన, అంతకు ముందు జరిగిన అల్లరులు ఏవి ఆమెకి తెలియదు. ఆవిడకు బుద్ధి తెలిశాక అర్ధమయిందల్లా, బాంగ్లాదేశ్ లో అధికార మతం ఇస్లాం అని, తాము అల్పసంఖ్యాకులైన హిందువులని, కాబట్టి తాము ఆ దేశం లోని వ్యవస్తతో తరచుగా సర్దుబాట్లు చేసుకోక తప్పదని. ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. 1990 లో జరిగిన అల్లరులు ఆమెకి తెలుసు. తన ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన జ్ఞానాని ఇచ్చింది. బాబ్రీ మసీదు కారణం గా ఢాకాలొ తీవ్రమైన అల్లరులు చెలరేగాయి. ఇప్పటి ఈ గొడవాలతో హిందువులు గుంపులు గుంపులు గా భారత దేశానికి పారిపోతున్నారు. కాని సుధామయ్ మనసు అందుకు అంగీకరించలేదు. మాయ తన కుటుంబమంతా కూడా ముస్లిం స్నేహితుల దగ్గిర తలదాచుకుందామని అడుగుతుంది. దానికి కూడా అంగీకరించడు. సురంజన్ ఏమైనా దారిచూపిస్తాడేమో అని ఎదురుచూస్తుంది. కాని అతనిలో కూడా చలనం లేక పోవటం తో తాను మాత్రమే ముస్లిం స్నేహితుల ఇంటికి వెళ్ళిపోతుంది. త౦డ్రికి పక్షవాత౦ రావట౦తో, తన రక్షణ మరచి, త౦డ్రి కోస౦ ఇ౦టికి ఒచ్చేస్తు౦ది.

సురంజన్ తన మిత్రులందరి ఇళ్ళకి తిరుగుతూ వాళ్ళను పరామర్శిస్తూ ఉంటాడు. దారిలో జరుగుతున్న ఎన్నో విధ్వంస కాండలు గమనిస్తూ ఉంటాడు. ఢాకా లో ఉన్న దేవాలయాలు నేల మట్టం అయిపోయాయి. హిందువుల ఆస్థులు కొల్లగొట్టారు. స్త్రీలను ఎత్తుకు పోతున్నారు. ఊరంతా శిధిలాలతో నిండి పోయింది. కొంతమంది హిందువులు మాత్రం వాళ్ళ ముస్లిం స్నేహితుల ఇళ్ళల్లో రహస్యంగా తలదాచుకుంటున్నారు.

ఇవన్నీ గమనించిన సురంజన్ తీవ్ర మైన ఆవేశానికి లోనౌతాడు. "ఒక మసీదును కూలదోస్తే వారికంత కోపం వొచ్చింది కదా, దేవాలయాలను కూలదోస్తే హిందువులకు కోపం ఒస్తుందని వారికి అర్ధం కాదా! వందలాది దేవాలయాలు కూల దోయాలా! ఇస్లాం మతం శాంతిని కాదా బోధించేది?" అని ఈ ముస్లిం రచయిత్రి సురంజన్ తోటి ధైర్యంగా పలికించింది.

ఇంట్లో తినటానికి కూడా ఏమి లేక, భర్త ఆరోగ్యం ఉన్నట్లుండి పాడైపోయినా, ఇల్లు ఒదిలిపోలేని నిస్సహాయ స్థితిలో " ముస్లిం లకు మాత్రమే బాధపడే హక్కు, కోపం తెచ్చుకునే హక్కులున్నాయా?" అని కిరణ్మయి తోటి అనిపించ గలిగింది ఈ రచయిత్రి. ఊరందరినీ పరామర్శిస్తూ తిరిగే సురంజన్ ఒక రోజు తన ఇంట్లోనే విధ్వంసాన్ని చూస్తాడు. చెల్లి ఇంట్లో లేక పోవటాన్ని గమనిస్తాడు. ఏ౦ జరిగి౦దో ఊహి౦చి, తీవ్రమనస్తాపంతో జీవాచ్చవాల్లా పడి ఉన్న తల్లితండ్రులని ఓదార్చలేక పోతాడు. మానసిక క్షోభతో తానుకూడా మతదురహంకారిగా, విప్లవవాదిగా మారిపోయి ముస్లింల అంతం చూడాలని నిర్ణయించుకుంటాడు. చివరికి ఈ కుటు౦బ నిర్ణయ౦ ఏవిటి?

ఈ రచయిత్రి కొన్నిఇతర విమర్శలను కూడా గుప్పించింది. బాబ్రీ మసీద్ ధ్వంసం కన్నా ముందుగానే బాంగ్లాదేశ్ లో హిందువులను హింసించటం మొదలయింది, కాని వీళ్ళు బాంగ్లాదేశ్ ని మతసామరస్య దేశమని నమ్ముతారు. అది నిజ౦ కాదని, హి౦దువుల విధ్వ౦సాన్ని, లెఖ్ఖలేనన్ని ఉదాహరణలతో ఈ నవలలోనే వరుస పెట్టి చూపించింది.

టి.వీల్లో దేవాలయాల విధ్వ౦స౦ చూపి౦చకపోవట౦ తీవ్ర౦గా వ్యతిరేకి౦చి౦ది. భారతదేశ౦లో ఎన్నో మతకలహాలు జరిగినప్పటికీ, ముస్లి౦లు, దేశ౦ ఒదిలిపోలేదు. అదే బా౦గ్లాదేశ్ లో హి౦దువులు పారిపోతున్నారని తీవ్ర౦గా విమర్శి౦చి౦ది. బ౦గ్లాదేశ్ ను౦చి వెళ్ళిపోయిన హి౦దువుల ఆస్థిని "శత్రువుల ఆస్థిగా" ప్రకటి౦చి ప్రభుత్వ౦ ఆక్రమి౦చి౦ది. అదే భారత దేశ౦లో ప్రభుత్వ౦ కనీస౦ ఆ భూములను సర్వే కూడా చేయి౦చలేదు, అని రె౦డు దేశాల మధ్య ఉన్న లౌకికత్వాన్ని ఎత్తి చూపి౦చి౦ది.

బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశం లోని ముస్లిం ల కోసం మత సామరస్యాన్ని వహించమని ప్రజలని కోరి౦ది. అదే బంగ్లాదేశ్ లో పౌరులైన హిందువుల క్షేమం గురించిన ఆలోచన లేదా? భారత దేశం లోని ముస్లింల గురించి ఎందుకు ఆందోళన? ఎంతో గుండెధైర్యంతో ప్రశ్నించగలిగింది ఈ రచయిత్రి.

ఈ నవలకు ఒక ముగింపు, సస్పెన్స్, కొసమెరుపులంటూ ఏమి లేవు. మొదట ఎలా ప్రారంభమవుతుందో, చివరివరకు అలాగే కొనసాగుతుంది. ఇంకా ఎన్నో పాత్రలు బాంగ్లాదేశ్ లో హిందువులనుభవించిన కడగండ్లకు ఉదాహరణగా మన కళ్ళ ముందు నిలుస్తాయి. అలా చదువుకుంటూ వెళ్ళిపోవాల్సిందే.

అడుగడుగునా ఈ రచయిత్రి తెలిపిన నగ్నసత్యాలే చివరికి ఈమెని తన మాతృభూమి నుంచి ప్రాణాలరచేతబట్టుకొని భారతదేశం పారిపోయేలా చేసింది. భారతదేశం లోని ముస్లిం లు కూడా ఈమెని చాలా తీవ్రంగా అవమానించారు. చివరికి భారత దేశం కూడా వొదిలివేయవలసివొచ్చింది. రహస్యజీవనాన్ని గడపవలసిన అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఈ రచయిత్రి ఎక్కడెక్కడో ఉన్నట్లుగా చెప్తారు కాని, నిజానికి ఎక్కడుందో సరి అయిన ఆధారాలు మాత్రం లేవు. మతసామరస్య౦ కోస౦ పోరాడితే ఇదా ఫలిత౦!

ఈ గ్ర౦ధాన్ని భారత ఉపఖ౦డ౦ లోని ప్రజలకి అ౦కిత౦ చేసి౦ది ఈ రచయిత్రి. మత అతివాదానికి లోనుకావద్దని వేడుకు౦టు౦ది. "లజ్జ" మన సామూహిక పరాజయానికి ఒక సాక్ష్య౦.

వల్ల౦పాటి వె౦కటసుబ్బయ్య దీనిని తెలుగు లో అనువది౦చారు.
దీని వెల రూ. 80, విశాలా౦ధ్ర పబ్లిషి౦గ్ హౌజ్, హైదరాబాద్ లో ప్రతులు లభ్యమవుతాయి.
2008 లో, 1000 ప్రతులను మాత్రమే ముద్రి౦చారు.


**********************************************************************************************

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner