22, సెప్టెంబర్ 2010, బుధవారం

’ఎండమావిలో ఎడారి"!!!





మనిషి జీవిస్తూనే ఉన్నాడు. కాని, ఎలా!!! తన జీవితం సుఖమయం చేసే సాధనాలు శోధిస్తూ...ఈ పరిశోదన నాటికీ, నేటికీ కొనసాగుతూనేఉంది. శాంతియుతంగా, సులభంగా, నిశ్చింతగా జీవించటానికి మార్గాలు, ఆ నాటి రాతియుగం మానవుడు...నేటి అణుయుగం మానవుడూ వెదుకుతూనే ఉన్నారు. కృత్రిమంగా ఎన్నెన్నో సాధనాలు కనిపెడుతూనే ఉన్నాడు. కాని దేనికి!!! కేవలం నాలుగ్గోడల మధ్య బందీ కాకుండా ఎగిరిపోవాలనే. ఎన్నో కొత్త విషయాలు శోధించాలన్న ఉత్సాహమే, మానవుడ్ని చంద్రమండలం వరకూ తీసుకెళ్ళింది. అచిరకాలంలోనే ఈ మానవుడి తెలివి తేటలు, ఇంకా...ఇంకా..విస్తరిస్తున్న విశ్వంతోపాటు దూసుకెల్తూనే ఉన్నాయి. ఇంత ప్రగతి సాధిస్తున్న, అదే మానవుడు...తన అహంకారంతో అధ:పాతాళానికి పడిపోతున్న సంగతి మాత్రం తెలుసుకోలేక పోతున్నాడు. అంతులేని ఈ బ్రహ్మాండ భాండంలో పరమాణు తుల్యుడైన మానవుడెక్కడ? అతనికీ అహంకారమెందుకు?

సహజత్వాన్ని కృత్రిమంతో కలిపి నాశనం చేస్తున్నాడు. అన్నీ కృత్రిమాలే...ప్రేమా, అభిమానం, అనురాగం అన్నీ మేడిపండుపై మెరుగులే. గులాబీ కెంపుల అందాన్ని చూసి ఆనందించి అందుకోబోతే, చేతికి పెంకుల గులాబీ తగులుతుంది గట్టిగా. అప్పుడు కానీ అది కృత్రిమ గులాబీ అని తెలియటంలేదు. మన ఆనందం అంతా కేవలం దూరంగా ఉన్నంతవరకే....

సంఘీభావమే లేకపోతే మానవునికి ఆకాశంలోకి ఎగరటం సాధ్యమా? అతని తెలివి పెరిగి తారాపధాన్ని అందుకొనేదా? కానీ వ్యక్తిగతమైన విషయాల్లో మాత్రం, ఒకరితోఒకరు ఏకీభవించలేకపోతున్నారు. తన సంతోషం, సుఖం, అభివృద్ధి కోసం మరొకరి వినాశనానికి ఎన్నో కుతంత్రాలు ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం ఇటువంటి అహంకారమే మనుషుల్లో ఎక్కువగా పాతుకుపోయి కనిపిస్తోంది. విజ్ఞాన శాస్త్ర పథంలో ఇతరులకు తోడ్పడి, సహకరించే మానవుని నైజం స్వవిషయాల్లో స్వార్ధపరత్వంతో నిండిపోతోంది. ఈ అహంకారం పోయిననాడే మానవుడు సంపూర్ణత్వాన్ని సాధించాడనిపిస్తుంది.

పురాణకాలంలో దేవదానవుల జాతిభేదమే వారిలో యుద్ధాలను ప్రేరేపించింది. ఆ కాలంలో జన్మత: శతృవులుగా ఉండి ఒకరినుంచి ఒకరు రక్షించుకోటానికి యుద్ధాలు చేసేవారు. చివరికి ఈ నాటికి మిగిలింది మాత్రం మనుషులే!!! ఇప్పుడు కేవలం ఒక్కరే అవటం మూలంగా ఎవరితో పోట్లాడాలి! తమ శక్తి సామర్ధ్యాలు ఎవరిమీద చూపించాలి? ఎవరిని జయించాలి? అన్నది అర్ధం కావటంలేదు. అందుకని మానవులే మానవులపై తమతమ ప్రభావాలు చూపించుకోవాలని, ఒక ప్రాంతపు ప్రజలు ఇంకోప్రాంతపు ప్రజలని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఏ దేశ చరిత్ర పుటలు తిరగేసినా తేటతెల్లమయ్యేది ఈ విషయమే...వీరు మన పూర్వీకులు, ప్రత్యక్షంగా నీవు నా ఆధీనంలో ఉండాలి, లేకపోతే నా శతృవైన నీకు నాకు ఫలానా సమయంలో, ఫలానా చోట యుద్ధం జరుగుతుంది, అని ప్రకటించుకొని, ముఖాముఖి పోరాడుకొని, బలాబలాలు తేల్చుకునే వారు. ఒక విధంగా ఆ పద్ధతే నయమేమో!!!

కాని, ఈ నవీన కాలంలో...అణుయుగంలో, మానవుడు విశ్వంలోకి ఎగిరెగిరి పోతున్న ఈ సమయంలో, తన శతృవులెవరు..అన్నది ఒక సమస్యగా పీడిస్తోంది. మిత్రులలాగా సంచరిస్తూ వెన్నుపోటు పొడిచే వారొకరైతే... వీరు మన హితైషులు కారు అని తెలుసుకునే లోపలే భష్మం చేసేసే వారొకరు. అధికారం అనే ముల్లుకర్రతో పొడిచే వారొకరైతే, ఆశలు కల్పించి రంగుల వలలోకి రప్పించి ఉచ్చులు బిగించేవారొకరు. పైకి మటుకు అందరూ పెద్ద మనుషులే, సంస్కారవంతులే!!!! ఇటువంటి వారిని గుర్తుపట్టటమే కష్టమైతే, ఇంక వీరికి దూరంగా మసలటం అన్నది ఎలా సాధ్యం?

పదవి...అనే తన గొడుగును చేతిలో ఉంచుకొని, తన వారిని మాత్రమే ఆ నీడలో ఉంచి, పరులకు నీడలేకుండా చేయటమే తమ ధ్యేయంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలాంటి వారేకాకపోయినా, కొందరైనా ఉన్నారు. చెదపురుగులు ఎన్ని ఉంటాయి. అవి ఎంత హాని కలుగచేస్తాయి? వాటిని గుర్తుపట్టటం అందరికీ సాధ్యమా? ఎవరికో...ఎక్కడో తప్ప సామాన్యంగా ఇలాంటివి కనిపించవు. ఇలాంటి పెద్దమనుష్యులను ఎలా గుర్తుపట్టాలి. ఒకవేళ గుర్తుపట్టినా...మనమేం చేయగలం? అటువంటి ప్రయత్నాల్లో మాడిపోవటమేనా చివరికి దక్కే ఫలితం?

ఈ ఆధునిక మానవుడు నాగరికత అనే వలువలను అధిక సంఖ్యలో ధరించాడు. విజ్ఞాన శాస్త్ర వినువీధిలో విహరిస్తున్నాడు. దశావతారాల్లో అయినా, " Organic evolution" చూపగల మేధా సంపన్నుడు. మరి నైతికంగా, సాంఘీకంగా సాధించిన ప్రగతి ఎంత? ఇప్పటి వరకు సాధించాను అనుకొన్న ప్రగతి ఎండమావేనా? తాను జీవితపుటెడారిలో, ఒయాసిస్ వైపుకు పురోగమించాననుకొన్న సమయంలో...అది కేవలం ఎండమావేనా? ఆ ఎండమావి చాటున దాక్కున్న అమానుషత్వమనే ఈ భయంకర ఎడారిని చూడగలితే....ఇప్పుడు కూడా బ్రహ్మదేవుడు, మానవులకు "శతృవు" ని సృష్టించి వీరే నీ శతృవు అని చూపించేసి ఉంటే బాగుండేదేమో!!!

"కవిని మాత్రం సూర్యునితో
ఖచ్చితంగా పోల్చవచ్చు
ఏడువన్నెలు జీర్ణించుకొని
ఏకవర్ణం చిమ్ముతాడు"
"ప్రమిదలో మినుకు మినుకు మనే తైల దీపం అంటుంది, నా చేతనైనంత సాయపడతాను ప్రభూ"!!! అని----ఠాగూర్.



****************************************************************************

12 కామెంట్‌లు:

Pranav Ainavolu చెప్పారు...

పరమాణువులోని నటరాజ నాట్యాన్ని పార్టికిల్ ఛాంబర్ లో ప్రదర్శిచగలిగే మేధస్సు ఉంది. ఇలాతలం పై ఉన్న జీవరాశులన్నింటినీ జయించాడు. కానీ అరిషడ్వర్గాలను మాత్రం జయించలేకపోతున్నాడు.

అన్నిటినీ కృత్రిమత్వం చేయడమే నాగరికత అనుకుంటూ తనకే తెలియని దేనికోసమో ఎండమావిని చూస్తూ పరిగెడుతున్నాడు.

మీరన్నట్టు ఆ దేవుడు ఒక బలవంతుడైన శత్రువును పంపితే అందరూ ఒక్కటౌటారేమో! :)

మీ బ్లాగులోకి రావటం ఇదే మొదటిసారి. చాలా బాగుంది. ఆలోచనా వైఖరి, పరిధి, వివరించే విధానం నచ్చాయి.

జయ చెప్పారు...

ప్రణవ్ గారు స్వాగతం. నేను పరిశీలిస్తున్న మానవ సంబంధాలు, ప్రగతి ....నాతోటి అలా రాయించాయండి. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

ఆలోచింపజేసే టపా..

జయ చెప్పారు...

అప్పుడప్పుడు ఎందుకో గాని ఇలాంటి ఆలోచనలు అలజడి రేపేస్తూ ఉంటాయండి మురళి గారు. దానికి ఫలితమే ఇటువంటి రాతలు:) ఇలా రాస్తే ఎవరైనా అసలు చదువుతారా, లేదా అన్న ఆలోచన కూడా ఉండదు.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అంతులేని ఈ బ్రహ్మాండ భాండంలో పరమాణు తుల్యుడైన మానవుడెక్కడ? ఈ ప్రశ్న మాత్రం నన్ను చెదలు పురుగు తొలిచినట్టు తొలిచేస్తుందండి. ఇలాంటి అలోచనలతో బ్లాగులకు వచ్చిన క్రొత్తలో నేను వ్రాసుకున్న కవిత ఇక్కడ.

http://chiruspandana.blogspot.com/2008/11/blog-post_01.html

జయ చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు, మీకెలా ధన్యవాదాలు చెప్పాలో తెలియటం లేదు. మీ కవిత చదివాను. అంతేకాదు. అక్కడినుంచి ఉషా గారి రచన కూడా చదివాను. అక్కడ జరిగిన చర్చ అల్లకల్లోల మవుతున్న నా మనసును ఓదార్చింది అంటే అతిశయోక్తి కాదు. ఇటువంటి మధనమే మనిషికి తానెవరో తెలుసుకోటానికి తోడ్పడుతుంది. బుద్భుదప్రాయమైన జీవితపు విలువనూ తెలుపుతుంది. అంతేకాదు, ఎలా జీవించాలో కూడా నేర్పిస్తుంది.

శిశిర చెప్పారు...

చాలా లోతైన భావాలున్న టపా. వివరంగా స్పందించేటంత పరిణితి నా ఆలోచనలకి లేదేమో అనిపిస్తూంది. కాని మీ ఆవేదన మాత్రం మనసుని తాకింది.

జయ చెప్పారు...

ఎదసడి పోస్టుల్లో నాకెంతో పరిణితి కనిపిస్తుంది శిశిరా.

తృష్ణ చెప్పారు...

జయగారూ, మనం రాసే చాలావరకూ టపాలను మన బ్లాగ్ ఫాలోవర్స్ , అభిమానులు చదవవలసిందే. మెల్లగా అది కూడా బాగా తగ్గిపోతోంది...మన ఆత్మ తృప్తి కోసం రాసుకోవటం. అంతే.

మీ టపాలో నాకు రెండు విషయాలు మిక్స్ అయ్యి కనబడ్డాయి...!
అదివరకూ ఒక సందర్భంలో నేను రాసిన పోస్ట్లో కొన్ని వాక్యాలు ఇవి...

"మానవ మస్తిష్కం....
అణుబాంబును తయారు చేయగలిగింది.
చందమామపై అడుగులేయించింది.
తలరాతలను మార్చగలిగింది.
ప్రాణాలను పోయగలిగింది.
ఎన్నో వింతలను సృష్టించగలిగింది....కానీ...

ఈ మానవ మస్తిష్కం....
తనలోని మూర్ఖత్వాన్ని అణగార్చలేకపోతోంది...
తనలోని కౄరత్వాన్ని జయించలేకపోతోంది....
తనలో విచక్షణను పెంచలేకపోతోంది...
సమైక్యతాభావాన్ని బ్రతికించలేకపోతోంది..."

keep blogging.

జయ చెప్పారు...

తృష్ణ గారు, నాకు ఫాలోవర్స్, అభిమానులు ఏమిటండి. నాది చాలా సింపుల్ బ్లాగ్.

ఇందులో నేను మిక్స్ చేసి రాసిందేమీ లేదండి. నా మనో భావాలు పరుచుకుంటూ వెళ్ళాను. అంతే.

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగులోకి రావటం ఇదే మొదటిసారి.
చాలా బాగా చెప్పారు. కాకపోతే @ అంతులేని ఈ బ్రహ్మాండ భాండంలో పరమాణు తుల్యుడైన మానవుడెక్కడ?
మానవుడు పరమాణు తుల్యుడు కూడా కాలేడండీ. ఎందుకంటే పరమాణువు యొక్క శక్తి అపారం. ఆ మాటకొస్తే ఈ సృష్టి అంతా పరమాణువు తోనే ప్రారంభమవుతుంది.
Nice blog. I'll respond in detail later. Nice to see ur blog through Edasadi.

జయ చెప్పారు...

RSReddy garu, thanq

 

మనస్వి © 2008. Template Design By: SkinCorner