31, డిసెంబర్ 2009, గురువారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం
పులకించిన కాలపు ఒడిలో చిగురించినదొ పుష్పం
పలికిన పాటకి నా ప్రాణం, అంకిత మన్నది నా హృదయం
మనసులో ఉన్నది ఆ మాట, కమ్మగా తెలుపనా ఈ పూట...

హ్యాపీ న్యూ ఇయర్
ఇది చూసిన మిత్రులందరికీ, ప్రతిఒక్కరికీ, మనందరికీ...నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నాలుగైదు రోజులనుంచి మా చిన్నారి పిల్లలు ఫోన్లు చేసి మరీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. మనసు పులకించి పోతోంది. చిన్న చిన్న విషయాలకు బాధపడొద్దన్నారు కాని, చిన్న విషయాలకు సంతోష పడొద్దనలేదుగా...

ప్రతి ఒక్కరికి కూడా నా హ్రుదయ పూర్వక నూతన స౦వత్సర ఆన౦దమయమైన, ఆశల అభిన౦దనలు.

అరవిరిసిన మల్లెల సుగ౦ధ౦లా,
ఆహ్లాదకరమైన పసిపాప చిరునవ్వులా,
సుమధుర సుస్వర స౦గీత ఝరిలా,
వేద౦లా వినిపి౦చే ప్రణవ నాద౦లా,
ఉదయి౦చాలి ఈ నూతన వత్సర౦...

వెన్నెల౦త చల్లని స్నేహాన్ని,
మల్లెల౦త తెల్లని స్నేహాన్ని,
మ౦చినెపుడు కోరే స్నేహాన్ని,
మనిషి మనిషి కీ అవసరమైన స్నేహాన్ని,
ప౦చివ్వాలి ఈ నూతన వత్సర౦...

పచ్చని ఆకులతో విరబూసే పూవులతో
కదలాడే అ౦దాల ఈ స౦వత్సర వృక్షాన్ని
చూస్తూ నిలబడాలని నా కోరిక!
అ౦దమైన పూవులు
అమృతం ని౦డిన కాయలు
నీలో పూసి కాయాలని,
నీవు ప్రకృతికే కాదు,
జీవితానికే పర్యాయ పదానివి.
శిశిర౦ లో రాబోయె వస౦త౦ లా,
నిరాశలో కూడా ఆశతో ఎదురు చూసేలా,
ధీరత్వానికి ప్రతీక గా,
ఈ స౦వత్సర౦ ఆదర్శవ౦తమవ్వాలని
నీవు మాకు సకలశుభాల నివ్వలని,
నా కోరిక.....

మీ అందరికీ నాకు ఎంతో ఇష్టమైన ఈ పాట తో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాను ...

WELCOME TO NEW YEAR







ఆనందమానందమాయే

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాట గ మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినది

నువునడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితే గుండెల్లో కొత్త సడిని వింటున్నా
నీలికళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా
నిండు గుండె గుమ్మంలో తోరణంగా నేనున్నా
నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో ఊపిరిపాటై పాడగా
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే

రాగబాల రమ్మంటూ స్వాగతాలు పలికింది
ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది
జతగా నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి నీ కోసం ప్రేమను దాచి
రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి
శుభాకంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో
అన౦ద మాన౦దమాయె మది ఆశల న౦దనమాయె
మాటలు చాలని హాయె ఒక పాటగ మారిన మాయె

*****************************************************

20, డిసెంబర్ 2009, ఆదివారం

కొత్త కోడలు



అత్త, కోడల్ని బాధ పెడుతోందా! లేకపోతే, అత్తే, కోడలి ద్వారా బాధ పడుతోందా! కోడల్ని అత్త బాధ పెడితే చర్య తీసుకోటానికి ఎన్నో చట్టాలున్నాయి. మరి కోడలు అత్తని బాధ పెడితే అత్తకి రక్షణ గా ఏమన్నా చట్టాలున్నాయా?

బాధలు పడుతున్న కోడల్ని మాత్రమే సంఘం గమనిస్తోందా! మరి అత్త, కష్టాలెందుకు గమనించటం లేదు.
అంటే, శక్తి ఉన్న కోడళ్ళు తమ బలాన్ని చూపించుకుంటున్నారా? ముసలి వారైన అత్తలు బలహీనులు కాబట్టి బయట పడటం లేదా? కోడళ్ళు బయట పడ్డంతగా అత్తల కష్టాలు తెలియక ఫోవటానికి కారణ మేంటి? కోడళ్ళు అత్తింటికి రావటం తోటే ఒక ధృఢ మైన ధ్యేయం తోటి ఒస్తున్నారు. రాగానే అత్తని దూరం చేసి, భర్తను కొంగున కట్టి ఆడిస్తున్నారు. కాబట్టి అత్తేమి చేయలేక పోతో౦దని ఒక అభిప్రాయం. కొడుకు మీది అభిమానంతో అత్త అన్ని బాధలు భరిస్తోంది అంటారా!

దీనికి విరుద్ధం గా కోడళ్ళ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అత్తల పెళ్ళిళ్ళ కాలం నాటి పరిస్థితులు వేరు. వారు ఈ కాలం యువతుల లాగా పూర్తి స్వేచ్చ లో లేరు. ఇప్పటి సౌఖ్యాలు కూడా వారికి అందుబాటులో లేవు. కనుక తన కళ్ళ ముందు కోడలు ఆధునిక జీవితం గడపటం భరించ లేక అసూయ తో సమస్యలు సృస్టిస్తారు అన్నది వారి వాదన.

మరి అత్తా, కోడళ్ళ మధ్య కుమారుని బాధ్యత ఏమన్నా ఉందా? ఇద్దర్నీ పట్టించుకోకుండా అలాగే ఒదిలేయాల? లేకపోతే ఇద్దరి సమన్వయానికి పాటు పడాల్సిన బాధ్యత కుమారునికేమైనా ఉందా? ఇది ఆడవాళ్ళ సమస్య, తనకేమి సంబంధం లేదు అనుకోని, తాను మాత్రం ఇద్దరితో మంచిగా ఉంటే సరిపోతుందా!

ఆడ దానికి ఆడదే శతృవు...అన్న మాట నిజమేనా? ఒకవేళ ఇది నిజమే అయితే అలా అనుకోవటానికి బలమైన కారణాలేమిటి? అత్తా ఒకింటి కోడలేగా! ఒకవేళ తన అత్తతో అభిప్రాయ భేధాలు ఉండి ఉంటే, ఆ అనుభవం తో తన కోడలి పట్ల ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్న అత్తలు కూడా ఉన్నారు. దీన్ని కోడలు అలుసుగా తీసుకొని తానే అజమాయిషీ చేస్తు, అత్తను అవమానిస్తూ ఉంటే...అప్పుడు ఆ అత్త గతి ఏమిటి? అప్పుడు అత్త దగ్గిర, ఇప్పుడు ఈ కోడలి దగ్గిర రెండు వైపులా అసహాయతను ఎదుర్కొన్న వారి పరిస్థితి ఇంక అంతేనా!

ఎన్ని యుగాలు గడిచినా ఈ అత్తా, కోడళ్ళ సమస్య అంతం లేనిదేనా? ఈ సమస్యకు పేదా, గొప్ప అన్న తారతమ్యమే లేదే! దీనికి పరిష్కారమే లేదా? ఆధునిక సంఘం లో చదువుకొని, ఉద్యాగాలు చేస్తున్న అత్తా, కోడళ్ళ మధ్య కూడా ఇంకా కొనసాగుతున్న ఈ సమస్యలకి కట్నమా, స్వార్ధమా, అహంకారమా, భయమా, నిస్సహాయతా, ఆర్ధిక స్వేచ్చా ఏవిటి కారణం?

వీటన్నిటికి అతీత౦గా అత్తా, కోడళ్ళిద్దరూ హాయిగా నవ్వుతూ, తుళ్ళుతూ, స్నేహితుల్లా, ఇద్దరూ కాలేజ్ అమ్మాయిల్లా చెట్టాపట్టాలేస్కోని తిరిగేస్తూ ఉంటే... ఆ ఇంటి మొగవాళ్ళే అది తట్టుకోలేక, కుళ్ళుకునే రోజులొస్తే ఎంత బాగుంటుందో కదూ! ఇలాంటి బ్రమ్హాండమైన మార్పే గనుక ఒస్తే, ఇంక తండ్రీ కొడుకుల మధ్య పోటీ ఒస్తుందేమొ!!!

అసలు ఇన్ని ఆలోచనలు రావటానికి నాకొక కారణం ఉంది. ఇప్పుడే ఈ ఆలోచనలు ఎందుకొచ్చాయి అంటారా! ఉందండి...బలమైన కారణమే ఉంది. రోజూ ఎన్నో రకాల అత్తాకోడళ్ళను చూస్తున్నాను. మరి రేపు నేనెలా ఉంటానో?

కోడల్ని పీడించే అత్త లాగా ఉంటానా?

లేకపోతే కోడలి చేతిలో ఒక నిస్సహాయ అత్త లాగా ఉండి పోతానా?

మావాడు ఇంకా చదువుకుంటున్నాడు. చదువు పూర్తి కావాలి. మంచి ఉద్యోగం దొరకాలి. చక్కటి అమ్మాయి దొరకాలి. అప్పుడు కదా వాడి పెళ్ళి. వాడే అమ్మయిని చూసుకుంటాడో, లేకపోతే నేను చూసే అమ్మాయిని ఇష్టపడతాడో! ఇప్పుడేమి చెప్పలేను కదా! ఒకవేళ వాడే అమ్మాయిని చూసుకుంటే ఏభాష పిల్లో ముందే కనుక్కొని, ఆ భాషకి సంబంధించిన 30 రోజులలో ఫలానా భాష నేర్చుకోండి అనే బుక్ కొనుక్కొని, ఆ భాష నేర్చుకొని, నా కోడలితో స్నేహానికి సిద్ధమై పోదామనే నా కోరిక.

నా దృష్టి లో కోడలు, అత్తా ఇద్దరూ కోడళ్ళే. ఇద్దరి జీవితాలు కొత్త కోడలిగానే మొదలవుతుంది.

అలా ఊహించుకుంటే నా మదిలో మెదిలిన భావాలివి:
కొత్త కోడలు

పుట్టింటి పెరటి నుండి పెకిలింపబడి
అత్తింటి తోటలో నాటబడిన
లేత గులాబి మొక్క కొత్త కోడలు!
కొన్ని మొక్కలు ఎండిపోతాయి ఆదిలోనే!
అనురాగపు నీరు లేక
ఆత్మీయతా బంధం లేక
మరికొన్ని మొక్కలు చచ్చి బ్రతుకుతాయి
బ్రతుకులో నిలదొక్కుకుంటాయి
బ్రతక నేర్చిన మొక్కలు కొన్ని
వసి వాడకుండానే పైకెదిగిపోతాయి
ఎవరెన్ని బాధలు పెట్టినా
భర్త ప్రేమ ఉంటే చాలనుకుంటుంది వెర్రిబాగుల్ది
అతను కలలో రాకుమారుడు కావద్దని
మనీ మనిషి కావద్దని
మామూలు మనిషి గా
అందమైన స్నేహ బంధం తో
తన దరి చేరాలని
ఆ ఆనందానుభూతికై
ఎంతటి త్యాగానికైన సిధ్ధమౌతుంది
ఈ కోడలే ఒక పరిపూర్ణ స్త్రీ!!!

(ఆలాయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి)

ఒక స్త్రీ కి కొండంత అండగా నిలిచేది కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలు. అవి పుష్టిగా పొందిన స్త్రీ అందరికి కల్పతరువే అవుతుంది.
ఏదీ తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి...
బాధల్ని నిన్ను బాధించకుండా సాగిపోనివ్వాలి....
అచ౦చలమైన ధ్రుఢస౦కల్ప౦తో విజయాన్ని సాధి౦చవచ్చు కదూ!!!


************************************************************************************

15, డిసెంబర్ 2009, మంగళవారం

'లజ్జ ' ...

'లజ్జ ' - తస్లీమా నస్రిన్

బాంగ్లాదేశ్ లో ఎన్నో పురష్కారలు అందుకున్న తస్లీమా నస్రిన్ , బాంగ్లాదేశ్ లోని మెమైన్ సింగ్ నగరంలో జన్మించి, అక్కడే వైద్యవిద్యనభ్యసించి, డాక్టర్ గా పనిచేశారు.
బాంగ్లాదేశ్ లో జరిగిన మత చాందసత్వం యొక్క వికృతరూపం, మానవత్వాన్ని ఎలా మంట కలుపుతుందో ఈ నవలలో రచయిత్రి వివరించారు. పదమూడు రోజుల్లో జరిగిన అనేక సంఘటనల సమాహార రూపమే ఈ నవల 'లజ్జ '. కేవలం ఏడు రోజులల్లో ఈ నవల పూర్తి చేశారు. అయోధ్యలో 1992, డిసెంబర్ 6 న బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగిన వెంటనే ఈ గ్రంధం రాశారు. బాంగ్లాదేశ్ లో అధిక సంఖ్యాకులైన ముస్లిం లు హిందువులని హింసించటం ఇందులోని కాథా వస్తువు. ఇది రాసినందుకే ముస్లిం మత ఛా౦దసవాదులు తస్లీమా నస్రీన్ కు మరణదండన విధిస్తూ 'ఫట్వా ' జారీ చేశారు. 1993 సెప్టెంబర్ లో బాంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. నస్రీన్ కు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఈమెను చంపిన వారికి బహుమతిని కూడా ప్రకటించింది. ఢాకా నగర వీధుల్లో ఈమెకు వ్యతిరేక౦గా ప్రదర్శనలు కూడా జరిగాయి. దీన్ని నిషేధించటానికి ప్రభుత్వం ఇది మత సామరస్యాన్ని చెడగొడుతూ ఉందన్న కుంటిసాకును చూపించింది. "మన లక్షల ప్రాణాలను బలిచేసి పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. మత అతివాదానికి మనం దాసోహమంటే ఆ త్యాగాలకు అర్ధమే లేకుండా పోతుంది. నా అందమైన దేశాన్ని కాపాడుకోవటం నా బాధ్యత, నా హక్కుల్ని రక్షించుకోటానికి నాతో సహకరించమని" దేశ ప్రజల్ని కోరుకున్నారు ఈ రచయిత్రి.లౌకిక వాదులు ఒకరి కొకరు చేతులు కలిపి నప్పుడు మాత్రమే మత దురహంకార శక్తుల్ని ఆపటానికి వీలౌతుందని, మత దురహంకార జాడ్యం ప్రపంచమంతా ఉందని, దానికివ్యతిరేకంగా పోరాడాలని వివరించారు.

ఈ నవలలొ కాలక్రమం లోని ఎన్నో సంఘటనలను తీసుకున్నారు. 1947 తరువాత తూర్పు బెంగాల్, పాకిస్తాన్లో భాగమయ్యింది. తూర్పు బెంగాల్ లో బెంగాల్ ను జాతీయ భాషగా మార్చమని ఉద్యమం ప్రారంభమయ్యింది. పాకిస్తాన్ నియంత్రుత్వ పాలనకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ లో ప్రజల తిరుగుబాటు మొదలయ్యింది. 1971 లో బాంగ్లాదేశ్ స్వతంత్ర దేశం గా అవతరించింది. 1978 లో లౌకిక తత్వాన్ని ప్రధాన సూత్రంగా స్వీకరించిన బాంగ్లాదేశ్ రాజ్యాంగ చట్టంలో మార్పు చేసి, ఇస్లాం ను జాతీయ మతం గా ప్రకటించింది. బాబ్రీ మసీద్ విధ్వంసం కారణం గా బ్లాంగ్లాదేశ్ లో మత కల్లోలాలు చెలరేగి, అల్ప సంఖ్యాక మతస్తుల మీద విపరీతమైన దౌర్జన్య కాండ మొదలైంది. ఆ దౌర్జన్య కాండే, ఈ నవల లోని ప్రధాన కథ.

ఇది నవల కాబట్టి ఇందులోని పాత్రలన్నీ కేవలం కల్పితాలు అని రచయిత్రి చెప్పినప్పటికీ, అక్కడ జరిగిన ప్రత్యక్ష దౌర్జన్య మారణ హోమానికి ఇందులోని పాత్రలు ఉదాహరణలే. ఈ కథ ప్రధానంగా, బాంగ్లా దేశ్ లో పుట్టి పెరిగిన ఒక హిందూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. డా. సుధామయ్ దత్, అతని భార్య కిరణ్మయి, వారి పిల్లలు సురంజన్, మాయా, మొమైన్ సింగ్ నగరం నుంచి బాంగ్లాదేశ్, పాకిస్తాన్ పోరాట సమయంలో, ఎందరో హిందువులు భారత దేశం వలస పోయినప్పటికి జన్మ భూమి మీది ప్రేమతో దేశ రాజధాని ఢాకాకి తన ఆస్తులను తెగనమ్ముకొని వొచ్చి ఇక్కడే స్తిరపడుతాడు. చుట్టూ ఉన్న అనేక పేద ముస్లిం సోదరులకు ఉచిత వైద్యం కూడా చేస్తూ ఉంటాడు.వీరికి ఎందరో ముస్లిం స్నేహితులు కూడా ఉన్నారు. కిరణ్మయి కి సంగీతమంటే చాలా ప్రేమ. భర్త ప్రోత్సాహం తో నేర్చుకొని ప్రోగ్రాములు కూడా ఇచ్చేది. కాని ముస్లిం లు ఈమె వేదికల మీద పాడటం నిరసిస్తూ, ముస్లిం స్త్రీలను కూడా మార్చేస్తుందని తీవ్రంగా విమర్శిస్తారు. దానితో కిరణ్మయి తనకి ఎంతో ఇష్టమైన సంగీతాన్ని ఒదిలేసి ఇంట్లోనే ఉండిపోతుంది. కొడుకు సురంజన్ కి ఏ మతం మీదా నమ్మకం లేదు. పూర్తి అభ్యుదయవాదాలు కలవాడు. ఎం.ఎస్.సి. చదివినప్పటికీ కేవలం హిందువు అనే కారణం తో ఇతని కన్న తక్కువ చదివిన వారికి ఉద్యోగాలు లభిస్తాయి కాని ఇతనికి చిన్న ఉద్యోగం కూడా లభించదు. ముస్లిం యువతి పర్వీన్ ను ప్రేమిస్తాడు. కాని మతం మార్చుకుంటేనే ఆమె పెద్దలు వివాహానికి అంగీకరిస్తారు. మతం మీద ఆధార పడిన వివాహం తనకి వొద్దని అంగీకరించడు. ఇతని చెల్లెలు ట్యూషన్ ల ద్వారాకొంత డబ్బుని సంపాదించుకుంటూ ఉంటుంది. అవసరమైనప్పుడు అన్నకు సహాయం చేస్తూ ఉంటుంది.

మాయకి, భారత దేశ విభజన, 1971 బంగ్లాదేశ విభజన, అంతకు ముందు జరిగిన అల్లరులు ఏవి ఆమెకి తెలియదు. ఆవిడకు బుద్ధి తెలిశాక అర్ధమయిందల్లా, బాంగ్లాదేశ్ లో అధికార మతం ఇస్లాం అని, తాము అల్పసంఖ్యాకులైన హిందువులని, కాబట్టి తాము ఆ దేశం లోని వ్యవస్తతో తరచుగా సర్దుబాట్లు చేసుకోక తప్పదని. ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. 1990 లో జరిగిన అల్లరులు ఆమెకి తెలుసు. తన ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన జ్ఞానాని ఇచ్చింది. బాబ్రీ మసీదు కారణం గా ఢాకాలొ తీవ్రమైన అల్లరులు చెలరేగాయి. ఇప్పటి ఈ గొడవాలతో హిందువులు గుంపులు గుంపులు గా భారత దేశానికి పారిపోతున్నారు. కాని సుధామయ్ మనసు అందుకు అంగీకరించలేదు. మాయ తన కుటుంబమంతా కూడా ముస్లిం స్నేహితుల దగ్గిర తలదాచుకుందామని అడుగుతుంది. దానికి కూడా అంగీకరించడు. సురంజన్ ఏమైనా దారిచూపిస్తాడేమో అని ఎదురుచూస్తుంది. కాని అతనిలో కూడా చలనం లేక పోవటం తో తాను మాత్రమే ముస్లిం స్నేహితుల ఇంటికి వెళ్ళిపోతుంది. త౦డ్రికి పక్షవాత౦ రావట౦తో, తన రక్షణ మరచి, త౦డ్రి కోస౦ ఇ౦టికి ఒచ్చేస్తు౦ది.

సురంజన్ తన మిత్రులందరి ఇళ్ళకి తిరుగుతూ వాళ్ళను పరామర్శిస్తూ ఉంటాడు. దారిలో జరుగుతున్న ఎన్నో విధ్వంస కాండలు గమనిస్తూ ఉంటాడు. ఢాకా లో ఉన్న దేవాలయాలు నేల మట్టం అయిపోయాయి. హిందువుల ఆస్థులు కొల్లగొట్టారు. స్త్రీలను ఎత్తుకు పోతున్నారు. ఊరంతా శిధిలాలతో నిండి పోయింది. కొంతమంది హిందువులు మాత్రం వాళ్ళ ముస్లిం స్నేహితుల ఇళ్ళల్లో రహస్యంగా తలదాచుకుంటున్నారు.

ఇవన్నీ గమనించిన సురంజన్ తీవ్ర మైన ఆవేశానికి లోనౌతాడు. "ఒక మసీదును కూలదోస్తే వారికంత కోపం వొచ్చింది కదా, దేవాలయాలను కూలదోస్తే హిందువులకు కోపం ఒస్తుందని వారికి అర్ధం కాదా! వందలాది దేవాలయాలు కూల దోయాలా! ఇస్లాం మతం శాంతిని కాదా బోధించేది?" అని ఈ ముస్లిం రచయిత్రి సురంజన్ తోటి ధైర్యంగా పలికించింది.

ఇంట్లో తినటానికి కూడా ఏమి లేక, భర్త ఆరోగ్యం ఉన్నట్లుండి పాడైపోయినా, ఇల్లు ఒదిలిపోలేని నిస్సహాయ స్థితిలో " ముస్లిం లకు మాత్రమే బాధపడే హక్కు, కోపం తెచ్చుకునే హక్కులున్నాయా?" అని కిరణ్మయి తోటి అనిపించ గలిగింది ఈ రచయిత్రి. ఊరందరినీ పరామర్శిస్తూ తిరిగే సురంజన్ ఒక రోజు తన ఇంట్లోనే విధ్వంసాన్ని చూస్తాడు. చెల్లి ఇంట్లో లేక పోవటాన్ని గమనిస్తాడు. ఏ౦ జరిగి౦దో ఊహి౦చి, తీవ్రమనస్తాపంతో జీవాచ్చవాల్లా పడి ఉన్న తల్లితండ్రులని ఓదార్చలేక పోతాడు. మానసిక క్షోభతో తానుకూడా మతదురహంకారిగా, విప్లవవాదిగా మారిపోయి ముస్లింల అంతం చూడాలని నిర్ణయించుకుంటాడు. చివరికి ఈ కుటు౦బ నిర్ణయ౦ ఏవిటి?

ఈ రచయిత్రి కొన్నిఇతర విమర్శలను కూడా గుప్పించింది. బాబ్రీ మసీద్ ధ్వంసం కన్నా ముందుగానే బాంగ్లాదేశ్ లో హిందువులను హింసించటం మొదలయింది, కాని వీళ్ళు బాంగ్లాదేశ్ ని మతసామరస్య దేశమని నమ్ముతారు. అది నిజ౦ కాదని, హి౦దువుల విధ్వ౦సాన్ని, లెఖ్ఖలేనన్ని ఉదాహరణలతో ఈ నవలలోనే వరుస పెట్టి చూపించింది.

టి.వీల్లో దేవాలయాల విధ్వ౦స౦ చూపి౦చకపోవట౦ తీవ్ర౦గా వ్యతిరేకి౦చి౦ది. భారతదేశ౦లో ఎన్నో మతకలహాలు జరిగినప్పటికీ, ముస్లి౦లు, దేశ౦ ఒదిలిపోలేదు. అదే బా౦గ్లాదేశ్ లో హి౦దువులు పారిపోతున్నారని తీవ్ర౦గా విమర్శి౦చి౦ది. బ౦గ్లాదేశ్ ను౦చి వెళ్ళిపోయిన హి౦దువుల ఆస్థిని "శత్రువుల ఆస్థిగా" ప్రకటి౦చి ప్రభుత్వ౦ ఆక్రమి౦చి౦ది. అదే భారత దేశ౦లో ప్రభుత్వ౦ కనీస౦ ఆ భూములను సర్వే కూడా చేయి౦చలేదు, అని రె౦డు దేశాల మధ్య ఉన్న లౌకికత్వాన్ని ఎత్తి చూపి౦చి౦ది.

బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారతదేశం లోని ముస్లిం ల కోసం మత సామరస్యాన్ని వహించమని ప్రజలని కోరి౦ది. అదే బంగ్లాదేశ్ లో పౌరులైన హిందువుల క్షేమం గురించిన ఆలోచన లేదా? భారత దేశం లోని ముస్లింల గురించి ఎందుకు ఆందోళన? ఎంతో గుండెధైర్యంతో ప్రశ్నించగలిగింది ఈ రచయిత్రి.

ఈ నవలకు ఒక ముగింపు, సస్పెన్స్, కొసమెరుపులంటూ ఏమి లేవు. మొదట ఎలా ప్రారంభమవుతుందో, చివరివరకు అలాగే కొనసాగుతుంది. ఇంకా ఎన్నో పాత్రలు బాంగ్లాదేశ్ లో హిందువులనుభవించిన కడగండ్లకు ఉదాహరణగా మన కళ్ళ ముందు నిలుస్తాయి. అలా చదువుకుంటూ వెళ్ళిపోవాల్సిందే.

అడుగడుగునా ఈ రచయిత్రి తెలిపిన నగ్నసత్యాలే చివరికి ఈమెని తన మాతృభూమి నుంచి ప్రాణాలరచేతబట్టుకొని భారతదేశం పారిపోయేలా చేసింది. భారతదేశం లోని ముస్లిం లు కూడా ఈమెని చాలా తీవ్రంగా అవమానించారు. చివరికి భారత దేశం కూడా వొదిలివేయవలసివొచ్చింది. రహస్యజీవనాన్ని గడపవలసిన అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఈ రచయిత్రి ఎక్కడెక్కడో ఉన్నట్లుగా చెప్తారు కాని, నిజానికి ఎక్కడుందో సరి అయిన ఆధారాలు మాత్రం లేవు. మతసామరస్య౦ కోస౦ పోరాడితే ఇదా ఫలిత౦!

ఈ గ్ర౦ధాన్ని భారత ఉపఖ౦డ౦ లోని ప్రజలకి అ౦కిత౦ చేసి౦ది ఈ రచయిత్రి. మత అతివాదానికి లోనుకావద్దని వేడుకు౦టు౦ది. "లజ్జ" మన సామూహిక పరాజయానికి ఒక సాక్ష్య౦.

వల్ల౦పాటి వె౦కటసుబ్బయ్య దీనిని తెలుగు లో అనువది౦చారు.
దీని వెల రూ. 80, విశాలా౦ధ్ర పబ్లిషి౦గ్ హౌజ్, హైదరాబాద్ లో ప్రతులు లభ్యమవుతాయి.
2008 లో, 1000 ప్రతులను మాత్రమే ముద్రి౦చారు.


**********************************************************************************************

12, డిసెంబర్ 2009, శనివారం

'కథ'...



కథ
ఇది నిజ౦గా జరిగి౦దా?

ఇవాళ పొద్దున్నే ఈ సినిమా కి వెళ్ళాను. సినిమా రిలీజ్ అవగానే మొట్టమొదటి ఆట చూడడ౦ నా కిదే మొదటి సారి. మీ అ౦దరి క౦టే నేనే ము౦దు చూసేసి ఉ౦టాను. మీరెవ్వరు ఇ౦కా చూసిఉ౦డరు లె౦డి. కాబట్టి దాని రివ్యూ రాస్తాను...మీరు చదవాలి.

జార్ఖండ్ రాష్టృంలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనతో ఈ సినిమా మొదలౌతుంది. ఒక కుటుంబం కార్ మీద దుండుగుల దాడి, ఆ తర్వాత న్యూస్ పేపర్ లో "అంధ్రా కుటుంబం ఆత్మహత్య" అని ఒక వార్త ఒస్తుంది. ఆ తరువాతనే టైటిల్స్. టైటిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.

హీరోయిన్ జెనీలియా(చిత్ర), వాలీ స్కూల్ అరకు లో టీచరుగా ఒస్తుంది. తను జార్ఖండ్ నుంచి ఒచ్చానని చెప్పటం తో అంత దూరం నుంచి ఇక్కడికి రావటానికి కారణం అడుగుతుంది ప్రిన్సిపాల్. తనకు తల్లీ, తండ్రి, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు అందరు ఉన్నారని, తాను చాలా పిరికిదని, తనవాళ్ళు గేలి చేయటం తో తన ధైర్యం చూపించటానికే ఇక్కడిదాకా ఒచ్చానని చెప్తుంది. ప్రిన్సిపల్ కు ఉన్న వేరొక ఇంటిలో అమెని ఉండమంటుంది ప్రిన్సిపల్. తన మేనకోడలు సుగుణను తోడిచ్చి ఆ ఇంటికి పంపిస్తుంది.

తన లగ్గేజ్ సద్దుతానన్న సుగుణను పంపించి వేసి తనే సూట్కేస్ తెరిచి సద్దుకుంటుంది. అందులో చాలా మందులు, ఒక టార్చ్, ఒక కత్తి కూడా ఉంటాయ్... .

టీచరు గా మొదటిరోజు స్కూల్ అనుభవం చూడడానికి సరదాగా ఉంటుంది. పిల్లలంతా తనేమి చేస్తే అదే వాళ్ళు చేస్తారు. అల్లరి పిల్లలు. అందుకే వాళ్ళని లొంగదీసుకోటానికి మర్నాడు ఒక తేలుపిల్లను చిన్న సీసాలో పట్టుకొచ్చి అది తన ఫ్రెండ్ సీతామహాలక్ష్మి అని, తన మాట వినని వారెవరన్నా ఉంటే అది కరిచేస్తుందని పిల్లల్ని భయపెడ్తుంది. కావాలంటే అది మాట్లాదుతుందని కొంచెం వెంట్రిలాక్విజం ప్రయోగిస్తుంది. పిల్లలు నిజమే అనుకుంటారు. ఇటువంటి కొన్ని సంఘటనలు సరదాగా అనిపిస్తాయి.

ఈ సినిమా హీరో కృష్ణ ( అరుణాదిత్యా, నూతన పరిచయం) ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ కథకి దర్సకత్వం వహించాలని దాని కోసం చాలా కష్టపడుతుంటాడు. ఇతనితో పాటుగా సినీ ఫీల్డ్ లోని వారే ఇంకా నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఇంట్లోనే ఉంటూ ఉంటారు. బయట నేం బోర్డ్ వీళ్ళ పేర్లు ఉండకుండా...మర్డరర్ 1, మర్డరర్ 2, అని అలా అయిదు నంబర్ల వరకు పెట్టుకుంటారు...

ఇతనికి మదర్ సెంటిమెంట్, (అమ్మ, ఒకప్పటి శంకరాభరణం బేబీ తులసి, ఏవిటో అప్పుడే చాలా ముసలిదానిలాగా అయిపోయింది.) పొద్దున్నే గుడికి పోయే అలవాటు ఉంది. అక్కడే చిత్ర ను చూస్తాడు. హీరో కి హీరోయిన్ ని చూపించిన విధానం బాగుంది...

ఇద్దరూ షాపింగ్ లో కూడా కలుసుకుంటారు. అక్కడి దిష్టి బొమ్మను చూసి భయపడుతుంది. అక్కడినుంచి ఇద్దరికీ స్నేహం కలుస్తుంది. ఏమి చదువు రాని వారే సినీ ఫీల్డ్ లో కి ఒస్తారని చిత్ర నమ్మకం. అందుకే కృష్ణని, టెంత్ ఫైలయ్యారా, ఇంటర్ ఫైల్ అయ్యారా? అని అడుగుతుంది. కాని తను ఇంజినీర్ అని చెప్తాడు.
ఇద్దరి మధ్య మెల్లిగా ప్రేమ చిగురిస్తుంది. తను తీయ బోయె 'హత్య ' సినిమా గురించి చెప్తాడు. చిత్ర చాలా తీవ్రంగా భయపడుతుంది. కొన్ని యువతరానికి నచ్చే సంఘటనలు కూడా ఇక్కడ చోటుచేసుకున్నాయి.

అరకులో ఒక సర్కల్ ఇన్స్పెక్టర్ (ప్రకాష్ రాజ్) కూడా ఉంటాడు. అతని స్నేహశీలత, ఉద్యోగ నిబధ్ధత మనల్ని ఆకర్షిస్తుంది.
తన మనవళ్ళతో సరదాగా గడుపుతూ ఉంటాడు. వాళ్ళు ఇతని దగ్గిరే ఉండి అక్కడే చదువుకుంటూ ఉంటారు. అతని భార్య కూడా అతని అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంటుంది. పిల్లల్ని స్కూల్లో దింపటానికి ఒచ్చిన సి.ఐ., చిత్రని చూసి ఎక్కడో చూసినట్లుంది అనుకుంటాడు...

మర్నాడు పేపర్ లో చిత్ర ఫొటో తోటి, 'ఈమె ఎవరు?' అనే హెడ్డింగ్ తో వార్త ఒస్తుంది.దానితో సి.ఐ. కి అనుమానం ఒస్తుంది. సి.ఐ. కి చిత్రని ఎక్కడ చూసాడో కూడా గుర్తుకు ఒస్తుంది... హీరో కి కూడా తనకు తెలిసిన ఆమె గురి౦చి చెప్తాడు. అప్పటిను౦చి ఇద్దరూ ఆమె కదలికలని గమనిస్తూ ఉ౦టారు. రాత్రి ఒ౦టరిగా చాలా భయపడుతు, చిత్ర౦గా ప్రవర్తిస్తూఉ౦టు౦ది. కారణ మేంటో?

తరువాత ఒక సాయంత్రం చిత్ర ఒక ప్రియుడు ప్రియురాలిని హత్య చేయటం చూసి సి.ఐ. కి రిపోర్ట్ చేస్తుంది. హీరో కి కూడా ఆ విషయం చెప్తుంది. అందరూ వెతుకుతారు కాని అక్కడ ఏమి కనిపించదు. మర్నాడు దొరికిన ఒక స్త్రీ శవాన్ని మార్త్యురీ లో ఆమెకి చూపిస్తారు. ఈమె, ఆమె కాదంటుంది చిత్ర...

చిత్ర, హీరో ని తన ఇంటికి తీసుకువెళ్ళి తన గతం "చూపిస్తుంది". ఏవిటది?

అక్కడినుంచి కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.

చిత్ర ఇంట్లో ఎన్నో భయానక సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీనికి కారణ మెవరు?

ఆ హత్య అసలు నిజంగా జరిగిందా? జరిగితే హంతకుడెవరు?

పోలీస్ కానిస్టేబుల్ హ౦తకుడెవరో కనుక్కోవటానికి చిత్ర చేసే ప్రతీ ప్రయత్నాన్ని అడ్డుకు౦టూ ఉ౦టాడు. ఎ౦దుకు?

హీరో, చిత్రకి భయమెక్కువ కాబట్టి ఇవన్నీ ఊహించుకుంటుంది అంతే! అవన్ని నిజాలు కావు అని సద్దిచెప్పటానికి ప్రయత్నిస్తాడు. తనకి భయాలు ఉన్నాయి కాని ఇది భ్రాంతి కాదు అని చెప్పటానికి ప్రయత్నిస్తుంది, చిత్ర..

విలన్ మొదటిను౦చి మన కళ్ళము౦దే ఉ౦టాడు. సస్పెన్స్, డిటెక్టివ్ కథలు ఇష్ట పడే వారికి విలన్ ఎవరో సులభంగానే కనుక్కో గలరు. సస్పెన్స్ బాగా కోరుకునే వారికి మాత్ర౦ ఇది నిరాశనే మిగులుస్తు౦ది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఈ మధ్య చాలానే ఒచ్చాయి. కాని వాటిము౦దు ఇది సరిపోదు.

ఈ సినిమా లో ప్రిన్సిపల్ కుమారుడు "కార్తిక్" పాత్ర కూడా ఉ౦ది. మొదటిను౦చి అతడు చిత్రని ప్రేమిస్తూఉ౦టాడు. వెంటాడుతూ ఉంటాడు. ఇతనొక టి.వి. నటుడట. బాగానే ఉన్నాడు. అతను కూడా సినిమాకి ఒచ్చాడు. మా ఫ్రెండ్ అతన్ని చూపించింది.

శ్రీనివాస రాగా దీని దర్శకుడు. పాటలెక్కువగా లేకున్నా ఏం గొప్పగా లేవు.

ఖాళీగా, ఏ౦ పనిలేక పోతేచూసి రావొచ్చు.







"టక టక టక టక ఎవరో! నా మది గది తలుపు తడితే....!"





*********************************************************************

10, డిసెంబర్ 2009, గురువారం

నన్ను మర్చిపోకండేం. ....

"వెన్నెల్లో గోదారి అందం" అన్న పాట ఎంత బాగుంటుందో కదా!  నిజంగానే ఎంతందంగా ఉందో . . . బ్లాగుల్లో గోదావరి అమ్మాయిలు ఏమి రాసినా . . . మా గోదావరి అమ్మాయిలా, ఇంకేమన్నానా . . . అని తెగ మెచ్చుకుంటారు. ఒకసారి మ౦చుపల్లకీ గారు సుభద్రగారిని ఇలాగే మెచ్చుకున్నారు. నాకె౦త కుళ్ళొచ్చేసి౦దో! మరి మమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారో ఏవిటో! చిన్నప్పుడు కృష్ణమ్మ ఒళ్ళో పెరిగిన నేను ఆ మమకారం ఎప్పటికీ మరువలేను. పోనీలె౦డి . . . మా అ౦దాలు మావి. పాటలంటే పరిమళం గారు గుర్తొస్తున్నారు. వాళ్ళే హాయిగా ఇంట్లో అంత్యాక్షరి ఆడుకునే వారట. 'మ ' అక్షరం వొస్తే తప్పకుండా...మేడంటే మేడా కాదు . . . పాట పాడుకునే వాళ్ళట. అబ్బ . . . పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది . . . ఇంత చక్కటి భావం ఎంతందంగా ఉంటుందో కదా! ఇటువంటి ఆనందక్షణాలేగా జీవితాన్ని సుందరమయం చేసేది. ఇంత చక్కటి అనుభవాలు జీవితం లో కొన్నున్నా చాలు కదూ!

జాజిపూలు గారు రాసినట్లు నా అంతరాత్మ కూడా డింగుమని ఎగిరొచ్చి మిక్సీ పక్కన కాకున్నా . . . కనీసం కిటికీ అవతలను౦చి తొ౦గి చూసినా బాగుండు. అన్నిరకాల జాజులు కలిపి జాజిపూలు అని పేరుపెట్టుకున్నారుట. ఆ పేరులోని అందమే వేరు. అదేవిటో . . . నాకెప్పుడూ నా అంతరాత్మ ధ్యాసే ఉండదు. ఎప్పుడూ . . . నాక్కూడా కాసేపు నా అంతరాత్మ తో మాట్లాడుకోవాలనిపిస్తోంది . . . అంతరాత్మ ని నిలకడగా ఉంచే ధ్యాసేది? ఇ౦తలోనే నాకు సుభద్ర గారు గుర్తుకొచ్చేశారు. దుబాయ్ లో ఏం షాపింగ్ చేసారో ఏవిటో? బంగారం కొనేసి ఉంటారు. అసలే కేరళ పెళ్ళికూతుళ్ళను చూపించారు. మురళి గారేమొ వివరాలు చెప్పొద్దు అన్నారు . . . మొన్న నెమలిఈకలు చూసాను మురళిగారు . . . అంటే పట్టించుకోలేదు గాని . . . సుభద్ర గారు వివరాలు చెప్పొద్దట . . . ఎందుకబ్బా!!! మురళి గారు అనుభవాలన్నీ ఎ౦తబాగా రాస్తారో! సినిమాల, పుస్తకాల రివ్యూలు చాలా బాగారాస్తారు. నేనూ ఒక సినిమా రివ్యూ రాసాను. ఏ౦ లాభ౦ . . . అట్టర్ ఫ్లాప్. . . :) సునిత గారు రాసిన . . . మీ ఊరినుండి మనుషులు వచ్చారు . . . లో అనుభవాలు తలుచుకు౦టే ఎ౦త బాధనిపి౦చి౦దో. వీళ్ళలాగ అ౦త సున్నిత౦గా రాస్తే నాకు భలే ఇష్టం. తృష్ణ గారు వ్రాసే అనేక అంశాలు కూడా బాగుంటాయి.

ఇలా ఏవేవో ఆలోచించే బదులు మంచి కవిత్వం రాసుకుంటే ఎంత బాగుండు. హాయ్! అనుకుంటూ ఇప్పుడొచ్చిందండోయ్, నా అంతరాత్మ. నాకు టి.వి. కనిపించకుండా...అడ్డంగా టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి అక్కడ కూచుంది. "ఏవిటీ . . . నువ్వు రాసేది . . . అది పుట్టుకతో ఒచ్చే విద్య. అట్లాంటి పిచ్చి . . . పిచ్చి వేషాలు వేయకు . . . ఉషా, గీతాచార్య, భావన, భాస్కర రామి రెడ్డి గారు, పద్మార్పిత, విశ్వప్రేమికుడు, శ్రీ లలిత గారు, సృజనా రామానుజన్ ...ఇంకా ఎందరో ఉద్ధండులు ఉన్నారు...కనీసం అర్ధం చేసుకొనే శక్తి కూడా లేదు నీకు. అందుకేగా ఎప్పుడూ ఒక్క కామెంట్ కూడా పెట్టలేక, ఆనందంగా చదువుకొని వొచ్చేస్తావ్. నీ చిన్ని తమ్ముడు కార్తీక్ చూడు ఎంతబాగా రాస్తాడో...ముందు వాళ్ళను చూసి నేర్చుకో...నీకేదో కాస్త తెలుగు రాగానే...పండితురాలివనుకోకు. నీకు తెలియని వారు కూడా ఎందరో ఉన్నారు." అని చాలా తీవ్రంగా కసరటం మొదలు పెట్టిందండి. బాబోయ్ , ముందు కొత్తగా వొచ్చిన నా అంతరాత్మ ని తరిమేయక పోతే లాభం లేదు. అమ్మా! తల్లీ! నాకు టి.వి. కనిపించటం లేదు...దయచేసి వెళ్ళిపో...నేను కవిత్వం రాయనులే అని మాటిచ్చి...చాలా తొందరగా అక్కడినుంచి పంపించేసాను.

ఇంక జీవని గారైతే సంఘసేవకే అంకితమైపోయారు. వారు నడిపే విద్యాలయం చిరకాలం వర్ధిల్లాలి. వీలైతే ఒక సారి చూసిరావాలి. సిరిసిరిమువ్వ పేరు ఎంత బాగుందో. అంత మంచిపేరు ఆలోచించటం కూడా కష్టమే...

అవునూ...అంత బాగా బొమ్మలేసే, అబ్రకదబ్రగారు కవిత్వం రాస్తే ఇంకా బాగుంటుంది కదూ ... అని కూడా అనిపించింది. విజయ్ మోహన్ గారు కూడా బొమ్మలు ఎంతబాగా వేస్తారో. వీరు మామూలు వ్యవసాయదారులు కాదు. లలిత గారి, గు౦డె గొల్లుమ౦ది, భలే నవ్వొచ్చి౦దిలే. అమ్మవొడి గారు ఎ౦తబాగా రాస్తారు. బహుశా, ఈవిడ రాయని విషయం అంటూ లేదేమో! శేఖర్ పెదగోపు గారు, ప్రేమ పేరుతొ బ౦దీచేస్తే లో ఎ౦త చక్కటి విశ్లేషణ ఇచ్చారు. లక్ష్మి గారి యాత్రల్లో ఒక్కటన్నా నేను చూసొస్తే బాగుండు. ఏవిటో అన్ని బ్లాగ్ లు తెగ చదివేస్తున్నాను. పీకల దాకా పాతుకుపోయాను. అర్ధమైంది. నేను బ్లాగ్ లు చూడకుండా ఒక్క రోజు కూడా ఇంక ఉండలేను. అసలు శ్రీనిక గారికి ఇన్ని పెళ్ళి కబురులు ఎలా తెలిసాయో! ఒక డాక్టరేట్ ఇయ్యొచ్చు.

ఈ మధ్య చాలా మంది బర్త్ డే లే ఒస్తున్నాయి. కొత్తపాళీ గారి పుట్టిన రోజుకి భావన బ్లాగులో శుభాకాంక్షలు చెప్పాను. వేణు శ్రీకా౦త్ గారిని కూడా విష్ చేసాను. కొత్తబంగారులోకం-తెలుగు కళ గారి చెల్లెలికి కూడా హాపీ బర్త్ డే చెప్పాను. కాని జ్యోతి గారు 'మలక్పేట్ రౌడీ ' గారి పుట్టిన రోజుకి చక్కటి రీమిక్సింగ్ పెట్టినప్పుడు, ఎంతో బాగనిపించినా . . . విష్ చేయాలంటే . . . ఏవిటో భయం వేసింది. ఎందుకులే బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు అని అటువైపే పోలేదు. మా అక్క తన బ్లాగ్ లో 'దొంగ గారొచ్చారు ' అని రాసుకున్నప్పుడు . . . అందరికన్నా ముందు ఈ మలక్ పేట్ రౌడీ గారే..'నన్నెవ్వరో పొద్దున్నే తలచుకున్నారు ' అంటూ పలకరించేసారు.

'మనసులో మాట ' సుజాత గారు 'సంస్కార' గురించి ఎంతబాగా రాసారో. ఇలా నేనెప్పటికైనా రాయగలనా...అనుకున్నాను...అకస్మాత్తుగా నా అంతరాత్మ గుర్తుకొచ్చి...ఎక్కడ ధడాల్మని ఒచ్చేస్తుందో...అని ఆ అలోచన అక్కడితో ఆపేసాను. విజయవాడ లో కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ గురించి, ఎస్. ఆర్. రావ్ గారు, చిన్ని గారు ఎంత బాగా వివరించారో...ఈ చిన్ని గారేమో...వాళ్ళవారు ఊరికెల్తేనే దిగులు పడిపోయి కవిత్వం రాసేస్తారు. అయినా ఏమాట కా మాటే లెండి...భలే బాగా రాస్తారు. తన అసలు పేరు చెప్పి కొత్త పాళీ గారికి పరిచయం చేసుకున్నారట. ఆ ఫొటో చూపించమని కొత్తపాళీ గారిని అడగాలి . . . :)

ఈ శిశిర ఏవిటో. . . నా లాగే ఎప్పుడూ . . . ఆ కాలేజ్ తోనే సతమత మయ్యేట్లు౦ది. లీసారే గురి౦చి రాసి౦ది. చాలా అ౦శాలే రాస్తో౦దిలే. హాయిగా చదివేయొచ్చు. ఒక్కసారిగా నా మనసులో కదలాడుతున్న ఈ బ్లాగ్ లన్నీ మాయమై పోయాయి. ఎదురుగుండా టి.వి. లో. . . బ్రేకింగ్ న్యూస్ . . . వొస్తోంది. అయ్య బాబోయ్ . . . హైకోర్ట్ . . . కాలేజ్ శలవలు రద్దు చేసిందట. ఇదెక్కడి గొడవ. ఒక్కసారిగా ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళమంటే ఎలా! రేపేమో. . . చలో ఎసెంబ్లీ . . . ఆటోలు, బస్ లు ఉండవు. 144 సెక్షన్ అట. ఫ్లైఓవర్ లన్నీ మూసేస్తారట. హైద్రాబాద్ లోకి బయట ఊరి వాళ్ళని ఎవ్వరినీ రానియ్యరట. యూనివర్సిటీ లో పోలీస్, సైనిక బలగాలు . . . అబ్బో చాలా ఘోరంగా ఉండేటట్లుంది. ఒక పక్క ఐ.జి. అనురాధ ఎవ్వరినీ ఇళ్ళనుంచే బయటకు రావద్దు, మీ పిల్లలని కూడా విద్యాలయాలకు పంపకండి అని చెప్తున్నారు.

అంతా ఒకటే కంఫ్యూజన్. పిల్లలెవరూ రారు. మేము పోయి ఏం చేయాలి. ఎవరన్నా వొచ్చి మా తలలు పగలగొడితే...ఇంతే సంగతులు... ఇంక మిగతా బ్లాగ్ లు తలచు కొనే మూడ్ పూర్తిగా పోయింది. అసలు ఎంత మంది కాలేజ్ కి రాగలుగుతారు. ఏవిటో..ఒకటే గందరగోళం... మా కేమన్నా అయిపోయి...ఇ౦తే స౦గతులు...అయితే మాత్ర౦ నన్ను మర్చిపోక౦డే.... ఎక్కడైనా ఒక కాలేజ్ కనిపిస్తే...నన్ను గుర్తు చేసుకోండేం.


*********************************************************************************

3, డిసెంబర్ 2009, గురువారం

భయ౦...భయ౦ !!!

నాలోని నవరసాలు - భయానకం


ఆ మధ్య నవ రసాల మీద ఆధారపడి నేను అనుభవించిన కొన్ని సంఘటనలు "నవరసాల నా అనుభవాలు" రాయాలి అనుకున్నాను. నేను రాసిన " నా మది దోచిన పాండురంగడు" నాకు ప్రశాంతత నిచ్చి" శాంత రసంగా" అనిపించింది. దీనితోటే ఎందుకు ప్రారంభించ కూడదు అనుకున్నాను. అనుకోకుండా ఇవాళ నేనెదుర్కొన్న సంఘటన నాకు " భయానక రసాన్ని" గుర్తు చేసింది. నా జీవితం లో ఇంతవరకు ఇటువంటి భయాన్ని నేను అనుభవించ లేదు. అదికూడా నేను పని చేసే కళాశాల లో ఈ విధమైన అనుభవాన్ని, నేనెప్పుడూ ఊహించను కూడా లేదు.

ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణా అట్టుడికి పోతున్న సమయమిది. ముఖ్యంగా విద్యాలయాల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. రోజుకో రకంగా సమస్యలు ఎదుర్కో వలసి ఒస్తోంది. కె.సీ.ఆర్. తో, ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్ధుల గొడవలతోటి, ఖమ్మం లో కె.సీ.ఆర్. అరెస్ట్ తరువాతి సంఘటనలు విద్యార్ధుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

బంద్ లు నిర్వహించినప్పుడల్లా మేము కూడా స్టూడెంట్స్ ని పంపించేస్తునే ఉంటాము. కాని శలవు అన్నది అఫీషియల్ గా ప్రకటించలేము కదా. అందుకే ఎవరన్నా, విద్యార్ధి సంఘాలు వొచ్చి డిమాండ్ చేస్తే అప్పటికప్పుడు పిల్లల్ని పంపించేస్తాం. ఈ రోజు కె.సీ.ఆర్. ని హైదరాబాద్ తీసుకొస్తూ ఉండటం తో మళ్ళీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయినా ఇవాళ హాలీడే కాదు కాబట్టి, అందరం కాలేజ్ కి రావాల్సే ఒచ్చింది. అదేవిటో ఎప్పటికన్నా కూడా ఇవాళ స్టూడెంట్స్ కూడా చాలా మందే వొచ్చారు. నేను ఇంటినుంచి కాలేజ్ కి వెల్తున్నప్పుడే చాలా మంది జూనియర్ కాలేజీల స్టూడెంట్స్ తిరిగి వెళ్ళిపోవటం గమనించాను. మా కాలేజ్ దగ్గరికి వొచ్చేటప్పటికి యధావిధిగా గేట్ తీసి, వాచ్మాన్ ఉన్నాడు. స్టూడెంట్స్ కూడా లోపలికి పోతున్నారు. మామీద ఏమి ప్రభావాం లేదేమొ అనుకుంటూ నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను. యధావిధిగా మా రొటీన్ ప్రారంభమయ్యింది.

నాకు ఫస్ట్ టు అవర్స్ వరసబెట్టి ఉన్నాయి. అందుకని స్టాఫ్ రూం కి పోకుండా రెండు క్లాస్ ల రిజిస్టర్స్ తీసుకొని, పైన ఉన్న నా క్లాస్ కి వెళ్ళి పోయాను. ఫస్ట్ పీరియడ్ బాగానే జరిగింది. సెకండ్ పేరియడ్ స్టార్ట్ అవగానే ఆ క్లాస్ కి వెళ్ళాను. పిల్లల్ని పలకరించి అటెండన్స్ తీసుకున్నాను. ఈ లోపల ఒకమ్మాయి, మాడం... కె.సీ.ఆర్. చచ్చి పోతాడా... అని సడన్ గా అడిగింది. ఈ రోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం . దాని గురించి స్టూడెంట్స్ తో చర్చిద్దాం అనుకున్నాను. ఇ౦తలొ ఈ ప్రశ్న తో...ఆగిపోయి..ఎందుకలా అడుగుతున్నావు అన్నాను.

ఇప్పటికే చాలా గొడవలవుతున్నాయి, ఇంకెంతో గొడవలు పెరిగిపోయె ప్రమాదముంది కదా...అందుకని అడిగాను అంది.

నేనేదో అనబోయే లోపలే, ఇంతలో, ఇంకో అమ్మాయి...మాడం...నిన్న "ఆంధ్ర మహిళ సభా" ఉమెన్స్ కాలేజ్ పేరు, ఉద్యమకారులు, "తెలంగాణా మహిళా సభా" కాలేజ్ గా మార్చి రాసారుట. వాళ్ళేమి అనలేదుట...మన కాలేజ్ పేరు కూడా అలా మార్చేస్తారా? అని అడిగింది.

అటువంటి ప్రమాదమేమి మనకు లేదులే... అలా మార్చే అవకాశం మన కాలేజ్ పేరుకి లేదుకదా... అన్నాను ...అందరం నిజమే, అని నవ్వుకున్నాం.

అందరూ నవ్వుల్లో ఉండగానే ఒక్క సారిగా పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. మాకేమి అర్ధం కాలేదు. ఏమయ్యిందా! అనుకునేంతలోనె, కాలేజ్ లో పెద్ద గొడవ మొదలయ్యింది. వెంటనే క్లాస్ రూం నుంచి బయటికి ఒచ్చి, మేము మూడో అంతస్తులో ఉండటం తో కిందకి ఒంగి చూసాను.

ఒక్కసారిగా భయం తో ఒళ్ళు జలదరించింది. కింద కెమిస్ట్రీ కారిడార్ లోనుంచి, ఫిజిక్స్ కారిడార్ లోకి పెద్దగా అరుచుకుంటూ... తలుపుల మీద కర్రలతోటి గట్టిగా కొడుతూ... ఒక ముప్పై మంది దాకా మొగపిల్లలు అక్కడ ఉన్న అమ్మాయిల మీదకి పరిగెత్తుకుంటూ ఒస్తున్నారు. ఆ పిల్లలు భయం తో, దిక్కు తోచక...లాబ్స్ లోకి...అటూ..ఇటూ... అరుచుకుంటూ పారిపోతున్నారు. కొంత మంది అబ్బాయిలు, కింద ఉన్న లాన్ లోకి పోయి... గడ్డి పీకటం... చెట్లను పీకి పారేయటం చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో కత్తులూ...కఠారులు కూడా ఉన్నాయి. కిందనే ఉన్న ఎక్జామినేషన్ బ్రాంచ్ లోకి ఉరుకుతున్నారు. ఫిజిక్స్ లాబ్ లోని పరికరాలు అన్నీ విసిరి అవతల పారేస్తున్నారు. ఇదంతా క్షణాల మీద జరిగిపోయింది. కింద పరిస్తితి చాలా ఘోరంగా తయారయ్యింది. కొంతమంది మెట్లెక్కి పైకి ఒస్తున్నారు. వెంటనే, కిందకి వెళ్ళబోయాను. కాని, ఇక్కడ ఉన్న అమ్మాయిల్ని ఒదిలేసి మాత్రం ఎలా వెళ్ళగలం.

పైన ఉన్న మాకు ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు. వెంటనే అమ్మాయిలందర్ని అక్కడే ఉన్న లైబ్రరీ లోకి వెళ్ళిపొమ్మన్నాం. ఎవర్నీ బయటికి రావద్దని గట్టి వార్నిగ్ ఇచ్చాం. పిల్లలు కూడా చాలా భయపడిపోయారు. అందరూ లైబ్రరీలో కి వెళ్ళిపోయారు. నాతో పాటు ఇంకా అయిదుగురు లెక్చరర్స్ ఉన్నారు పైన. మా కాళ్ళు ఒణికి పోతున్నాయి. నోట మాట రావటం లేదు. అంతా భయానకంగా అయిపోయింది. మేము మాత్రం ఏం చేయగలం.

ఇంతలోనే కింద పోలీస్ విజిల్స్ వినిపించాయి. ఆ అబ్బాయిల్ని...ఎక్కడికక్కడ పట్టుకొని...లాఠీ లతోటి కొడుతున్నారు. ఇంక ఎవ్వరూ పైదాకా రాలేదు. మేము వెంటనే కిందికి దిగి వెళ్ళాం. అక్కడ పోలీస్ ఆఫీసర్, మా ప్రిన్సిపల్, మిగతా లెక్చరర్స్, మా అటెండర్స్, అఫీస్ స్టాఫ్ అంతా కనిపించారు. వాళ్ళను చూడంగానే కొంచెం ధైర్యం వొచ్చింది. ఆ అబ్బాయిలందర్ని అక్కడినుంచి తీసుకెళ్ళిపోయారు.

గేట్ దగ్గిర ఇద్దరు వాచ్మన్లు బాగా దెబ్బలు తగిలి పడిపోయిఉన్నారు. చిన్నగేట్ విరిగిపోయిఉంది. పెద్దగేట్ ని వాళ్ళేమి చేయలేక పోయారు. మా కాలేజ్ పనిచేస్తూ ఉండటం తో... కాలేజ్ మూయించాలని లోపలికి ఒచ్చి... ఇంత భయానకంగా ... ఘోరంగా ప్రవర్తించారు. అయిదునిముషాల్లో పిల్లలందరిని ఇళ్ళకు పంపించేసాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రమాదం జరగ కుండా నిమిషాల మీద చర్య తీసుకొని... బయట పడగలిగాం. ఇంతా చేస్తే వాళ్ళు ఏ స్టూడెంట్ సంఘాల వాళ్ళు కాదట. ఉత్త రౌడీ మూకలని పోలీస్ ఆఫీసర్ చెప్పారు.

ఏమైనా జరిగి ఉంటే....మేమూ..మా పిల్లలూ...మా కాలేజ్...ఏమైపోయుండే వాళ్ళం. ఈ గొడవలతో ఎంతటి సెక్యూరిటీ కూడా సరిపోవటం లేదు.

మా కాలేజ్ పేరు చానల్స్ లో మోగిపోయి ఉండేదేమో! అమ్మో...అదేగనుక జరిగిఉంటే! ఇంకా ముందుకు ఊహించే శక్తి నాకు లేదు. ఎటువంటి ప్రమాదం లేకుండా బయట పడడం... మా అదృష్టం అనే అనిపిస్తోంది నాకైతే ... నేనైతే ఇంతకన్నా భయానక దృశ్యం నా జీవితంలో ఇప్పటివరకు చూడా లేదు. ఒక పట్టాన నా భయం పోలేదు.

నాకు ఇప్పటికీ....కళ్ళు మూస్తే చాలు....పరిగెత్తి పారిపోతున్న మా అమ్మాయిలే కనిపిస్తున్నారు.

కొసమెరుపేమిటంటే...రేపటినుంచి పదిహేను రోజులు ... తెలంగాణా లో ఉన్న అన్ని విద్యా సంస్థలకు శెలవులు ప్రకటించటం. రోజూ భయపడుతూ కాలేజ్ కి వెళ్ళోచ్చే కన్నా... ఇదే నయమనిపిస్తోంది.

నాకే రాజకీయాలు తెలియవు. కాని చాలా కాలానికి దొరికిన ఈ విశ్రాంతిని మాత్రం ఎలా సద్వినియోగం చేసుకోవాలా అన్న ఆలోచనలొ పడ్డాను.

వీలైనంత తొందరగా ఈ గొడవలు...భయాలు... సద్దుమణిగి పోతే బాగుండు!

మళ్ళీ ప్రశాంతంగా...ఎప్పటిలా...కళ కళ లాడే పిల్లల నవ్వులతో మా కాలేజ్ ఎప్పుడుంటుందో!!!


*******************************************************************








 

మనస్వి © 2008. Template Design By: SkinCorner