
కల్పనా రెంటాల గారి పోస్ట్ చూసాక నాక్కూడా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ రాయాలనిపించింది. రామాయణం, భారతం, ఎన్నో జానపద కథలతో పాటు మామూలు కథలు నేను చాలా పెద్దగయ్యే వరకూ వింటూనే ఉన్నాను. పదేళ్ళ వయసులో పథేర్ పాంచాలి చదివాను. ఆ తరువాత చందమామ, బాలమిత్రలు అలవాటయ్యాయి. నాకు ఇప్పటికీ నచ్చిన కథ ఒకటుంది. అదే కథ నా ఏడో తరగతి తెలుగు పుస్తకం లో కూడా మళ్ళీ చూసాను. అప్పుడు ఈ కథ చూసి చాలా సంతోషమేసింది. ఆ కథ మా అబ్బాయికి కూడా చెప్పేదాన్ని. అదే ’ఏడు గడియల రాజు” కథ.
*****************************************************************
అనగనగనగా ఒక చిన్న ఊళ్ళో ఒక నిరుపేద కుటుంబం ఎన్నో కష్టాల్లో బ్రతుకుతూ ఉండే వారు. తమకున్న కొంచెం భూమి లో సాగుచేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చేవారు. వాళ్ళబ్బాయే రాజు. ఎన్నో కోరికలతో అవి తీరక నిరాశ తో గడుపుతూ ఉండే వాడు.ఎలాగైనా గొప్ప ధనవంతుడ్ని కావాలని ఆశ పడుతూ ఉంటాడు. కొంచెం పెద్దయ్యాక ఇలా ఈ పల్లెటూల్లో లాభం లేదు, ఏదైనా పెద్ద ఊరికి వెళ్ళిపోతె ధనవంతుడై సుఖంగా ఉండొచ్చు అనుకుంటాడూ. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరుతాడు.
దారి మధ్యలో ఒక పెద్ద అడివి ఉంది. అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఒక చెట్టుకింద పడుకుంటాడు. చల్లటి గాలికి హాయిగా నిద్రపోతాడు. ఇంతలో ఒక పెద్ద పాము అతని వెనుకగా వచ్చి పడగ విప్పి ఆడుతూ ఉంటుంది. అటువేపే వెల్తున్న కొంతమంది బాటసారులది చూసి అబ్బురంగా రాజుని లేపుతారు. నీకు మహారాజ యోగం ఉంది. చాలా గొప్పవాడివౌతావు. అని చెప్పి ఆ బాటసారులెళ్ళిపోతారు. అది విని రాజు చాలా ఆనందపడి తిరిగి తన ఊరికి వెల్తాడు. తనకు మహారాజ యోగముంది, రాజు నౌతానని అందరికీ చెప్తాడు.
ఇలా అనుకుంటే కాదు, ఎదో ఒక రాజుని ఓడించి వెంటనే రాజైపోవాలనుకుంటాడు. తనకు సైనికులుగా ఉంటే తరువాత మంత్రి పదవులిస్తానని ఆశ పెట్టి పదిమంది స్నేహితులను పోగేస్తాడు. తన పొలం, ఉన్న రెండు పశువులను అమ్మి కొన్ని పెద్ద పెద్ద కత్తులు కొని, పొరుగు రాజుని ఓడించటానికి బయలుదేరుతాడు. అక్కడ కోట ద్వారం దగ్గరున్న కాపలా వారు పదిమందితో వచ్చిన రాజు ఆ కోట ఆక్రమించటానికొచ్చాడని తెలుసుకొని ఆశ్చర్య పోతారు. ఈ వార్త మహారాజు కి తెలియజేస్తారు. అదివిని మహారాజు కూడా ఇతని ధైర్యానికి ఆశ్చర్యపోయి వివరాలు కనుక్కొని రమ్మని తమ మంత్రులని పంపిస్తాడు. మంత్రులు రాజుని కలిసి వివరాలు తెలుసుకుంటారు. మంత్రులతో ఉన్న ఒక జ్యోతిష్కుడు, అవును ఇతనికి ఇప్పటినుంచి ఏడు గడియలు మహారాజ యోగం ఉంది, అతనిని ఎవ్వరూ ఆపలేరు అని చెప్తాడు. అది తెలుసుకొని మహారాజు తన మంత్రులతో అతనిని అడ్డగించవద్దని, మహారాజుని చెయ్యమని చెప్తాడు. తనపని ఇంత సులువుగా అయిపోయినందుకు రాజు కూడా సంతోషిస్తాడు.
అప్పటినుంచి రాజభోగాలనుభవిస్తూఉంటాడు. విందువినోదాలు, నృత్యవిలాసాలు కలలో కూడా కనివినీ ఎరుగని సకల వైభోగాలు అనుభవిస్తాడు. తన అదృష్టానికి ఎంతో సంతోషంతో తన గొప్పతనానికి ఆనంద పడిపోతూఉంటాడు. తన అభివృద్ధికి ఎంతగానో గర్వపడతాడు.
ఏడు గడియలు గడవగానే మహారాజు, రాజు ని అక్కడినుంచి తరిమేస్తాడు. రాజు ఏమీ చేయలేకపోతాడు. కోట బయటకు తరిమివేయబడ్డ తనను తానే చూసుకొని నమ్మలేకపోతాడు. ఇంతసేపు అనుభవించిన సంతోషం, సంపదా వైభోగాలు ఏమైపోయాయో అర్ధం కాదు. తిరిగి నిరాశ లో మునిగిపోతాడు. కాని, క్రమంగా తనున్న పరిస్థితికి కారణం తెలుసుకుంటాడు.
తన దురాశే తన దు:ఖానికి కారణం అని తెలుసుకుంటాడు. రాశే ఫలి కాదు, కష్టే ఫలి అని అర్ధం చేసుకుంటాడు. కష్టపడి సంపాదించిన దానిలోనే శాశ్వత ఆనందం, తృప్తి లభిస్తుంది కాని అడ్డదారులలో ఎప్పుడూ పరిపూర్ణత లేదు అని భావిస్తాడు. మన జీవితాలను నిర్దేశించేది మన ప్రయత్నాలే కాని జాతకాలు కాదు. ఈ విధంగా జ్ణానోదయమయిన రాజు తిరిగి తన ఊరికి వెళ్ళి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, జీవితం లో తృప్తిని అనుభవిస్తాడు.
*************************************************************************************