28, అక్టోబర్ 2011, శుక్రవారం

ఆ తరువాత ఏమిటి!!!



ఈ మధ్య చనిపోతే ఏమవుతుంది....చదువుతున్నవి...వింటున్నవి...ఎన్నో రకాల ఈ విషయాలలో ఏవి నిజం. నిజమెలా తెలవాలి... ఇదీ ఈ మధ్య నా బుర్ర తొలుస్తున్న అంశం.

మనకెంతో ఇష్టమైన, ప్రాణప్రదమైన వస్తువు పాడైతే ఎంతో బాధపడ్తాం. నచ్చిన చిన్న కుండ విరిగిపోయినా...ఆ ముక్కల్ని గోడకతికించుకొని కలకాలం చూసుకోవచ్చు. అదే ప్రియాతి ప్రియమైన మనుషులు చనిపోతే ఏనాటికీ అలా చేయలేము. ....అంతేనా...అంతే కాదు ఏ జంతువు చనిపోయినా ఎరువుగా వాడొచ్చుట...ఒక్క మనిషి శరీరం తప్ప!!! కాల్చాలే తప్ప మనిషి శరీరం పాతిపెట్టటం కూడా మంచిది కాదట. మరి, సింధూ నాగరికత నుంచి, పిరమిడ్ల ఆచారం వరకు చనిపోయిన మనిషిని పాతి పెడుతూనే ఉన్నారుగా. మరి 'మమ్మీ' ల సంగతేమిటి.

ఇంతేనా మనిషి విలువ?

అనుకోకుండా, మా ఫ్రెండ్ ని అడిగాను. చనిపోయిన తరువాత ఏమౌతుందో తెలుసుకునే ఒక మంచి పుస్తకం నాకేదైనాచెప్పు, చదవాలి అన్నాను. గరుడపురాణం చదువు. చాలా వివరంగా చనిపోయిన తరువాత ఏమవుతుందో, అంచెలంచెలుగా ఉంటుంది అందులో అంది. ఆ బుక్ ఇంట్లో ఉంచుకో కూడదు చదవకూడదు, అంటారుగా. ఇంక అంత ధైర్యం నాకెక్కడిది? ఎప్పుడంటే అప్పుడు అది చదవకూడదుగా? మరెలా అన్నాను. ఎవరన్నా పోయినప్పుడే అది చదువుతారు, ఆ సందర్భం లో కూడా వినకూడదని అంటారుగా అన్నాను. అదేంలేదు. వింటూ భయపడ్తారని, అలా అంటారు. అంతే. చదవచ్చు అంది. నిజమేనా! చదివితే ఏమీ కాదా. అయినా నాకు భయం బాబూ, అది చదవనులే యండమూరి అంతర్ముఖం బుక్ లో అంతా ఆత్మ ల గురించే రాసాడట, మల్లాది కూడా జయం బుక్ లో ఆటువంటి విషయాలే రాసాడుట. అదే ఏదో ఒకటి చదివితే సరి. కాస్త కథా..సస్పెన్స్ ఉంటుంది అన్నాను.



అసలు చనిపోయినాక ఏమీ జరగదు. మనకసలు ఏమీ తెలియదు. అంతే, అంతటితో మనకథ సమాప్తం. ఆ మాత్రం కూడా తెలియదా...అంది, అప్పటివరకు మా కబుర్లు వింటున్న మా ఫిజిక్స్ లెక్చరర్. అంతేనా...అలా ఎలా...మనకేమీ తెలియదంటే ఎలా. అదెలా ఉంటుంది. ఎంతకాలం. ఎప్పటికీ ఏమీ తెలియదా. అలా అగమ్యగోచరంగా ఎలా ఉంటుంది. ఊహూ, ఊహకందటంలేదు. ఏమీ తెలియకుండానే ఉండిపోతాము అంటే, అలా ఎంత కాలం....బోర్....అలా ఎలా!!! అదేనా ముక్తి అంటే, మోక్షం అంటే!!! మరి బొంది తో మోక్షం అంటే?

ఇంకో జన్మేదో ఉందనుకుంటూ ఈ జన్మంతా పూజలూ పునస్కారాలు చేసుకుంటూ ఏదో స్టోర్ అప్ చేసుకుంటూ...ఈ జన్మలో ఏమీ అనుభవించక పోతే, ఉన్న ఈ జన్మ కూడా వేస్టే ఫో. కుక్కలూ, ఎలుకలూ లాగే మనకు కూడా.. ఏ జన్మా లేదు ... అంటారు కొంతమంది. అంతేకాదు, మేము ఎథిస్ఠ్ లం అంటారు ఇంకొంతమంది. ఏవిటో, నా మీద ఇవన్నీ ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. మనిషి స్వభావం మీదే సంతోషం ఆధారబడి ఉంటుందట. అవునా...నిజమే అనుకుంటా....

ఎన్నో విషయాలు చెప్తున్న మన ఆధ్యాత్మిక గ్రంధాలకి ఆధారం ఏవిటి మరి. ఎలా చెప్ప గలిగారు? ఋజువులు ఏమున్నాయి. 'అనుభవజ్ఞులు' ఎవరైనా వ్రాసారా!!! ఆత్మ శాశ్వతమనే చెప్తున్నారు. పునర్జన్మ కూడా ఉందంటున్నారు. నేను చదువుతున్న ఆధ్యాత్మిక బ్లాగ్ లు కూడా గుర్తొచ్చాయి. చిన్నప్పటి నుంచి జీర్ణించుకుపోయిన ఈ ఆధ్యాత్మికత... పురాణాలు, భగవద్గీత....అబద్ధమెలా అవుతాయి? భవసాగరాలన్నీ దాటి నేను సాధించే యోగం ఎలాంటిదో మరి!!! బుద్ధి కర్మానుసారిణి యా లేక కర్మ నా బుద్ధిననుసరిస్తుందా...

మనిషి సర్వజ్ఞుడు. సర్వశక్తిశాలి. తనలోని అంతర్గత శక్తిని గ్రహించి సాధన చేయగలిగితే బంధాల నుంచి విముక్తుడవుతాడు. అదే మానవుడి ధ్యేయం కావాలి. పరమాత్మా నీవేనా గొప్పవాడివి...నీ అంతటి వాళ్ళం ఏదో ఒక నాడు మేమూ కాబోతున్నామని ఆ దైవాన్ని సవాలు చేయగల మహత్తు మనలోనూ ఉంది అని నా నమ్మకం. మనలోని ఆత్మ ఆ పరమాత్మని చేరుకోవాలని ఎప్పుడూ ఆరాట పడుతూనే ఉంటుంది. ఇక్కడేగా జంతువులకీ మనకీ తేడా. ఒక వరాహము, ఓ చిలుక ఈ మధ్య దేవుని దగ్గర చూపిన భక్తి గుర్తొస్తోంది. అంటే, జంతువులకి కూడా, పరమాత్మ జ్ఞానం ఉందనేగా...

నిశ్చల మనస్తత్వం, సవాళ్ళను ఎదుర్కోగలిగే సామర్ధ్యాన్ని సంపాదించుకోటానికి....రవిశంకర్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' కూడా నేర్చుకున్నాను. ఆ సుదర్శనక్రియ నాలో ఏ మార్పు తెచ్చినట్లు లేదు. ఈ శ్వాస మీద ధ్యాస ఊపిరి ఆపేస్తుందేమో....అయితే మిగిలేది శవమేగా!!! మరి ఆ తరువాతో....ఏమోమరి. పోనీ, స్వర్గమా...నరకమా? దేనికిపోతాను. అసలున్నాయా అవి?

మేము చిన్నప్పుడు అనుకునే వాళ్ళం. మంచివాళ్ళైతే మంచి దెయ్యాలు, చెడ్డ వాళ్ళైతే చెడ్డ దయ్యా లు గా మారుతారుట. దయ్యాలను పిలవటానికి Ouija Board ఆడేవాళ్ళం. ఏనాడు కనీసం ఒక పిల్ల దయ్యమైనా వచ్చిన గుర్తేలేదు. మరి దయ్యాలకి మళ్ళీ జన్మ ఉంటుందా? ఎప్పటికీ దయ్యాలేనా...అసలు దయ్యాలు ఉన్నాయా. నాకైతే ఏ దయ్యమైనా భయమే. నేను దయ్యమైతే ఎలా? నేను కూడా నిను వీడని నీడను నేనే....అని పాడుకుంటూ తిరగాలా... తెలుగు దయ్యం గానే పుట్టాలని ష్యూరిటీ ఏంటట!!!! ఒకవేళ హిందీ దయ్యం అయితే...బాత్ పురానీ హై...అబ్ సోచూం తూ నహి భూలే...అనుకుంటూ ఏదో పాడాలనుకుంటా...

ఎన్నో సినిమాల్లో చూస్తూనే ఉన్నాంగా, దయ్యాల గురించి. ఎవరినైనా పట్టుకున్నా వాళ్ళు మన చేతికి తగలరు. వాళ్ళల్లోంచే గాలి లాగా రయ్యిన వెళ్ళిపోవచ్చు. అందరినీ మనం చూడగలం. గోడల్లోంచి కన్నాల్లోంచి చాలా ఈజీ గా వెళ్ళిపోవచ్చు. ఎవరికీ కనబడం. కనబడ్డా, మనమంటె వాళ్ళకి చాలా భయం. మాయలు మంత్రాల శక్తి ఉంటుంది. ఇంద్రజాల మహేంద్ర జాలాలు గిర్రుగిర్రున చూపించొచ్చు. మనుషుల్ని ఆవహించి మన ఇష్టమొచ్చినట్లు చేసేయొచ్చు. కాళ్ళు పొయ్యిలో పెట్టి వంట చేసేయొచ్చు. అందమైన అమ్మాయిగా మారి పోవచ్చు. లేకపోతే విఠలా చార్య చూపించినట్లు హంస గానో, ఏ వన్నెచిన్నెల నెమలి గానో మారిపోవచ్చు, ఏవేవో పిచ్చి రూపాల్లోకి కాకుండా. మనకి నచ్చని వాళ్ళని దెయ్యం పాటలతో భయపెట్టొచ్చు. మన వాళ్ళకి కావాల్సిన హెల్ప్ లన్నీ చేసుకోవచ్చు కూడా. కొన్నిసార్లు అలా దయ్యం గా ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది కూడా. మనిషి కంటే దయ్యమే బెటరా!!!

ఏది ఏమైనా, నాకు దయ్యం అవటం ఎంత మాత్రం ఇష్టం లేదు.....మరి నేను చనిపోయిన తర్వాత.....ఆ తరవాత ఏంటి!!!!!!

బదులు తోచని ఈ ప్రశ్నలు....ఏమిటో...ఇలా.



"ఆత్మే ప్రపంచమైంది. ఏకంగా ఉన్న ఆత్మ అనేకంగా అవ్వాలని కోరుకుని అసంఖ్యాక రూపాలలో అంతరాత్మగా వచ్చింది. పదార్ధస్థాయి నుంచీ మనసు వరకు పరిణామంలో పెరిగింది. రూపాలలోని అంతరాత్మ పరిపూర్ణమైన ఆత్మగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ ఎంత సత్యమో అంతరాత్మ అంతే. ఉపనిషత్తులలో సత్యం, పరస్పర వైరుధ్యాల ద్వారా ప్రకటన అయింది. వ్యక్తికి, విశ్వానికీ, ఆత్మకి గల సంబంధం తెలిస్తేనే సర్వం తెలుస్తుంది. జన్మల పరంపర ద్వారా అంతరాత్మ అనేక అనుభవాలు పొంది, ఆత్మగా ఎదుగుతుంది. ఆత్మ శాశ్వతం. లేదా తన ఇష్టమైన రూపం పొందగలుగుతుంది." చివరికి నేను స్థిరపడింది..దివ్యఋషుల ఉవాచ ఉపనిషత్తుల తోనే.....



******************************************************************************************************

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

’నే చూసిన దసరా మంటపం ’

సకల జనుల సమ్మె......
రాజధాని బంద్......
నేను కూడా ఫ్రీ:)
చక్కగా దొరికిన ఈ అవకాశం. ఏం చేయాలి. అవునూ...ఎంతో అందమైన అమ్మవారి మంటపాలు చూసి రావచ్చుకదా! అనుకున్నాను. ఇదిగో, నేను చూసిన ఒక అందమైన దసరా మంటపాన్ని మీరు కూడా చూడండి మరి. నాకు తెలుసు...మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ పాటికే మీరు చాలా చూసేసే ఉంటారు. అయినా సరే, ఇది కూడా చూసేయండి మరి.


ఎంతో అందమైన ఈ దీప తోరణాలు మనల్ని ఆహ్వానిస్తాయి. అందమైన స్వాగతాలు పలుకు తాయి.


అదిగో అల్లంత దూరాన ఎత్తైన ఆ గుడి గోపురం మనల్ని పలకరిస్తుంది. అనంత పద్మనాభ దేవాలయం సొగసులు ఇక్కడ పొందుపరిచారు. ఆ నేలమాళిగలు ద్వారాలుగా రూపుదిద్దుకున్నాయి. చూడండి, ఎంత అందంగా ఉందో!!!


ఇదే ఆ నేల మాళిగ తలుపు. పక్కనే నాగబంధం, వినాయకుడు, గోడమీద దేవతా విగ్రహం కూడా చూడొచ్చు.









మెట్లెక్కి లోనికి ప్రవేశించాలి. అక్కడే మనకు నిలువెత్తు అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తాడు. ఆ పక్కనే మునులు యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నారు.





ఇక్కడినుంచి సన్నటి ద్వారం గుండా లోనికి ప్రవేశించాలి. ఇక్కడ మనకి అగ్నిపరీక్ష. అంటే నిప్పులమీద నడచిపోవాలన్న మాట:) ఇదిగో ఇలాగ.



మెలికలు తిరిగిన ఆ దారిలో ఒక పులి కూడా ఉంది. మనల్ని పలకరిస్తోందా!!!! తస్మాత్, జాగ్రత్త అంటోందా!!!!!



ఆ తరువాత మనం ఈ 'లక్ష్మణ ఝూలా' కూడా దాటాలి. ఇక్కడ కొంతమంది మునీశ్వరులు తపస్సు కూడా చేసుకుంటున్నారు.




ఆ తరువాత ఒక సన్నని గుహ లోకి ప్రవేశించాలి. పాపం ఆయనెవరో!!! ఆయనకి తెలీదు ఆయన ఫీట్ నేను ఫొటో తీస్తున్నానని:)


హు: అప్పుడే ఎక్కడయిందండీ, బాబు. ఇప్పుడు మనం ఈ వైతరిణి దాటితే తప్ప ఆ అమ్మవారు మనకి దర్శనమివ్వదు.


ఈ దీర్ఘ ప్రయాణం తర్వాత, ఇంక మనం గర్భ గుడిలోకి ప్రవేశించినట్లే. అదిగో, చూడండి. ఆ జగజ్జనని శ్రీమతా దుర్గాదేవి దివ్యమంగళ స్వరూపం. అక్కడి దీపాల వెలుగులో, రకరకాల రంగులలో, మిరుమిట్లు గొలిపే ఈ ప్రాంతం, దివ్యలోకాన్ని చూపిస్తోంది.


ఇంతటి దివ్యమంగళ స్వరూపం మనలో భక్తి భావాలను తట్టి లేపుతుంది. ఈ హారతులు, ఇక్కడ ఆలాపించే కీర్తనలు పరవశింప చేస్తాయి.






పవిత్రమైన ఈ తపోవనాలను దాటుకుంటూ, మెల్లిగా...బయటి ప్రపంచంలో మళ్ళీ ప్రవేశిస్తాం.....



ఇక్కడ మనల్ని రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి.


ఇక్కడే మనకు ప్రసాదాలు, కావలసిన వారికి చల్లటి నీరు, శీతలపానీయాలు లభిస్తాయి.






ఈ గుడి ప్రాంగణంలో కూర్చుని, కార్యక్రమాలను వీక్షిస్తూ, ఫలహారాలు, పానీయాలు సేవిస్తూ......ఎంతకాలమైనా హాయిగా గడిపేయొచ్చు కదూ....



బాగుందా! నా తీర్ధయాత్ర.:)
దసరా పండుగలోని ఈ సరదాలు ఎంతో తృప్తినిస్తాయి. అలరిస్తాయి. అలసిన మనసును సాంత్వన నిస్తాయి. ఈ తొమ్మిది రోజులు స్వర్గలోకాన్నే చూపిస్తాయి. మీరందరు కూడా నవరాత్రు లు బాగా సరదాగా, జరుపుకోవాలి. శుభాకాంక్షలు........

******************************************************************************************

13, ఆగస్టు 2011, శనివారం

వరమహాలక్ష్మి దీవించవమ్మా...



మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.

బాగున్నారా....మా అమ్మవారు.

పోయిన సారి ఫొటో తీసుకోలేకపోయాను. పైగా కొన్ని కష్టాలు కూడా ఎదుర్కున్నాను. అందుకే ఈ సారి జాగ్రత్తగా, అసలెక్కడికీ పోకుండా శ్రద్ధగా ఇంట్లోనే అన్నీ చేసుకుంటూ ఉండిపోయాను. మా సుజాత కొడుకు చింటు గాడు, ఈ సారి నాకు అసిస్స్టెంట్. వాడి అక్క సోనీ నా కుడిచెయ్యి. ఆ పిల్ల ఎప్పుడూ నా వెనకాల ఉండాల్సిందే. ఈ పిల్ల నా పెంపుడుకూతురన్నమాట.

ఈ సారి పూజకి నాతోపాటు, మా స్నేహాలయ అమ్మాయిలు నలుగురిని, మా లక్ష్మిని కూడా పిలిచి, అందరం కలసి చేసుకున్నాం. వాళ్ళు ఎంత సంతోషించారో. హుషారుగా అన్ని పనులు వాళ్ళే చేసిపెట్టారు కూడా. చక్కగా తోరణాలు కట్టారు. ముగ్గులేసారు. ఎంతముద్దుగా ఉన్నాయో.

అమ్మవారిని తయారుచేసుకోటానికి చాలా సహాయం చేసారు. ఈ చిన్ని పిల్లలే ఈ సారి నాకు ముత్తైదువులు. వేరే ఎవ్వరినీ నేను పేరంటానికి పిలువలేదు. వాళ్ళే ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నారు. వ్రతకథ చక్కగా విన్నారు. నాక్కూడా వాళ్ళే భోజనాలు వడ్డించారు. అందరం సరదాగా అమ్మవారి కీర్తనలు పాడుకుంటూ భోంచేసాం. ఆ పిల్లల ఆనందం చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయింది.

సాయంత్రం కూడా చక్కగా మేమందరం కలిసి గుడికి వెళ్ళాం. ఈ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది.

వరలక్ష్మీ దేవి నా ఈ పిల్లలందరినీ కలకాలం సుఖంగా ఉండేట్లు దీవించుతల్లి.....

మీరు కూడా నా పిల్లల్ని దీవిస్తారు కదూ!!!!


వరలక్ష్మీ రావే మా ఇంటికి...క్షీరాబ్ధి పుత్రి...వరలక్ష్మి రావే మా ఇంటికీ.....



***********************************************************************************************************************************************************
 

మనస్వి © 2008. Template Design By: SkinCorner